Telangana University | తెలంగాణ యూనివర్సిటీలో వివాదాలకు తెర పడలేదు.. కొద్ది రోజులుగా కొనసాగుతున్న సందిగ్ధత తొలగలేదు.. ఎవరెంత చెప్పినా వీసీ రవీందర్ గుప్తా మారట్లేదు. తన తీరు మార్చుకోవట్లేదు. పైగా రోజుకో వివాదం రాజేస్తూనే ఉన్నారు. మొన్న ఈసీతో కలిసి పని చేస్తానన్న వీసీ అంతలోనే మాట మార్చారు. వెనక్కి తగ్గినట్లే తగ్గి ఇప్పుడు మళ్లీ పోరుకు సై అంటున్నారు. తాజాగా రిజిస్ట్రార్ చాంబర్కు తాళం వేయించడంతో పాటు అక్కడ పని చేసే ముగ్గురు సిబ్బందిని ఇతర విభాగాలకు కేటాయించడం వివాదాస్పదమైంది. ప్రస్తుతం రిజిస్ట్రార్ ఎవరో తనకే అర్థం కావడం లేదని వీసీ ప్రకటించడం చర్చనీయాంశమైంది.పాలక మండలి నియమించిన రిజిస్ట్రార్ను కాదని కొత్త వ్యక్తిని నియమిస్తానని ఆయన సోమవారం ప్రకటించారు. అంతే కాదు, వర్సిటీలో తన ఆదేశాలను మాత్రమే అమలు చేయాలని, ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని సర్క్యులర్ జారీ చేయడం దుమారం రేపుతున్నది.
నిజామాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ యూనివర్సిటీలో వివాదాలకు ఇంకా ఫుల్స్టాప్ పడలేదు. వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా కొత్త కోణాలను ఆవిష్కరించడంతో మరోమారు గందరగోళ పరిస్థితి ఏర్పడింది. తన ఆదేశాలకు విలువ లేకపోవడం, సిబ్బంది ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో వీసీ నేరుగా సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇందులో భాగంగానే సోమవారం విధులకు హాజరైన వెంటనే ఈసీ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా అనేక మార్పులు, చేర్పులు చేసినట్లు సమాచారం. రిజిస్ట్రార్ చాంబర్లో పని చేసే ముగ్గురు సిబ్బందిని తొలగించి ఇతర విభాగాల్లో విధులు అప్పగించడం దుమారం రేపుతున్నది. ఈసీ నియమించిన రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరికి సహాయ నిరాకరణ చేసే విధంగా సిబ్బందిని అక్కడి నుంచి తొలగించడంతో గందరగోళం కొనసాగుతున్నది. మరోవైపు రిజిస్ట్రార్ చాంబర్కు తాళం వేసి ఉండడంతో సమస్య మొదటికి వచ్చినట్లు అయ్యింది. ప్రొఫెసర్ యాదగిరికి తెలియకుండానే వీసీ ఆదేశాలతో సిబ్బంది తాళాలు వేసినట్లు తెలుస్తున్నది. ఈసీ నియమించిన వ్యక్తిని టీయూ నుంచి దూరం చేసేందుకే ఇదంతా చేస్తున్నట్లు యూనివర్సిటీ వర్గాల్లో చర్చ మొదలైంది. మరోవైపు యూనివర్సిటీలో తన ఆదేశాలను ధిక్కరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ వీసీ విడుదల చేసిన తాజా సర్క్యూలర్ దుమారం రేపుతున్నది.
రెండేండ్ల కాలం నుంచి యూనివర్సిటీలో వివాదా లు జరగని రోజంటూ లేదు. నిత్య వివాదాలతో రాష్ట్ర స్థాయిలో పరువు పోతున్నా పరిస్థితిలో ఎంతకూ మార్పు కనిపించడం లేదు. రిజిస్ట్రార్ నియామకంతో రాజుకున్న ఘర్షణ పూరిత వాతావరణం కాస్త ముగింపునకు చేరుకున్నదని అంతా భావించారు. గతవారమే పాలకవర్గ సభ్యులతో భేటీ అయిన సందర్భంలో వైస్ చాన్స్లర్ రవీందర్ గుప్తా చేసిన ప్రకటన అందరిలోనూ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈసీ సభ్యులతో కలిసి పని చేస్తానని వెల్లడించిన వారం రోజులకే వీసీ తీరులో భిన్నమైన మార్పు కానరావడంతో టీయూలో వివాదానికి ఫుల్ స్టాప్ పడనట్లే అయ్యింది. రిజిస్ట్రార్ ఎవరో తనకే తెలియడం లేదంటూ వీసీ ప్రకటించడంతో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పాలకవర్గంలో నిర్ణయించిన మేరకు ప్రస్తుతం ప్రొఫెసర్ యాదగిరి మాత్రమే రిజిస్ట్రార్గా కొనసాగే అవకాశాలున్నట్లుగా ప్రభుత్వం చెబుతున్నది. కానీ అందుకు విరుద్ధంగా వీసీ మాత్రం కొత్త రిజిస్ట్రార్ నియామకానికి ఉత్తర్వులే జారీ కాలేదని ఇప్పుడు న్న రిజిస్ట్రార్ నియామకం చెల్లుబాటే కాదని ఖరాకండిగా చెప్పడం అయోమయంగా మారింది. ఈ నెల 25న హైదరాబాద్లో పాలకవర్గ సమావేశం ఉంది. అప్పటి వరకు కీలక నిర్ణయాలు వెల్లడయ్యే అవకాశాలు లేవు. ఇంతలో ఎలాంటి వైపరీత్యాలు టీయూలో వెలుగు చూస్తాయోనన్న ఆందోళన ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్నది.
టీయూలో ప్రభుత్వ జీవోలకు వ్యతిరేకంగా, అక్ర మ వ్యవహారాలతో అట్టుడికిపోతుండడంతో ఇందుకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకుంటున్నది. వైస్చాన్స్లర్ వ్యవహారంతో విసుగెత్తిన ఉన్నతాధికారులంతా పాలకవర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల మేరకే పరిపాలన జరిగేలా ఏర్పాట్లు చేశారు. ఈసీ సభ్యులంతా రంగంలోకి దిగి యూనివర్సిటీని చక్కబెడుతున్న వేళ వీసీ రవీందర్ గుప్తా సైతం ఒక మెట్టు దిగొచ్చి రాజీ ప్రయత్నాలను నెరిపారు. క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం ఉపక్రమించడంతో ఈసీతో కలిసి పని చేస్తానంటూ చెప్పి అంతలోనే మాట మార్చడం, ఈసీకి వ్యతిరేకంగా నిర్ణయాలను ప్రకటించడంతో ఇంతలోనే ఏం జరిగిందనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. ఓయూ నుంచి వచ్చిన ప్రొఫెసర్ నిర్మలాదేవిని భయభ్రాంతులకు గురి చేసి వెళ్లగొట్టారంటూ ఆరోపణలు సైతం చేశారు. అంతేకకాకుండా తానే టీయూకు చెందిన ప్రొఫెసర్లనే రిజిస్ట్రార్గా నియమిస్తానంటూ వెల్లడించారు. హైదరాబాద్లోని రూసా బిల్డింగ్లో నిర్వహిస్తున్న పాలకవర్గ సమావేశాలకు వీసీ హోదాలో తాను లేని మీటింగ్లకు విలువ లేదన్నట్లుగా రవీందర్ గుప్తా చెబుతున్నారు. పైగా తానే స్వయంగా టీయూలోనే పాలకవర్గ సమావేశాన్ని నిర్వహిస్తానంటూ ప్రకటన చేశారు. వారం రోజుల్లోనే ఈసీ మీటింగ్కు సభ్యులందరినీ పిలుస్తానంటూ చెప్పారు. ఎవరొచ్చినా రాకపోయినా ఈసీ మీటింగ్ నిర్వహించి అందులో తీసుకున్న నిర్ణయాల ఆధారంగా యూనివర్సిటీ అభివృద్ధికి పాటుపడతానంటూ చెప్పడంతో యూనివర్సిటీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. యూనివర్సిటీలో టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ అంతా తన ఆదేశాలనే అమలు చేయాలని సర్క్యూలర్ జారీ చేశా రు. ఉల్లంఘిస్తే కఠిన నిర్ణయాలుంటాయని అందు లో పేర్కొన్నారు.
టీయూలో భారీ ఎత్తున నియామకాలను చేపట్టాలని వైస్చాన్స్లర్ భావిస్తున్నట్లు అర్థం అవుతోంది. ఇందుకోసం నిర్ణయాలు తీసుకోవాలంటే తన ఆదేశాల అమలుకు ఈసీ అడ్డం వస్తుండడంతో తోక ముడిచిన వీసీ మరోమారు ధిక్కారస్వరాన్ని అందుకున్నట్లు టీయూలో చర్చ జరుగుతున్నది. సోమవారం మీడియాతో మాట్లాడుతూ సైన్స్ బ్లాక్, 22 పడకల దవాఖాన, టీయూలో సెక్యూరిటీ సిబ్బంది కొరత ఉందంటూ లెక్కలు చెప్పడం వెనుకున్న మర్మం ఏమిటన్నది అంతు చిక్కడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా యూనివర్సిటీల్లో ప్రభుత్వ అనుమతి లేకుండా ఎలాంటి నియామకాలను చేపట్టకూడదంటూ ఏడాదిన్నరలో రెండు సార్లు జీవోలను జారీ చేసింది. అయినప్పటికీ ప్రభుత్వ ఆదేశాలను ధిక్కరిస్తూ టీయూలో మాత్రం పెద్ద ఎత్తున అవుట్ సోర్సింగ్ నియామకాలు, ఉద్యోగోన్నతలు చేపట్టా రు. వీటిపై ప్రభుత్వం సీరియస్గా స్పం దించి రద్దు చేసినప్పటికీ వీసీ మాత్రం ఇంకా ని యామకాలు చేపట్టాల్సి ఉందనడం వెనుక ఆయన ఆంతర్యం ఎవరికీ అంతు చిక్కడం లేదు. టీయూలో పరిపాలనా పరమైన ఇబ్బందుల దృష్ట్యా నియామకాలను చేపట్టాల్సి ఉంటే ప్రభు త్వం ద్వారా అనుమతులు తీసుకోవచ్చు. కానీ అలాంటి ప్రక్రియ చేపట్టకుండా నియామకాల అంశాన్ని నొక్కి చెప్పడంతో అసలు సమస్య మొదలవుతున్నది. టీయూలో కొంతకాలంగా ఏర్పడిన వివాదాల నేపథ్యంలో పరిపాలన పడకేసింది. అనేక సమస్యలు వెలుగు చూస్తున్నాయి. వీసీ రవీందర్ గుప్తా మాత్రం అవేవీ పట్టించుకోకుండా నియామకాల అంశాన్ని తెరపైకి తేవడం గమనార్హం.