కామారెడ్డి,డిసెంబర్ 14 : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. సిరిసిల్ల రోడ్లో ఉన్న ప్రముఖ షాపింగ్ మాల్లో బుధవారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నది. దీంతో షాపింగ్ మాల్లోని నాలుగు అంతస్తులు కాలి బూడిదయ్యాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వెంటనే సంఘటనా స్ధలానికి చేరుకొని మంటలను ఆర్పడానికి విశ్వ ప్రయత్నాలు చేశారు.
బుధవారం రాత్రి 12 గంటల నుంచి యత్నించగా గురువారం మధ్యాహ్నం మంటలు అదుపులోకి వచ్చాయి. మంటలు భారీగా చెలరేగడంతో చుట్టు పక్కల వ్యాపారులు ఆందోళనకు గురయ్యారు. రాత్రి షాపింగ్ మాల్ ఏరియాలో కరెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. సుమారు రూ.5 కోట్లకు పైగా ఆస్తినష్టం జరిగి ఉండవచ్చని తెలుస్తున్నది. రాత్రి షాపింగ్ మాల్ పక్క నుంచి జేసీబీతో రంధ్రం చేసి మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలను,ఆస్తి నష్టంపై విచారణ జరిపి వివరిస్తామని అధికారులు తెలిపారు.