నిండుకుండల్లా మారిన తటాకాలు
రెండు రోజుల వానలకే జలకాంతులు
నిజామాబాద్లో 67శాతం చెరువుల్లో అలుగు
ప్రమాదాలు జరగకుండా ఇరిగేషన్ శాఖ అప్రమత్తత
నిజామాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నింగి నుంచి నేలకు రాలుతున్న ఒక్కో చినుకు బొట్టు… వరదై వాగులు, వంకలు, కాలువల గుండా ప్రవాహమై చెరువులకు చేరుతున్నది. చెరువులు నిండి అలుగులు పోస్తూ జల జీవాలను ఎగిరి దుంకిస్తూ ముందుకు కదులుతున్నాయి. తటాకాలను దాటుకొని వచ్చే జలాలు తిరిగి వాగుల ద్వారా నదులకు చేరి, నదీ ప్రవాహం కాస్తా జీవనది గోదావరితో సంగమించి ఉగ్రరూపం దాల్చుతోంది. ఇలా నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో ఏమూలకు ఎంత భారీ వర్షం కురిసినా వాటి గమ్యస్థానం మాత్రం ఒక్కటే. మంజీర రూపంలోనైనా, భారీ వాగులు, వంకల్లో వచ్చే వరదైనా చివరాఖరకు వివిధ ప్రాంతాల్లో గోదావరిలో కలవడమే. అతి భారీ వానలతో ఉమ్మడి జిల్లాలో నమోదైన భారీ వర్షపాతం కొన్నిచోట్ల ఉపద్రవాన్ని సృష్టిస్తే మరికొన్ని చోట్ల చెరువులను రికార్డు సమయంలో నిండుకుండల్లా మార్చేసింది. ఇలా ఉభయ జిల్లాల్లో వందలాది చెరువులు ఇప్పుడు కొంగొత్త జల కాంతులతో దర్శనమిస్తున్నాయి. గతేడాది ఇదే రీతిలో కురిసిన వానలతో జలాశయాల్లో నీటి నిల్వ ఉండడం… దీనికి ఈ భారీ వానలు తోడవ్వడంతో త్వరగా అలుగులు పోసినట్లుగా అవగతమవుతున్నది.
తక్కువ సమయంలోనే..
నిజామాబాద్ ఇరిగేషన్ సీఈ పరిధిలో 968 చెరువులు, కుంటలున్నాయి. ఇందులో కుండపోత వానలతో సగానికి ఎక్కువ తటాకాలు మత్తడి దుంకుతున్నాయి. రోజురోజుకూ అలుగులు పోస్తున్న చెరువుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. 50-75శాతం మేర నీటి నిల్వతో ఉన్న చెరువుల సంఖ్య కేవలం 20 మాత్రమే ఉన్నాయి. ఇవి కూడా కాలువలు సరిగా లేకపోవడం, వరద నీటి ప్రవాహానికి ఆటంకాలు ఉండడంతోనే నీటి జాడ తక్కువగా ఉంది. ఇక 297 చెరువుల్లో 75-100 శాతం మేర నీళ్లు వచ్చి చేరాయి. ఇవి కూడా మరో భారీ వర్షంతో అలుగులు దుంకడం ఖాయం. అతి భారీ వానలతో ఏర్పడిన వరదతో ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాలో 651 చెరువులు అలుగులు పోస్తున్నాయి. మొత్తం చెరువుల్లో మత్తడి పోస్తున్నవి 67శాతంగా ఉండడం విశేషం. తక్కువ సమయంలో ఎక్కువ చెరువుల్లోకి ఇంతగా వాన నీరు వచ్చి చేరడం అరుదుగా జరుగుతుందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు.
కామారెడ్డిలో ఇలా..
కామారెడ్డి జిల్లాలో చెరువులు, కుంటల సంఖ్య భారీగా ఉంది. సీఈ పరిధిలో చిన్న, మధ్య, భారీ ప్రాజెక్టులు మినహాయిస్తే 2168 జలాశయాలున్నాయి. వీటిలో అత్యధిక తటాకాల్లో నీరు భారీగానే నిలిచింది. కామారెడ్డిలో భారీ వానల మూలంగా ఊహించిన దానికన్నా ఎక్కువ చెరువులే మత్తడి పోస్తున్నాయి. మొత్తం జలాశయాల్లో 26 శాతం మేర తటాకాలు పొంగిపొర్లుతున్నాయి. 582 అలుగు పోస్తున్నవి, 829 చెరువులు రేపోమాపో మత్తడి దుంకనున్నాయి. 520 చెరువుల్లో 50-75శాతం మేర నీటి నిల్వ ఉంది. 278 చెరువుల్లో 25-50శాతం, 59 చెరువుల్లో 0-25 శాతం మేర నీరు వచ్చి చేరింది. మరికొన్ని రోజులపాటు భారీ వర్షాలు కురిస్తే ఈ నెలాఖరులోగా జిల్లాలోని చెరువులన్నీ ఉప్పొంగి ప్రవహించడం ఖాయంగా కనిపిస్తున్నది.