బాన్సువాడ, నవంబర్ 21: కాంగ్రెస్ పార్టీ నుంచి బాన్సువాడలో పోటీ చేస్తున్న ఏనుగు రవీందర్రెడ్డి గజదొంగ అని, ఆయనతో జాగ్రత్తగా ఉండాలని బాధితులు సూచించారు. తమ భూములతోపాటు సర్కారు జాగాలను కూడా మింగేశాడని ఆరోపించారు. రవీందర్ రెడ్డి స్వగ్రామమైన తాడ్వాయి మండలం ఎర్రపహాడ్ గ్రామానికి చెందిన దళిత భూబాధితులు చిట్యాల సాయన్న, దుర్గవ్వ, గాదె బాలయ్య బాన్సువాడలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. 40 ఏండ్ల క్రితం అప్పటి ప్రభుత్వం 25 మంది లబ్ధిదారులకు 30 ఎకరాల అసైన్డు భూమిని ఇచ్చిందన్నారు. పక్కనే ఉన్న 300 ఎకరాల భూమిని ఏనుగు రవీందర్ రెడ్డి కొనుగోలు చేసి దళితుల భూములను కూడా కబ్జా చేశాడని ఆరోపించారు.
దీనిపై ప్రశ్నిస్తే దౌర్జన్యం చేసి, పోలీసు స్టేషన్లో వేసి కొట్టించాడన్నారు. ఈ భూముల విషయంలో ఎన్నో రోజులు తాము నిరాహార దీక్ష చేపట్టామన్నారు. నాయకులను కలిసి వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. భూ సర్వే చేసిన అధికారులకు డబ్బులను ఎరజూపి లొంగదీసుకున్నాడని, తమకు కూడా ఎంతోకొంత ముట్టజెప్పాలని చూశాడని అయినా తాము ఒప్పుకోలేదన్నారు. భూములే కావాలని పట్టుబడితే ఎల్లారెడ్డి, కామారెడ్డిలో కేసులు పెట్టించాడని, పోలీసులతో కొట్టించాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూ బకాసూరుడిని నమ్మి ఓటేస్తే బాన్సువాడ నియోజకవర్గ ప్రజలు కూడా మోసపోతారని అన్నారు.