నిజాంసాగర్, జనవరి 3: పడిపూజకు వెళ్లి వస్తున్న అయ్యప్ప మాలధారుల ఆటోను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ముగ్గురు భక్తులకు తీవ్రగాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా మాసన్పల్లి గ్రామానికి చెందిన అయ్యప్ప మాలధారులు సాయిలు, బాలకృష్ణ అంజయ్య, విఠల్, లింగం, యంబరి కాశయ్య (55) బుధవారం ఎల్లారెడ్డి మండలంలోని మల్కాపూర్లో నిర్వహించిన పడిపూజకు ఆటోలో వెళ్లారు. పూజ అనంతరం స్వగ్రామానికి తిరుగు ప్రయాణం అయ్యారు.
ఈ క్రమంలో మాగి చక్కెర ఫ్యాక్టరీలో చెరుకును అన్లోడ్ చేసి వస్తున్న ఓ లారీ నిజాంసాగర్ మండల కేంద్రంలోని చర్చి వద్ద ఆటోను ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యంబరి కాశయ్య అక్కడికక్కడే మృతి చెందగా, లింగం, బాలకృష్ణ అంజయ్య, విఠల్కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స కోసం మరో ఆటోలో ఎల్లారెడ్డి దవాఖానకు తరలించారు. డ్రైవర్ సాయిలుకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే వాహనాన్ని వదిలేసి లారీ డ్రైవర్ పారిపోయాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై రాజశేఖర్ పరిశీలించి వివరాలు సేకరించారు. లారీని పోలీస్స్టేషన్కు తరలించి, కేసు నమోదు చేశామని ఎస్సై తెలిపారు.