చెడగొట్టు వానలు అన్నదాతలను ఆగంజేశాయి. పదిరోజుల పాటు కురిసిన అకాల వర్షాలతో చాలాచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని, పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించడంతో రైతులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయాధికారులు గ్రామాల్లో పర్యటిస్తూ నష్టపోయిన పంటల వివరాలను సేకరిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో 18,847 ఎకరాల్లో పూర్తి స్థాయిలో.. 31,930 ఎకరాల్లో పాక్షికంగా పంటలు దెబ్బతిన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. 33 శాతం కన్నా అధికంగా నష్టం వాటిల్లితే అధికారులు రైతుల పేర్లను నమోదు చేస్తున్నారు. సర్వే నేటితో పూర్తికానుండగా పూర్తి స్థాయిలో నివేదికను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
-కామారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ)
కామారెడ్డి, మే 11 (నమస్తే తెలంగాణ): ఇటీవల కురిసిన అకాల వర్షాలతో పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలిచింది. ప్రజాప్రతినిధులు గ్రామాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెప్పారు. తడిసిన వడ్లు కొంటామని, పంట నష్ట పరిహారం ఇప్పిస్తామని భరోసా కల్పించారు. ఈ మేరకు రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేయడంతో కామారెడ్డి జిల్లాలో నష్టాన్ని అంచనా వేసేందుకు ముమ్మరంగా సర్వే చేస్తున్నారు.
ప్రజాప్రతినిధుల విస్తృత పర్యటన..
పది రోజులపాటు కురిసిన వానలతో పంట నష్టం వాటిల్లిన ప్రాంతాలను ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సందర్శించి వ్యవసాయ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి బాన్సువాడ నియోజకవర్గంలో రేయింబవళ్లూ తిరుగుతూ రైతులను ఓదార్చారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతమయ్యేలా కృషి చేశారు. జుక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే జాజాల సురేందర్, కామారెడ్డి నియోజకవర్గంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు అండగా నిలిచారు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ అధికారులు సైతం పంట నష్టపోయిన రైతులను కలిసి వారి బాధలను తెలుసుకున్నారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల ఆదేశాల మేరకు నష్టం వివరాలను నమోదు చేసుకుంటున్నారు. వ్యవసాయ విస్తరణ అధికారులు, మండల వ్యవసాయ అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. పూర్తిస్థాయిలో వివరాలను నమోదు చేసుకొని ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు.
18,847 ఎకరాల్లో పంట నష్టం
కామారెడ్డి జిల్లాలో యాసంగిలో 4లక్షల 14వేల ఎకరాల్లో వివిధ రకాల పంటలను సాగు చేశారు. వీటిలో వరి 2.59 లక్షల ఎకరాలు, శనగ లక్ష ఎకరాలు, మక్కజొన్న 55 వేల ఎకరాల్లో సాగయ్యింది. అయితే అకాల వర్షాల కారణంగా వరి పంటపైనే తీవ్ర ప్రభావం పడింది. చేతికొచ్చిన పంట దెబ్బతినడం, ఎండబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న వరిని కొనుగోలు చేయడంతోపాటు రైతులకు అండగా ఉంటామని, ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం అందజేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడంతో అన్నదాత కండ్లలో ఆనందం వెల్లివిరిసింది. ఈ మేరకు గ్రామాల్లో వ్యవసాయ విస్తరణ అధికారులు పర్యటించి పంట నష్టం వివరాలను తెలుసుకున్నారు. ఈనెల 11 వరకు జిల్లాలో వ్యవసాయ అధికారులు నమోదు చేసిన పంట నష్టం వివరాలను పరిశీలిస్తే.. పూర్తి స్థాయిలో దెబ్బతిన్న పంట 18,847 ఎకరాలు కాగా, 31,930 ఎకరాల్లో పాక్షికంగా వరి దెబ్బతిన్నది. ఇందులో కామారెడ్డి డివిజన్లో 13,249 ఎకరాలు, ఎల్లారెడ్డి డివిజన్లో 7052, బాన్సువాడ డివిజన్లో 7841, బిచ్కుంద డివిజన్లో 3785 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ అధికారుల సర్వేలో తేలింది. 33 శాతం కన్నా అధికంగా నష్టం వాటిల్లితే అధికారులు రైతుల పేర్లను నమోదు చేస్తున్నారు. ఇలా పూర్తి స్థాయిలో నివేదికను సిద్ధం చేస్తున్నారు.
నష్టం వివరాల నమోదుకు నేడు చివరిరోజు
క్లస్టర్ల వారీగా వ్యవసాయ విస్తరణ అధికారులు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి పంట నష్టం వివరాలను నమోదు చేస్తున్నారు. అయితే ఇంకా ఎవరైనా పంటలను కోల్పోయిన రైతులు ఉంటే ఈ నెల 12వ తేదీలోపు ఆయా క్లస్టర్లలో ఏఈవోలను కలిసి పంట వివరాలతోపాటు ఆధార్, బ్యాంకు అకౌంట్ జిరాక్స్ కాపీలను అందజేయాలని అధికారులు సూచిస్తున్నారు. పూర్తి వివరాలు అందజేస్తే నష్టపరిహారం పొందడానికి వీలుంటుందని పేర్కొన్నారు.
రైతులకు అండగా ప్రభుత్వం
పంట నష్టం వాటిల్లిన రైతులకు ప్రభుత్వం అండగా ఉంది. ఇప్పటికే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పూర్తిస్థాయిలో పంటను కోల్పోయిన రైతుల వివరాలను సేకరించాం. క్లస్టర్ల వారీగా ఏఈవోలు విధుల్లో ఉండడంతో రైతులందరికీ న్యాయం జరుగుతుంది. పంట నష్టపోయిన రైతులందరూ తమ పూర్తి వివరాలను శుక్రవారం సాయంత్రంలోగా అందజేయాలి. త్వరలో నష్టపరిహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. కొనుగోళ్లపై కొన్ని నిబంధనలను సడలించడంతో రైతులకు మరింత న్యాయం జరుగుతుంది.
-వీరస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి, కామారెడ్డి