నిజాంసాగర్, డిసెంబర్ 2 : ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హన్మంత్షిండే హాయంలో జుక్కల్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకెళ్తుంది. అంతే కాకుండా వైద్య పరంగా జుక్కల్ నియోజకవర్గం ప్రజలకు మరింత చెరువవుతుంది. దీంతో నియోజకవర్గంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా జుక్కల్ నియోజకవర్గంలో సమస్యలు తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాతే పరిష్కారం అయ్యాయని ప్రజలు సైతం ప్రకటిస్తున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి పిట్లం మండల కేంద్రంలో 30 పడకల దవాఖాన కోసం ఎదురుచూడగా చివరకు సీఎం కేసీఆర్ హయాంలోనే మంజూరైంది. దవాఖాన కోసం రెండు రోజుల కిందటే రూ.10.70 కోట్ల నిధులు మంజూరయ్యాయి. త్వరలో 30 పడకల దవాఖాన నిర్మాణం కానుండడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పిట్లంతోపాటు నియోజకవర్గంలోని ఆరు మండలాల ప్రజలు, పక్కనే ఉన్న కర్నాటక, మహారాష్ట్ర, సంగారెడ్డి జిల్లాలోని పలు మండలాలకు చెందిన ప్రజలకు ఈ దవాఖాన ఎంతో సౌకర్యవంతంగా మారనుంది.
జుక్కల్ నియోజకవర్గం బిచ్కుందలో ఉన్న 30 పడకల దవా ఖానలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయనుండడంతో కిడ్నీ సంబంధిత రోగులకు ఇబ్బందులు దూరం కానున్నాయి. ప్రస్తు తం డయాలసిస్ సేవల కోసం మహారాష్ట్ర ప్రాంతానికి లేదంటే బాన్సువాడకు వెళ్లే రోగులకు ఈ సమస్య దూరం కానుంది. ఎమ్మెల్యే హన్మంత్షిండే చొరవతో డయాలసిస్ కేంద్రం ఏర్పా టు కానుండడంతో రోగులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. పిట్లంలో 30 పడకల దవాఖాన, బిచ్కుందలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు కానుండడంతో నియోజకవర్గంలోని ప్రజలకు వైద్య సేవలు మరింత దగ్గరకు చేరాయంటూ సం తోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రజలకు పాలన మరింత చేరువ కావాలనే ఉద్దేశంతో మద్నూర్ మండలంలోని డోంగ్లీని నూతన మండలంగా ఏర్పాటు చేసి నియోజకవర్గంలో ఆరు మండలాలు ఉండగా ఏడుకు చేర్చిన ఘనత సైతం ఎమ్మెల్యే హన్మంత్షిండేకే దక్కింది.
మంత్రి హరీశ్రావు చేతుల మీదుగా శుక్రవారం ఉదయం 11 గంటలకు పిట్లంలో 30 పడకల దవాఖాన భవన నిర్మాణం కోసం పనులను ప్రారంభించనున్నారు. అనంతరం మార్కెట్ కమిటీకి చెందిన షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించనున్నారు. 12:15 గంటలకు బిచ్కుంద దవాఖానలో డయాలసిస్ కేం ద్రం ప్రారంభించనున్నారు. అనంతరం నూతనంగా ఏర్పాటు చేసిన డోంగ్లీ మండల కేంద్రంలో ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా తరగతి గదులను ప్రారంభించడంతోపాటు నూతన మండలాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొనున్నారు.
ఎమ్మెల్యే హన్మంత్షిండే చొరవతో పిట్లం మండలంలో 30 పడకల దవాఖాన మంజూరైంది. గత పాలకులు సాధించలేనిది ఎమ్మె ల్యే హన్మంత్షిండే చొరవతో దవాఖాన మంజూరైంది. ఇక పిట్లం మండలంతోపాటు పక్కనే ఉన్న నిజాంసాగర్, పెద్దకొడప్గల్ సంగారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలకు చెందిన రోగులకు వైద్య సేవలు అందనుండడం చాలా సంతోషంగా ఉంది.
– కవితావిజయ్, ఎంపీపీ, పిట్లం
టీఆర్ఎస్(బీఆర్ఎస్) ప్రభుత్వంతోనే నియోజకవర్గం అభివృద్ధిలో దూసుకెళ్తుంది. బిచ్కుంద దవాఖానలో డయాలసిస్ కేంద్రం మంజూరు కావడంతో కిడ్నీ రోగులకు ఇబ్బందులు తొలిగిపో నున్నాయి. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే హన్మంత్షిండే చొరవతో జుక్కల్ నియోజకవర్గం రూపు రేఖలు మారిపోయాయి. వారం రోజుల కిందట బిచ్కుందలో సెంట్రల్ లైటింగ్ కోసం నిధులు మంజూరయ్యాయి. రహదారులు, వైద్యం, తాగునీరు, మౌలిక వసతులు ఇలా అన్ని రంగాల్లో ఎంతగానో పురోగతి సాధించుకున్నాం.
– అశోక్పటేల్, ఎంపీపీ బిచ్కుంద