వినాయక్నగర్, ఫిబ్రవరి 18: నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ఐదో టౌన్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. న్యాల్కల్ రోడ్డులో ఉన్న స్మార్ట్ సిటీ వెంచర్లో వాకింగ్కు వెళ్లిన పలువురు ఆదివారం ఉదయం మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. నగరంలోని సీతారాంనగర్ కాలనీకి చెందిన శ్రావణ్కుమార్ (35) ఖలీల్వాడిలోని ఓ ప్రైవేట్ దవాఖానలో కంపౌండర్గా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం శ్రావణ్కుమార్ తన ఫోన్ను పోగొట్టుకోవడంతో దవాఖానలోని తోటి సిబ్బంది సెల్ఫోన్ నుంచి శనివారం రాత్రి 8 గంటల సమయంలో తన భార్యకు ఫోన్ చేసి.. ఇంటికి రావడం ఆలస్యమవుతుందని సమాచారం ఇచ్చాడు. ఆదివారం ఉదయం తన భర్త హత్యకు గురైనట్లు తెలియడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది.
న్యాల్కల్ రోడ్డులో ఉన్న స్మార్ట్ సిటీ వెంచర్లో శ్రావణ్కుమార్ మృతదేహం కనిపించడంతో నిజామాబాద్ ఏసీపీ ఎల్.రాజా వెంకట్రెడ్డితో పాటు నార్త్ రూరల్ సీఐ ఎస్.సతీశ్ కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తలపై వాష్ రూంలో వినియోగించే టాయిలెట్ బేషన్తో బలంగా మోది హత్యచేసినట్లు గుర్తించారు. శనివారం రాత్రి సమయంలో హత్య జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. హత్యజరిగిన ప్రదేశంలో మృతుడికి సంబంధించిన ద్విచక్రవాహనం (యాక్టివా)తోపాటు కల్లు ప్యాకెట్, మద్యం సీసాలను గుర్తించారు. ఎవరితోనైనా కలిసి మద్యం తాగిన అనంతరం ఏదైనా గొడవ జరిగి, హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతుడికి భార్య షర్వానీ, పాప (7), బాబు(4) ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఐదో టౌన్ ఎస్సై అప్పారావు తెలిపారు.