కామారెడ్డి, మార్చి 28: జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ ఆదనపు కలెక్టర్ చంద్రమోహన్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్లో యాసంగి సీజన్ (2023-2024) ధాన్యం కొనుగోళ్లపై కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు, వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. లోక్సభ ఎన్నికలకోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ కొనుగోలు కేంద్రాలను ఆధికారులు, ఆయా శాఖల బాధ్యులు మాత్రమే ప్రారంభించాలని సూచించారు.
ఎక్కడా కూడా ప్రజాప్రతినిధులను ఆహ్వానించరాదన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తప్పనిసరిగా టెంట్లు, తాగునీరు, విద్యుత్ సదుపాయం కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో మద్దతు ధరకే విక్రయించాలని సూచించారు. ప్రభుత్వం గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యానికి రూ.2,203, బీ గ్రేడ్ రకానికి రూ.2,183 నిర్ణయించినట్లు తెలిపారు.
యాసంగి సీజన్ కోతలు మొదలైన దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని మండలాల్లో ఏప్రిల్ 1 నుంచి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ కొనుగోళ్లను సజావుగా నిర్వహించాలి అంచనాల మేరకు జిల్లాలో యాసంగి సీజన్లో దాదాపు 4.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు రానున్నదని తెలిపారు. ధాన్యాన్ని సేక రించేందుకు పీఏసీఎస్ ఆధ్వర్యంలో 326, ఐకేపీ ఆధ్వర్యంలో 22 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు చెప్పారు.