ఇందల్వాయి, మార్చి 13: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పోలీస్స్టేషన్ పరిధిలోని 44వ నంబర్ జాతీయ రహదారి చంద్రయాన్పల్లి గ్రామం వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు మృత్యువాతపడ్డారు. సంఘటనకు సంబంధించి డిచ్పల్లి సీఐ మోహన్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని కొండల్వాడికి చెందిన నీరడి గణేశ్ (28), అతని సోదరుడు ఆదిత్య(25), అదే గ్రామానికి చెందిన తమ స్నేహితుడు ప్రకాశ్ (28) కొంత కాలంగా నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నివాసం ఉంటూ మొబైల్ షాప్ను నడుపుతున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని దుబ్బ ప్రాంతానికి చెందిన సాయిరాం (27)తో కలిసి నలుగురు దుకాణానికి కావాల్సిన సామగ్రి కోసం ఆదివారం కామారెడ్డికి కారులో వెళ్లారు. పని ముగించుకొని తిరిగి వస్తుండగా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న కంటెయినర్ వాహనాన్ని వీరి కారు ఢీకొట్టింది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయ్యింది. నలుగురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో కారును నీరడి గణేశ్ నడుపుతున్నాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి ఏసీపీ కిరణ్కుమార్, సీఐ మోహన్ చేరుకున్నారు. ప్రమాదానికి కారణాలు స్థానికులను అడిగి తెలుసుకున్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కంటెయినర్ డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని మృతుడు గణేశ్ తండ్రి నీరడి హన్మాండ్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇందల్వాయి ఎస్సై గణేశ్ తెలిపారు.
మృతుడు గణేశ్ భార్య తొమ్మిది నెలల గర్భిణి..
విషయాన్ని తెలుసుకొని కుటుంబీకులు చంద్రాయన్పల్లికి చేరుకున్నారు. మృతదేహాలను చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. గణేశ్కు ఏడాది క్రితం వివాహం కాగా.. భార్య ప్రస్తుతం తొమ్మిది నెలల గర్భణి అని కుటుంబీకులు తెలిపారు. ప్రమాదంలో నలుగురు యువకులు మృతి చెందడంతో ఆయా కుటుంబాల్లో విషాదచాయలు అలుముకున్నాయి. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా దవాఖానకు తరలించినట్లు పోలీసులు తెలిపారు.