నిజామాబాద్ క్రైం, జనవరి 7: నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్కుమార్ తన కార్యాలయంలో సౌత్ రూరల్ సీఐ వి.వెంకటనారాయణ, రూరల్ ఎస్సై జి.మహేశ్తో కలిసి ఆదివారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడి కుడి చేతిపై ఉన్న పచ్చబొట్టు ఆధారంగా ఇంద్రాపూర్ కాలనీకి చెందిన గర్డ్కర్ సయాజీ(35)గా నిర్ధారించి కేసు దర్యాప్తు చేపట్టారు. సయాజీ తరచూ మద్యం సేవించి భార్య అశ్వినిని వేధించేవాడు. ఈ క్రమంలో అశ్వినికి తన మేనత్త కొడుకు అయిన రామ్ జింజోర్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నెల 3వ తేదీన సయాజీ తాగి వచ్చి అశ్వినిని కొట్టి ఇంట్లోంచి బయటికి వచ్చేశాడు. దీంతో ఆగ్రహించిన అశ్విని విషయాన్ని ప్రియుడు రామ్ జింజోర్కు తెలిపి.. భర్తను ఎలాగైనా అడ్డుతొలగించాలని ప్లాన్ వేశారు.
ఇందులో భాగంగా రామ్ జింజోర్, సయాజీ ఇద్దరు కలిసి మల్లారం అటవీ ప్రాంతానికి వచ్చి మద్యం సేవించారు. అనంతరం రామ్ జింజోర్ తన వెంట తీసుకువచ్చిన కత్తితో సయాజీ గొంతు కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి వచ్చి విషయాన్ని అశ్వినికి చెప్పాడు. ఘటనపై సౌత్ రూరల్ సీఐ వెంకటనారాయణ ఆధ్వర్యంలో ఎస్సై మహేశ్ తన బృందంతో కలిసి దర్యాప్తు నిర్వహించారు. హత్య కేసులో అశ్విని, రామ్ జింజోర్ను అరెస్టు చేసి వారి వద్ద హత్యకు వినియోగించిన కత్తి,రెండు సెల్ఫోన్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకొని రిమాండ్కు తరలించినట్లు ఏసీపీ కిరణ్ కుమార్ తెలిపారు. కేసును ఛేదించిన సిబ్బందిని అభినందించారు.