మోర్తాడ్, నవంబర్ 28: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన ప్రకృతివనాలు, మండల కేంద్రాలతోపాటు ప్రభుత్వభూముల్లో ఏర్పాటు చేసిన బృహత్ప్రకృతి వనాలు ప్రస్తుతం చిట్టడవులను తలపిస్తున్నాయి. గ్రామాలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. అడవులు అంతరిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మళ్లీ పూర్వపరిస్థితి వస్తుంది.
ఏపుగా పెరిగిన చెట్లు..
మోర్తాడ్ మండల కేంద్రంలోని బృహత్ప్రకృతి వనాల్లో 30వేలమొక్కలను నాటారు. మండల పరిషత్ కాంప్లెక్స్ సమీపంలో ఏర్పాటు చేసిన బృహత్ప్రకృతివనంలో 24వేల మొక్కలు, పక్కనే సీఎం పుట్టినరోజును పురస్కరించుకుని గ్రీన్చాలెంజ్లో భాగంగా వేయి జామ, మామిడి, అల్లనేరేడు మొక్కలను నాటారు. మరో రెండు ప్రాంతాల్లో ఐదువేల మొక్కలను నాటారు. ప్రస్తుతం ఈప్రాంతాలన్నీ చిట్టడవులను తలపిస్తున్నాయి. రెండేండ్ల క్రితం నాటిన మొక్కలు ఏపుగా పెరగడంతో అడవులను తలపిస్తున్నాయి. ఈప్రాంతాలను చూసిన వారికి ఎంతో ఆహ్లాదం కలుగుతున్నది. ఎప్పుడో చూసిన అటవీప్రాంతాలు.. ఇప్పుడు చూస్తున్నట్లు అనిపిస్తుంది.
అధికారుల ప్రత్యేక శ్రద్ధ
బృహత్ ప్రకృతివనాలను పెంచే విషయంలో ఎంపీడీవో శ్రీనివాస్రెడ్డి, ఎంపీవో శ్రీధర్, ఏపీవో శకుంతల, కార్యదర్శి రామకృష్ణ, సర్పంచ్ బోగ ధరణి ప్రత్యేక శ్రద్ధ చూపడంతో మొక్కలు ఏపుగా పెరిగి అటవీ ప్రాంతాలను తలపిస్తున్నాయి. బృహత్ప్రకృతి వనంలో నాటిన మొక్కలను సంరక్షించే విధంగా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం అడవులను తలపించేలా చెట్లు పెరిగాయి. మొక్కలు నాటినప్పటి నుంచి పర్యవేక్షించడంతోపాటు మొక్కలకు నీళ్లు పట్టించడం, మొక్కల చుట్టూ సాసర్లను ఏర్పాటు చేయించారు. ఎక్కడైనా మొక్కలు చనిపోతే తిరిగి నాటించారు. దీంతో ప్రస్తుతం బృహత్ ప్రకృతివనాలు అడవుల్లా మారాయి.
అడవుల్లా కనిపిస్తున్నాయి
బృహత్ప్రకృతి వనాలు అడవుల్లా కనిపిస్తున్నాయి. నాలుగు ప్రాంతాల్లో నాటిన 30వేల మొక్కలను సంరక్షించే విషయంలో అధికారులు చేసిన కృషి అభినందనీయం. ఎప్పటికప్పుడు ఈజీఎస్ కూలీలతో నీళ్లు పట్టించడం, మొక్కలు చనిపోతే తిరిగి నాటించడంతో అడవిలాంటి ప్రకృతివనాలను చూడగలుగుతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మహత్తర కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించడం సంతోషకరం.
– బోగ ధరణి, సర్పంచ్ మోర్తాడ్