నిజామాబాద్, డిసెంబర్ 9, (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించింది. ఎన్నికల సమరంలో బిజీగా ఉన్నప్పటికీ గత సర్కారు మాత్రం ధాన్యం సేకరణ విషయంలో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టింది. ఈ సీజన్లో ఉభయ జిల్లాల్లో కలిపి 789 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.32 లక్షల రైతుల నుంచి 8 లక్షలకు పైగా మెట్రిక్ టన్నులను ప్రభుత్వం సేకరించింది. ఇందులో 80 శాతానికి పైగా రైతుల ఖాతాల్లో డబ్బులు కూడా జమ చేసింది. మరోవైపు, ప్రైవేట్గా కూడా ధాన్యం కొనుగోళ్లు భారీగా జరిగాయి. దళారులు మద్దతు ధర కంటే ఎక్కువ ఇచ్చి పెద్ద మొత్తంలో రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయడం గమనార్హం. ప్రైవేట్ వ్యాపారులు రెండు లక్షల మెట్రిక్ టన్నులకు పైబడి కొనుగోలు చేసినట్లు అంచనా.
చివరి దశకు ధాన్యం కొనుగోళ్లు
ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరింది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో చేతికందిన పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసింది. సాఫీగా జరిగిన ప్రక్రియతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. 2023-24 వానకాలం సీజన్లో పండించిన ధాన్యాన్ని పకడ్బందీ ఏర్పాట్లతో సేకరించారు. ఓ వైపు అసెంబ్లీ ఎన్నికలు ఉన్నప్పటికీ ప్రభుత్వం మాత్రం కొనుగోళ్ల ప్రక్రియకు ఎలాంటి ఆటంకం కలిగించకుండా సేకరణను ముగింపునకు తీసుకువచ్చింది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో మొత్తం 789 కొనుగోలు కేంద్రాల ద్వారా 8లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వరి ధాన్యాన్ని సేకరించారు. సేకరించిన ధాన్యం విలువ రూ.1,767 కోట్లుగా ఉంది. వీటిలో 80 శాతం మేర చెల్లింపులు పూర్తి చేయడం విశేషం. ధాన్యం సేకరణ ద్వారా నిజామాబాద్ జిల్లాలో 62వేల మంది రైతులకు, కామారెడ్డిలో 70వేల మంది రైతులకు గిట్టుబాటు ధర కల్పించింది. గత వానకాలం సీజన్లో ధాన్యం కొనుగోళ్లలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలు టాప్లో నిలిచాయి. రాష్ట్రంలో అత్యధిక ధాన్యాన్ని సేకరించడంలో నిజామాబాద్ జిల్లా నంబర్ వన్ స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. కామారెడ్డి టాప్ 5లో నిలిచింది. అదే ఒరవడితో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా ధాన్యం సేకరణ జరిగింది. ఇదిలా ఉండగా ఈసారి ప్రైవేటులో ధాన్యం కొనుగోళ్లు భారీగా జరగడం విశేషం.
నిజామాబాద్లో 4.05లక్షల మెట్రిక్ టన్నులు..
నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వానకాలం ధాన్యం సేకరణకు 490 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా 440 కేంద్రాలను ప్రారంభించారు. ఇందులో ఐకేపీ ద్వారా 57, పీఏసీఎస్ 374, మెప్మా 5, ఏఎంసీ 4 చొప్పున కేంద్రాలను నెలకొల్పారు. వీటిల్లో ఇప్పటి వరకు 4లక్షల 5వేల 609 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. జిల్లా వ్యాప్తంగా 62వేల 375 మంది రైతుల నుంచి ఈ మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేశారు. రోజుకు 3వేల మెట్రిక్ టన్నుల చొప్పున వేగంగా కొనుగోళ్లను అధికార యంత్రాంగం చేపట్టింది. 1.63 కోట్ల గన్నీ సంచులు అవసరం కాగా 1.09 కోట్ల గన్నీ సంచులను అందుబాటులో పెట్టారు. 1.02కోట్ల గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాలకు అందించారు. మొత్తం సేకరించిన 4.05లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం విలువ రూ.893.56కోట్లుగా ఉంది. సేకరించిన ధాన్యానికి గాను ఇప్పటి వరకు రూ.772.38కోట్లు చెల్లింపులను పౌరసరఫరాల సంస్థ పూర్తి చేసింది. వేగంగా ధాన్యాన్ని సేకరించడంతో పాటు అంతే వేగంగా రైతులకు ధాన్యం డబ్బులను వారి బ్యాంక్ అకౌంట్లలో ప్రభుత్వం జమ చేసింది. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో రైతులకు ఇసుమంతైనా ఇక్కట్లు తలెత్తలేదు.
కామారెడ్డిలో 3.96లక్షల మెట్రిక్ టన్నులు..
కామారెడ్డి జిల్లాలో గతం మాదిరిగానే ఈసారి కూడా 350 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించి 349 చోట్ల కేంద్రాలను తెరిచారు. 45 రోజులుగా ఈ కేంద్రాల ద్వారా రైతులు పండించిన ధాన్యాన్ని వేగంగా సేకరించారు. ఇప్పటివరకు సగం మేర కేంద్రాల్లో కొనుగోళ్లు ముగియడంతో మూసేశారు. మిగిలిన చోట్ల ధాన్యం సేకరణ కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 70వేల 559 మంది రైతుల నుంచి 3లక్షల 96వేల 910 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం సేకరించింది. వీటి విలువ రూ.874కోట్లుగా ఉంది. ఇందులో రూ. 724కోట్ల చెల్లింపులు పూర్తయ్యాయి. మొత్తం సేకరించిన ధాన్యంలో 83శాతం మేర చెల్లింపులు పూర్తి చేశారు. 327 పీఏసీఎస్ ద్వా రా, 22 ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ ప్రక్రియను చేపట్టారు. గతేడాది ఇదే కాలానికి 3లక్షల 98వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వ యం త్రాంగం సేకరించగా ఇప్పటికే లక్ష్యానికి తగినట్లుగా ధాన్యాన్ని రైతుల నుంచి ప్రభుత్వం కొనుగోలు చేసింది. గత ప్రభుత్వం నిర్దేశించిన ప్రక్రియను అనుసరించి ఆన్లైన్ ఆధారితంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోళ్లను చేపట్టారు. 1.20 కోట్ల గన్నీ సంచులను ఆయా కొనుగోలు కేంద్రాలకు షిఫ్ట్ చేయగా వీటిలో 99లక్షల గన్నీ సంచులను ధాన్యం తరలింపు కోసం వినియోగించారు.
ప్రైవేటులోనూ జోరుగా..
కర్ణాటక, తమిళనాడులో తెలంగాణలో పండించిన వరి ధాన్యానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. దీంతో ప్రైవేటు వ్యాపారులు చాలా మంది తెలంగాణలోని పల్లెల్లోకి చొచ్చుకొచ్చి వడ్ల కొనుగోళ్లకు ఎగబడ్డారు. భారీగా కాంటాలను ఏర్పాటు చేసి రైతుల నుంచే నేరుగా కొన్నారు. ఒక దశలో నాణ్యమైన ధాన్యం పండించిన రైతులకు కేంద్ర ప్రభుత్వం కల్పించిన కనీస మద్దతు ధర కన్నా ఎక్కువగా రూ.2400లకు క్వింటా ధాన్యం అమ్ముడు కావడం ప్రాధాన్యతను సంతరించుకున్నది. ఓ వైపు రైస్ మిల్లర్లు, మరోవైపు వ్యాపారులంతా పోటీ పడి రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు. సన్నరకాల ధాన్యానికి భారీగా డిమాండ్ ఏర్పడింది. ప్రైవేటు కొనుగోళ్ల కారణంగానే ఈసారి ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 8లక్షల మెట్రిక్ టన్నులు మేర ధాన్యమే వచ్చింది. ప్రతి సీజన్లో ధాన్యం సేకరణ లక్ష్యం 10లక్షలకు చేరుకుంటుండగా ఈ సారి 2లక్షల మెట్రిక్ టన్నులకు పైబడిన ధాన్యం ప్రైవేటులోనే అమ్ముడైంది. అంచనాలకు మించి పండించిన వరితో పుట్లకొద్దీ ధాన్యం రాశులు అంతటా కనిపించాయి. వాతావరణం కూడా కలిసి రావడంతో భారీ దిగుబడులను రైతులు సాధించారు. మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వంలో నిర్ణయించిన విధివిధానాలు, ఆన్లైన్ కొనుగోలు ప్రక్రియతో రైతులకు మేలు చేకూరింది. ఇకపై వచ్చే సీజన్లో కొత్త ప్రభుత్వంలో జరుగబోయే కొనుగోళ్ల అంశం ఏ మేరకు ఉంటుందో? ఎలాంటి విధానాలు అమలవుతాయో? వేచి చూడడం అందరి వంతుగా మిగిలింది.