నిజాంసాగర్/పిట్లం, నవంబర్ 23: జిల్లాలోని ధాన్యం కొనుగోళ్లను వారం రోజుల్లో వందశాతం పూర్తిచేస్తామని అదనపు కలెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. నిజాంసాగర్, పిట్లం మండలాల్లో కొనసాగుతున్న కొనుగోలు కేంద్రాలను బుధవారం తనిఖీ చేశారు. నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట, మాగి, పిట్లం మండలంలోని తిమ్మానగర్, రాంపూర్, పిట్లం గ్రామాల్లో ధాన్యం సేకరణను పరిశీలించారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను సేకరించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రాలకు రైతులు తెచ్చిన ధాన్యాన్ని వెంటనే తూకంవేసి రైస్మిల్లులకు తరలించాలని సూచించారు.
కొనుగోళ్ల వివరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. రైతుల బ్యాంకు ఖాతాల్లో ధాన్యం డబ్బులు త్వరగా జమయ్యేలా చూడాలన్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని నిర్వాహకులకు సూచించారు. అంతకుముందు మాగి శివారులోని రైస్మిల్లో కస్టమ్ మిల్లింగ్ను పరిశీలించారు. మిల్లులకు తెచ్చిన ధాన్యం బస్తాలను వెంటవెంటనే అన్లోడ్ చేసి వాహనాలను తిరిగి పంపించాలని యజమానికి సూచించారు. ఆయన వెంట డీసీవో వసంత, తహసీల్దార్లు నారాయణ, రామ్మోహన్రావు, సొసైటీ చైర్మన్లు నర్సింహారెడ్డి, శపథంరెడ్డి, సాయిరెడ్డి, సీఈవోలు అశోక్గౌడ్, సంతోష్రెడ్డి, సంగమేశ్వర్గౌడ్, సర్పంచులు అంజయ్య, అనుసూయ, నాయకులు రమేశ్, రాజం, సాయిలు ఉన్నారు.