ఇంద్రవెల్లి, మార్చి16 : మండలంలోని సమక గ్రామపంచాయతీ పరిధిలోని పాటగూడకు చెందిన కొలాం ఆదివాసీ గిరిజనులకు మూఢనమ్మకాల భయం పట్టుకున్నది. తరచూ అనారోగ్యానికి గురవుతున్నామంటూ 12 కుటుంబాల వారు గ్రామం నుంచి వెళ్లిపోయారు. కొద్ది దూరంలోని వ్యవసాయ భూమిలో కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ విషయంపై గ్రామస్తులను ఆరా తీయగా వారు వివరాలు వెల్లడించారు. పాటగూడ గ్రామంలో 83 కొలాం ఆదివాసీ గిరిజన కుటుంబాలు ఉండగా వీరి జనాభా 495 ఉంది. పాటగూడా గ్రామం ఏర్పాటైన నాటి నుంచి కొలాం ఆదివాసీ గిరిజనులు కలిసి కట్టుమెలిసి ఉంటూ, అన్ని పండుగలు, శుభకార్యక్రమాలను నిర్వహించేవారు. ఇటీవల తరచూ అనారోగ్యానికి గురవుతున్నామంటూ కుమ్ర వంశానికి చెందిన కొలాం ఆదివాసీ గిరిజనులు పాటగూడా గ్రామాన్ని వదిలి కొత్త గ్రామం ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. ఈ విషయంపై చుట్టు పక్కల తొమ్మిది గ్రామాలకు చెందిన కొలాం ఆదివాసీ గిరిజన పెద్దల సమక్షంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి, నిర్ణయించుకున్నారు. 12 కుటుంబాలకు చెందిన కొలాం ఆదివాసీ గిరిజనులు శుక్రవారం కుమ్ర జంగుకు చెందిన వ్యవసాయ భూమిలో వారి కులదేవతైన భూరీదేవత ప్రత్యేక పూజలు చేసి, కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేశారు. పాటగూడాలోని ఇండ్లను తొలగించుకొని, కొత్త గ్రామంలో ఇండ్లను నిర్మించుకుంటున్నారు. ప్రస్తుతం తాత్కాలికంగా గుడారాలను ఏర్పాటు చేసుకొని నివాసం ఉంటున్నారు.
మూఢనమ్మకం భయంతో గ్రామాన్ని వదిలి కొత్త గ్రామం ఏర్పాటు చేసుకోవడం మానుకోవాలని ఉట్నూర్ సీఐ నరేశ్కుమార్తోపాటు ఎస్ఐ నాగ్నాథ్ కొలాం ఆదివాసీ గిరిజనులకు సూచించారు. మంగళవారం గ్రామానికి వెళ్లి అవగాహన కల్పించారు. గ్రామస్తులంతా కలిసి మెలిసి ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు కొలాం ఆదివాసీ గిరిజనులు మాట్లాడుతూ. తమకు పాటగూడ గ్రామ పెద్దలు, గ్రామస్తులతో ఎలాంటి గొడవలూ లేవని, తరచూ అనారోగ్యానికి గురతుండడంతోనే పాటగూడను వదిలి కొత్త గ్రామాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు.