పదేండ్ల క్రితం కాంగ్రెస్ పాలనలో పడిన కష్టాలు చాలు. సరైన కరెంటు లేక వేసిన పంటలు వేసినట్లే మా కండ్ల ముందే ఎండిపోయాయి. సాగు కోసం చేసిన అప్పులు తీరక చనిపోయిన రైతులు ఇంకా గుర్తుకున్నరు. ఒకరి భూములు మరొకరి పేరుమీద రాసి రైతుల మధ్య చిచ్చురాజేసిన పటేల్, పట్వారీ వ్యవస్థతో ఎదుర్కొన్న ఇబ్బందులనూ మరువలేదు. ఇలా కాంగ్రెసోళ్ల పాలన అన్నింటా అన్నదాతలను ముంచిందే తప్ప.. మేలు చేసే ఒక్క పనైనా లేదు. తెలంగాణ రాకతో సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలతో వ్యవసాయం పండుగైంది. ధరణితో రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు వచ్చి భూ వివాదాలు తగ్గాయి. 24గంటల ఉచిత కరెంటుతో బోర్లన్నీ ఫుల్లుగా పోస్తున్నాయి. రైతుబంధుతో పెట్టుబడి రంది లేకుండా పోయింది. ఇలా ప్రతీది రైతుకు మేలు చేకూర్చే పథకమే. కేసీఆర్ పాలనలో రైతులంతా రాజులయ్యారు. ఎన్నికల నేపథ్యంలో మళ్లీ వచ్చిన కాంగ్రెసోళ్లు.. రైతులను ఆగంజేసే పనులు చేస్తున్నరు. మూడు గంటల కరెంటు, 10హెచ్పీ మోటర్లు, ధరణిని తీసేస్తామని ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ రైతులను ముంచాలని చూస్తున్నరు. ఇంతటి కుట్ర చేస్తున్న కాంగ్రెసోళ్లను నమ్మితే మళ్లీ సచ్చే పరిస్థితే వస్తుందని రైతులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్తామని స్పష్టం చేస్తున్నారు.
తెలంగాణ రాకముందు పంటలకు నీళ్లు పెట్టేందుకు కరెంట్ కోసం మోటర్ల వద్దే ఎదురు చూసేవాళ్లం. కరెంట్ ఎప్పుడో రావడంతో మోటర్లు లోడ్ ఎత్తుకోవడంతో ఫీజులు పోవడంతో ఉరుకులు పరుగులు పెట్టేవాళ్లం. ఎకరానికి నీళ్లు పెట్టాలంటే దాదాపు మూడు రోజులు కష్టపడితే తడిసేది కాదు. కానీ సీఎం కేసీఆర్ 24గంటలు కరెంటు ఇవ్వడంతో పంటలు పూర్తిగా పారుతున్నయ్. ఆనాడు కష్టాలు చూశాం. ఇప్పుడు సౌలభ్యాన్ని చూస్తున్నం. ఒక రైతుకు ఇంతకన్నా కావాల్సింది ఇంకేమున్నది.
రెంజల్, నవంబర్ 28: మూడు గంటల కరెంట్ అంటే రైతులు బాగుపడ్డట్టే.. అట్ల కరెంట్ ఇస్తే ఒక్కమడి కూడా తడవదు. గతంలో కాంగ్రెసోళ్లు అట్లనే ఇస్తే ఎండకాలంలో ఒక్క మడికూడా తడిసేదికాదు. సలికాలం వస్తే గజగజ వణుక్కుంటా బావులు, బోర్లకాడ మంటలు పెట్టుకొని పడుకునేది. అబ్బో అప్పుడు ఎన్నో కష్టాలు పడ్డం. కేసీఆర్ ప్రభుత్వం వచ్చినంక నాణ్యమైన 24 గంటలు కరెంట్ ఇవ్వడంతో ఎన్కటి లెక్క ఇబ్బందులు లేవు. మూడు గంటల కరెంట్, 10హెచ్పీ మోటర్లు అంటున్న కాంగ్రెసోళ్ల మాటలు నమ్మొద్దు. కష్టసుఖాల్లో మన ఇంటి మనిషి లెక్కతోడు ఉంటున్న కేసీఆర్కే మద్దతు ఇవ్వాలె.
గతంలో పాలించిన కాంగ్రెస్ నేతలు కరెంట్ సక్రమంగా ఇవ్వక ఇబ్బందులు పడేటోళ్లం. ఇప్పుడు 24గంటల కరెంట్ మంచిగ వస్తున్నది. రాత్రుళ్లు పొలంకాడికి పోవుడు బందైంది. కాంగ్రెసోళ్లు 3గంటల కరెంటిత్తమంటే దేనికి సరిపోతది. ఒక్క దొయ్య కూడా పారదు. ఇప్పటి లెక్కనే 24గంటల కరెంట్ ఉండాలె.
రేవంత్రెడ్డి అన్నట్లు మూడు గంటల కరెంటుకు ఒక్క మడి అయినా తడుస్తుందా. ఈ విషయం ఆయనకు తెలుసా. నాకున్న వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్నా. తెలంగాణ సర్కారు అందిస్తున్న 24గంటల విద్యుత్తో నాణ్యమైన పంటలు పండించుకుంటున్నం. కాంగ్రెసోళ్ల మాటలతో మళ్లీ పాత రోజులు వస్తాయంటేనే భయం వేస్తుంది. గతంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో.. పోతుందో తెలియని పరిస్థితి. కానీ.. నేడు ఆ పరిస్థితులు లేవు. రైతుకు 24గంటల నాణ్యమైన విద్యుత్ ఇస్తే 5హెచ్పీ మోటర్లతో పంటలు పండించుకుంటాం. సీఎం కేసీఆర్కు ఎప్పటికీ రుణపడి ఉంటాం.
తెలంగాణ ప్రభుత్వంలోనే సంతోషంగా ఉన్నం. కాంగ్రెస్ పాలనలో కరెంట్ కష్టాలు అన్నీ..ఇన్నీకావు. ఏనాడూ కంటినిండ నిద్రపోలేదు. కరెంట్ కోసం రాత్రంతా జాగారం చేసేటోళ్లం. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బాధలు తీరాయి. 24గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తున్నారు. ఎప్పుడంటే అప్పుడు పోయి నీళ్లు పెట్టుకుంటున్నం. ఇప్పుడు కాంగ్రెసోళ్లు 24గంటల కరెంటు ఎందుకు.. మూడు గంటలు చాలని అంటున్నరు. ఎట్ల సరిపోతది. మూడు గంటల కరెంట్తో పొలంలోని మొదటి మడికూడా పారదు. ఇంకా 10హెచ్పీ మోటర్ కొనాలంటే మా దగ్గర డబ్బులు ఉండొద్దా. కాంగ్రెస్ను నమ్మితే మళ్లీ పాత కథే అవుతది. కాంగ్రెసోళ్లకు వ్యవసాయం గురించి తెల్వదని అర్థమైంది. మాకు 3గంటల కరెంట్ వద్దు. 24గంటల కరెంటే కావాలి.
ప్రభుత్వం రైతులకు ఇస్తున్న 24గంటల ఉచిత కరెంట్ బాగున్నది. గతంలో రైతులు చేన్లపొంటి రాత్రి పూట పోయి నీళ్లు పారించేందుకు గోసపడేవారు. 3గంటల కరెంట్ అంటే ఎందుకది? 10హెచ్పీ మోటర్లు పెడితే బోర్లలో, బావుల్లో నీళ్లుంటయా. ప్రస్తుతం రైతులు రంది లేని వ్యవసాయం చేస్తున్నరు. కేసీఆర్ పెట్టుబడికి రైతుబంధు ఇస్తుండు. కరెంట్ మీటర్లు లేవు. 24గంటల కరెంట్ ఇవ్వడంతో రైతులు వారి తీరికున్నప్పుడు పొలాలకు నీళ్లు పారిస్తున్నరు. కరెంట్ లేకుంటే పంటలు పండవు. 3గంటల కరెంట్ ముచ్చటనే వద్దు.
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ పాత రోజులే వస్తాయి. 10హెచ్పీ మోటరుతో గంటలో ఎకరం నీరు పారించవచ్చని రేవంత్రెడ్డి చెప్పడం హాస్యాస్పదం. కేసీఆర్ వచ్చాక 24గంటల విద్యుత్ నిరంతరంగా అందుతుండడంతో రైతులు ఎప్పుడు పొలాలకు వెళ్లినా మోటరు వేసుకొని సాగుపనులు చేసుకునే అవకాశం ఉన్నది. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతుల పరిస్థితి ఎలా ఉంటుందోనని భయం పుట్టుకొస్తున్నది. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే రైతులకు మేలు జరుగుతుంది.
కాంగ్రెస్ హయాంలో లోవోల్టీజీ, అరకొర విద్యుత్తో మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయి మాకు వైండింగ్ పని ఎక్కువగా దొరికేది. ఎప్పుడూ హడావుడిగా ఉండేటోళ్లం. తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల బాధలు తప్పాయి. సీఎం కేసీఆర్ హయాంలో ఆ పరిస్థితి పూర్తిగా మారింది. మాకు పనిభారం తగ్గింది. మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు నిరంతరంగా పని చేస్తున్నాయ్. నాణ్యమైన 24గంటల విద్యుత్ సరఫరా అవుతుండడంతో మోటర్లు కాలిపోయే అవకాశం లేదు. మాకు పనిభారం తప్పినప్పటికీ రైతులు సంతోషంగా ఉండడమే మాకు ఆనందం.
మూడు గంటల కరెంట్తో పంటలు పండించలేం. కాంగ్రెస్ హయాంల మడి తడ్వడానికి పడిగాపులు కాసేటోళ్లం. రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్తో మూడు ఎకరాలు పారుతుంది అంటున్నడు. అసలు ఆయనకు ఎవుసం మీద అవగాహన ఉందా? రైతులు 3హెచ్పీ, 5హెచ్పీ మోటర్లను వాడుతున్నరు. కానీ 10 హెచ్పీ మోటర్లను రైతులు వాడాలంటే ట్రాన్స్ఫార్మర్లను మార్చాల్సి ఉంటుంది. 3హెచ్పీ, 5హెచ్పీ మోటర్లకే బోలెడు డబ్బులు అయితున్నయ్. 10హెచ్పీ మోటర్లను సన్న, చిన్నకారు రైతులు కొనాలంటే ఆర్థిక ఇబ్బందులు తప్పవు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతదో తెల్వక రాత్రింబవళ్లు ఎదురు చూసెటోళ్లం. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్కు రైతుల కష్టాలు తెలుసు. 24గంటల విద్యుత్ ఇవ్వడంతో పగటి పూటనే పంటలకు నీళ్లు పారిస్తున్నం. పొరపాటున కాంగ్రెస్ వస్తే 3గంటల కరెంట్ ఎప్నుడు ఇస్తరో అని ఎదురుచూడలె. అంతేకాకుండా 24గంటల కరెంట్తో రెండు పంటలను పండించుకుంటున్నం. 3గంటలిస్తే యాసంగి పంటలు పండించుకోలేం. అందుకే మరోసారి కేసీఆర్ సీఎం కావాలె.
సీఎం కేసీఆర్ 24గంటలు మెరుగైన కరెంటు ఇస్తుంటే. ఓర్వలేక.. కాంగ్రెస్ వాళ్లు మూడు గంటల కరెంటు ఇస్తామని, రైతులు 10హెచ్పీ మోటర్ పెట్టుకోవాలని అంటున్నరు. కాంగ్రెస్ పాలనలో రాత్రిపూట కరెంటుతో రైతులమంతా అనేక కష్టాలు పడ్డాం. కరెంటు కష్టాలు మళ్లీ రాకుండా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావొద్దు. అన్నదాత మనసెరిగిన సీఎం కేసీఆర్ సారు. హ్యాట్రిక్ సాధించిన తర్వాత బీఆర్ఎస్ పరిపాలనలో మరిన్ని పథకాలు అందిస్తారు. అందుకే బీఆర్ఎస్ను గెలిపిస్తాం. ధరణిని తీసేస్తే రైతులంతా భూమి పంచాయితీలతో ఆగమాగమైతరు. ధరణితో రైతు భూమికి భద్రత ఏర్పడింది.
కోటగిరి, నవంబర్ 28: కర్ణాటక ఎన్నికల్లో గిట్లనే రైతులకు కరెంటు ఇస్తామని మాయమాటలు, వట్టి ఝూటా మాటలు చెప్పి ఓట్లు దండుకొని అధికారంలోకి రాగానే అక్కడి రైతులకు కాంగ్రెసోళ్లు కరెంటు ఇస్తలేరు. మళ్ల ఇక్కడ తెలంగాణలో ఓట్ల కోసం కరెంటు ఇస్తామని లేనిపోని మాయమాటలు చెబుతున్నరు. అక్కడి రైతులే మాకు ఫోన్ చేసి చెప్పిండ్రు. కర్ణాటకలో కరెంటు ఇస్తలేరని.. మన కాడ రైతులు కూడా కాంగ్రెసోళ్లకు ఓట్లతోనే గట్టిగా బుద్ధి చెప్తరు. మా ఊర్ల అంతా కారుగుర్తుకు ఓటేస్తం. మళ్లీ కేసీఆర్ సారును సీఎం చేస్తం.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ముందు ధరణిని తీసేస్తరట..అదిగానీ జరిగితే మళ్లీ దళారీ రాజ్యం వస్తది. రికార్డుల్లో భూముల వివరాలను ఇష్టమొచ్చినట్లు నమోదు చేస్తారు. భూతగాదాలు ఎక్కువవుతాయి. ధరణి వచ్చినంక రైతులకు భరోసా కలిగింది. భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి. రైతుబంధు వస్తున్నది. పొరపాటున కూడా కాంగ్రెస్కు ఓటెయ్యం. రైతులకు గింతగనం మేలు చేసే బీఆర్ఎస్ పార్టీకే మా మద్దతు.
రైతుల కరెంటు మోటర్లకు కేంద్రం మీటర్లు పెడితేనే నిధులు ఇస్తామని, లేదంటే ఇవ్వమని చెప్పినా కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది. కేంద్రం నిధులు ఇవ్వకున్నా ఫర్వాలేదు. రైతులను మాత్రం ఇబ్బంది పెట్టబోమని కేసీఆర్ ఖరాకండిగా చెప్పి రైతులను ఆదుకున్నారు. అలాంటి వ్యక్తి ఉండగా మా రైతులకు ఏమవుతుంది. 24 గంటల విద్యుత్తో రైతులు ఉత్సాహంగా పంటలు సాగు చేసుకుంటున్నారు. కాంగ్రెసోళ్లు ఇస్తమంటున్న మూడు గంటల కరెంటు.. ఒక్కమడికైనా సరిపోతుందా? వ్యవసాయం తెలియని వాళ్లు మాట్లాడితే ఇట్లనే ఉంటది. కాంగ్రెస్ పాలనలో రైతులకు చీకటి రోజులే. కేసీఆర్ వచ్చాకే రైతు రాజయ్యాడు.
ఉమ్మడి రాష్ట్రంలో కరెంటు కోసం చాలా ఇబ్బందులుపడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత మిషన్ కాకతీయతో చెరువుల్లో నీటి నిల్వలతోపాటు భూగర్భ జలాలు పెరిగాయి. బోర్లలో నీరు 120 నుంచి 160 అడుగుల్లోనే ఉంది. వానకాలం, యాసంగిలో ప్రశాంతంగా పంటలు సాగు చేసుకుంటుంన్నం. కరెంట్ సమస్యనే లేదు. సీఎం కేసీఆర్ దయతో వ్యవసాయం పండుగలా మారింది. 3గంటల కరెంటుతో ఎకరం తడి పెట్టాలంటే కనీసం నాలుగు రోజులు పడుతుంది. కాంగ్రెస్ వస్తే మళ్లీ చీకటి రోజులె.
కేసీఆర్ పాలనలో రైతులకు కరెంటు కష్టాలు పూర్తిగా తీరాయి. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చారు. పంటలు చక్కగా పండుతున్నాయి. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో ప్రభుత్వమే కొంటున్నది. కాంగ్రెస్ వస్తే మళ్లీ మాకు కష్టాలు తప్పవు. మూడు గంటల కరెంటుతో పంటలు ఎండిపోతాయి. నష్టాలు వచ్చి రైతులు మళ్లీ ఆత్మహత్యలు చేసుకోవడమే. కేసీఆర్ సారుకే ఓటు వేస్తాం. మళ్లీ ఆయనే రావాలి.