కోటగిరి జనవరి 25 : వారందరూ కింది స్థాయి సిబ్బంది.. తమ విధుల్లో ఎటువంటి లోపం లేకుండా నిర్వహిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విపత్కర సమస్యలను సృష్టించింది. మళ్లీ కొవిడ్పై ఆందోళన చెందకుండా క్షేత్ర స్థాయిలో ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు వ్యాక్సినేషన్పై అవగాహన కల్పిస్తున్నారు. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణ చర్యలు వివరిస్తున్నారు. మరోవైపు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను చైతన్యవంతం చేయడంలో నిమగ్నమవుతున్నారు.
కరోనా సమయంలో వైద్య ఆరోగ్యశాఖ సేవలు మర్చిపోలేనివి. అందులోనూ ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తల సేవలు అమోఘం. కోటగిరి ఉమ్మడి మండల వ్యాప్తంగా 18 ఏఎన్ఎంలు, 51 మంది ఆశ కార్యకర్తలు, ముగ్గురు సూపర్వైజర్లు విధులు నిర్వహిస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ అనారోగ్య సమస్యలుంటే మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ప్రభుత్వం అందించే మందులు అందజేయడమే కాకుండా ఆరోగ్య పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
కరోనా వ్యాప్తి నుంచి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తల బాధ్యతలు మరింత పెరిగాయి. మరోవైపు సీజనల్, అంటు వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు, వ్యక్తిగత, పరిసరాల శుభ్రత తెలియజేస్తున్నారు. మళ్లీ కరోనా కేసులు నమోదు అయితే ప్రజలను వాటి నుంచి రక్షించేందుకే క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. ఉదయం లేచింది మొదలు గ్రామాలు, కాలనీల బాట పడుతున్నారు. ఇంటింటికీ వెళ్లి టీకాల ఆవశ్యకత, పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామ కూడళ్లు, పంట చేలల్లో, ఆటోలు, బస్సులు తదితర అవకాశాలను సద్వినియోగం చేసుకుం టూ ముందుకు సాగుతున్నారు. వారి కృషి ఫలితంగా కోటగిరి ఉమ్మడి మండల వ్యాప్తంగా కొవిడ్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తయింది.
గ్రామాల్లోని ప్రజలకు వైద్య ఆరోగ్య శాఖ జారీ చేసిన ఆరోగ్య సూచనలను తప్పనిసరిగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా గర్భిణులు, వృద్ధులు, చిన్నారులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సమగ్రంగా వివరిస్తున్నాం. ప్రతి ఒక్కరికీ పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నాం.
– నాగమణి, ఆశ వర్కర్, పొతంగల్
ఇప్పటికీ టీకాలు వేయించుకోని వారి వివరాలను సేకరించి వారి ఇండ్లకు వెళ్లి టీకా తీసుకోవడం తో కలిగే ప్రయోజనాల గురించి వివరిస్తున్నాం. టీకాపై ఉన్న భయాన్ని తొలగిస్తున్నాం. అంటు వ్యాధులతో కలిగే అనర్థాలు, ఆరోగ్య సూచనలు, జాగ్రత్తలు తెలియజేస్తున్నాం.
-సంగీత, ఏఎన్ఎం, పొతంగల్
ప్రతి ఒక్కరూ ఆరోగ్య జాగ్రత్తలు తప్పని సరిగా పాటించాలి. రోగాలు విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యక్తిగత, ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి. అర్హులు కొవిడ్ టీకా తీసుకోవాలి. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు జాగ్రత్తగా ఉండాలి.
– డాక్టర్ కరణ్, వైద్యాధికారి,
పీహెచ్సీ, పొతంగల్