బోధన్/ఖలీల్వాడి, నవంబర్ 25: నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణానికి శనివారం కాంగ్రెస్ అగ్రనేత రాహూల్గాంధీ రాక సందర్భంగా శుక్రవారం రాత్రి నుంచి పట్టణంలో ఎక్కడ చూసినా రాహూల్గాంధీ తప్పులను ఎత్తిచూపుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు వెలిశాయి. బోధన్తోపాటు నిజామాబాద్ నగరంలోనూ రాత్రికి రాత్రే ఈ పోస్టర్లు వెలిశాయి. బోధన్లో రాత్రి వేళ వెలసిన ఈ పోస్టర్లు శనివారం ఉదయం పట్టణంలో కలకలం రేపాయి. ‘తెలంగాణలో ఆత్మబలిదానాలకు బాధ్యత మీదే.. మా బిడ్డలను చంపింది మీరే.. రాహూల్గాంధీ క్షమాపణలు చెప్పాల్సిందే.. ముక్కు నేలకు రాయాల్సిందే..’ అన్న రాతలతో పోస్టర్లు ఉన్నాయి.
అంతేకాదు.. కర్ణాటకలో కాంగ్రెస్ పాలనలో వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న కష్టాలను ఫొటోల రూపంలో చూపుతూ మరికొన్ని పోస్టర్లు వేశారు. ‘కర్ణాటకలో ఉద్యోగాలు కాదు.. ఉరితాళ్లే.. కాంగ్రెస్కు ఓటేసిన పాపానికి నిరుద్యోగుల గోస..’, ‘కరెంట్ లేక అల్లాడుతున్న కర్ణాటక – దివాళా తీస్తున్న పరిశ్రమలు’ అంటూ ఈ పోస్టర్లు ఉన్నాయి. పోస్టర్లలో బళ్లారిలో జీన్స్ పరిశ్రమలకు విద్యుత్తు కోతలపై పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగ్స్ ఉన్నాయి. సంచలనం సృష్టిస్తున్న ఈ పోస్టర్లలో రాహూల్గాంధీ, రేవంత్రెడ్డి ఫొటోలు ఉన్నాయి. ఈ పోస్టర్ల సమాచారం అందుకున్న అధికారులు వాటిని తొలగించే పనిలో పడ్డారు.