బాన్సువాడ టౌన్, జూన్ 27: పేదింటి ఆడబిడ్డలకు ఇంటి పెద్దగా, మేనమామగా సీఎం కేసీఆర్ అందజేస్తున్న పెండ్లి కానుకనే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకమని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. బాన్సువాడలోని ఆయన స్వగృహంలో మంగళవారం నియోజకవర్గ పరిధిలోని 16మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత 2015వ సంవత్సరంలో రూ.51వేలతో ప్రారంభమై ప్రస్తుతం రూ.లక్షా ఒక వెయ్యి పదహారు పెండ్లి కానుకగా కేసీఆర్ అందజేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు ఆడబిడ్డ పెండ్లి చేయాలంటే ఇంట్లోని బంగారం లేదా భూమిని అమ్ముకునే పరిస్థితి ఉండేదని, కానీ సీఎం కేసీఆర్ సాయమందిస్తుండడంతో సామాన్యులు ఈ నగదుతోనే పెండ్లి చేస్తున్నారన్నారు. బయట ఫంక్షన్ హాళ్లలో పెండ్లి చేయాలంటే రూ.30వేల నుంచి రూ.50వేలు వెచ్చించాల్సి వస్తున్నదని,
అందుకే బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో సీఎం కేసీఆర్ సహకారంతో రూ.50 కోట్లతో 80 కల్యాణ మండపాలు నిర్మిస్తున్నామని, అందులో చాలావరకు పూర్తయ్యి శుభకార్యాలు జరుగుతున్నాయని వెల్లడించారు. ప్రభుత్వ సహకారంతో నిర్మించిన కల్యాణ మండపాల్లో కేవలం రూ.5 వేలు చెల్లించి శుభకార్యాలు జరుపుకోవచ్చని తెలిపారు. ప్రజలు కూడా అనవసర ఆర్భాటాలకు పోయి అప్పుల బారిన పడకుండా పెండ్లిని సాధారణంగా జరుపుకోవాలని సూచించారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకం ద్వారా ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 లక్షల మందికి సుమారు రూ.10వేల కోట్ల నగదు సహాయం అందిందని, బాన్సువాడ నియోజకవర్గ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 15వేల మందికి రూ.135 కోట్ల వరకు నగదు సహాయం అందజేసినట్లు వెల్లడించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కోటగిరి మండల అధ్యక్షుడు ఎజాస్ఖాన్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్, ఏఎంసీ చైర్మన్ హమీద్, జడ్పీ కోఆప్షన్ మెంబర్ సిరాజ్, మైనారిటీ నాయకుడు సందాని, నబీ, పొతంగల్ తహసీల్దార్ విజయలక్ష్మి, నాయకులు రాంబాబు, మల్లేశ్, మున్ని తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ గృహలక్ష్మి..
అర్హులైనవారందరికీ గృహలక్ష్మి పథకం కింద ఇండ్ల ను మంజూరు చేస్తానని స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి తెలిపారు. చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన ప్రజలను ఉద్దేశించి స్పీకర్ మాట్లాడారు. సొంత స్థలం ఉండి ఇండ్లు కట్టుకుంటామని ముందుకు వచ్చిన అర్హులందరికీ గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల రూపాయలను మంజూరు చేస్తానని స్పీకర్ హామీ ఇచ్చారు. స్థానిక తహసీల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఈ పథకం ద్వారా మూడు విడుతలుగా లబ్ధిదారుడి బ్యాం కు ఖాతాలో నగదు జమ అవుతుందని, జీఎస్టీ, అగ్రిమెంట్, కాంట్రాక్టర్ లాంటివి లేకుండా లబ్ధిదారులకు నేరుగా ప్రభుత్వ సహాయం అందుతున్నదని తెలిపారు.