కామారెడ్డి, జూన్ 28 (నమస్తే తెలంగాణ):ఒకప్పుడు సుస్తీ చేస్తే మస్తు పరేషాన్ అయితుండె. రోగమేమో కానీ పేదల ఇల్లు గుల్ల అవుతుండె. వైద్య పరీక్షలు, చికిత్సల పేరిట ప్రైవేట్ దవాఖానలు వేలకు వేలు ఫీజులు గుంజుతుండె. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయడంతోపాటు పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుం బిగించింది. డయాగ్నోస్టిక్ హబ్ల స్థాపన ద్వారా ఉచితంగానే వైద్య పరీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆయా సెంటర్లలో 134 రకాల టెస్టులను ఫ్రీగా చేస్తున్నారు. పైగా వైద్య పరీక్షల కోసం హబ్కు రావాల్సిన అవసరం లేదు. రోగులు స్థానిక ఆరోగ్య కేంద్రాలకు వెళ్తే అక్కడ శాంపిల్స్ తీసుకుని, వాటిని హబ్కు పంపిస్తారు. అక్కడ పరీక్షలు చేసి, రిపోర్టును స్థానిక ఆరోగ్య కేంద్రానికి పంపిస్తారు. ఇలా ఎక్కడా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా, ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకునేలా ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపట్టింది. తాజాగా కామారెడ్డి జిల్లా కేంద్రంలోనూ డయాగ్నోస్టిక్ హబ్ సేవలను సర్కారు అందుబాటులోకి తీసుకొచ్చింది.
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చింది. ముఖ్యంగా పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది. పేదలకు వైద్యఖర్చుల భారాన్ని తగ్గించేందుకు డయాగ్నోస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. నిరుపేదలు ఏదైనా రోగం వస్తే ప్రైవేట్ దవాఖానకు వెళ్తే ఫీజుల రూపేణ రూ.వేలకు వేలు సమర్పించుకోవాల్సి వచ్చేది. ముఖ్యంగా రోగ నిర్ధారణకు రాసి ఇచ్చే వైద్య పరీక్షలకు రూ.వేలల్లో చెల్లించాల్సిన పరిస్థితి ఉండేది. ప్రైవేటు డయాగ్నోస్టిక్ సెంటర్లలో వైద్య పరీక్షలు నిర్వహించాలంటే ఏదైనా వస్తువును తాకట్టు పెట్టాల్సిందే.. ఈ పరిస్థితుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖకు రూ.వేల కోట్లతో దవాఖానలను నిర్మించడంతోపాటు వైద్య పరీక్షల కోసం డయాగ్నోస్టిక్ హబ్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రంలో రూ.1.25 కోట్లతో డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేయగా.. రెండురోజుల క్రితం ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ ప్రారంభించారు.
తప్పిన ప్రైవేటు దోపిడీ..
కామారెడ్డితో పాటు బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాల్లో ప్రైవేటు రంగంలో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ముఖ్యంగా కామారెడ్డిలో ప్రతి ప్రైవేట్ దవాఖానకు అనుబంధంగా డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేసుకొన్నారు. ఏడాది క్రితం అన్ని ప్రైవేటు దవాఖానల యజమానులు కలిసి ఓ పెద్ద డయాగ్నోస్టిక్ సెంటర్ను ఏర్పాటు చేశారు. దవాఖానల్లో వైద్యులు, డయాగ్నోస్టిక్ సెంటర్ల నిర్వాహకులు కలిసి రోగులను దోచుకొంటున్నారు. జలుబు వచ్చినా, జ్వరం వచ్చినా అనేక రకాల వైద్య పరీక్షలను రాస్తూ, డయాగ్నోస్టిక్ సెంటర్లకు పంపిస్తున్నారు. రూ.వేలల్లో వైద్య పరీక్షల ఫీజులు వసూలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ డయాగ్నోస్టిక్ హబ్ నిరుపేదలకు వరంగా మారింది. అన్ని రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేయించుకొని ఫలితాలు పొందవచ్చు.
జిల్లా వ్యాప్తంగా శాంపిళ్ల సేకరణ..
కామారెడ్డి డయాగ్నస్టిక్ హబ్కు జిల్లా వ్యాప్తంగా అన్ని పీహెచ్సీలు, సీహెచ్సీలు, ఏరియా దవాఖానల నుంచి రోగులకు సంబంధించిన వైద్య పరీక్షల శాంపిళ్లను సేకరించి పంపడానికి ఏర్పాట్లు చేశారు. కేవలం ఒకే రోజులో పరీక్షలు జరిగేలా ఆధునిక వైద్య పరికరాలను ఇక్కడ ఏర్పాటు చేశారు. పరీక్ష ఫలితాలను ఒక్క రోజులోనే సంబంధిత సీహెచ్సీ/సీహెచ్సీ/ఏరియా దవాఖానకు పంపిస్తారు. రోగులు కేంద్రానికి రావాల్సిన అవసరం లేకుండానే ఏర్పాట్లు చేయడం గమనార్హం.
ఉచితంగా 134 రకాల వైద్య పరీక్షలు
కామారెడ్డిలో ఏర్పాటు చేసిన డయాగ్నస్టిక్ హబ్లో 134 రకాల వైద్య పరీక్షలను నిర్వహించేందుకు వసతులను కల్పించారు. ప్రస్తుతానికి 54 రకాల వైద్య పరీక్షలను నిర్వహించేందుకు ల్యాబ్లను ఏర్పాటు చేశారు. ఎక్స్రే, మెమోగ్రఫీ, సీటీ స్కాన్, లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్, అల్ట్రా సౌండ్ స్కాన్, థైరాయిడ్ టెస్టుతో పాటు మధుమేహం, గ్లూకోస్ టొలరెన్స్ టెస్ట్, ఎస్ బిలిరెబిన్, సిరం క్రియేటినైన్, బ్లడ్ యూరియా, ఎస్జీపీటీ, ఎస్ ఆల్కలైన్, వీఎల్డీఎల్, యూరిక్ ఆసిడ్, యురినల్ టెస్టు, డ్రగ్ ఓవర్డోస్, ఎల్డీఎల్, టోటల్ ప్రొటీన్, ఫ్లూయిడ్ అనాలసిస్, పీఎస్ఏ, ఎస్ పొటాషియం, సోడియం, కాల్షియం, మ్యాగ్నిషియం, బ్లడ్ గ్యాస్ టెస్ట్, ప్రొటీన్ ఎలక్ట్రోఫోసిస్ , టోటల్ కొలెస్ట్రాల్, ఎల్డీహెచ్తో పాటు తదితర వైద్య పరీక్షలన్నీ ఒకే చోట నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని దేవునిపల్లి శివారులో ఉన్న మెడికల్ కళాశాల పక్కనే నిర్మించిన ఈ హబ్లో మైక్రో బయాలజీ, బయో కెమిస్ట్రీ, రేడియాలజిస్ట్ వైద్యులను నియమించారు. ప్రస్తుతానికి పెథాలజిస్ట్ వైద్యుడు పని చేస్తున్నారు. నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు, ఇద్దరు రేడియోగ్రాఫర్లు, ఒక ఫార్మాసిస్ట్ను నియమించారు. ల్యాబ్ మేనేజర్ వైద్య పరీక్షలకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తారు.
ఎంతో సౌకర్యం ఏర్పడింది..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్ హబ్తో పేదలకు ఎంతో సౌకర్యం ఏర్పడింది. అన్ని రకాల వైద్య పరీక్షలను ఒకేచోట చేస్తారు.ప్రస్తుతం ఇక్కడ ఏర్పాటు చేసిన ల్యాబ్లో 34 రకాల పరీక్షలను చేయడానికి అవకాశం ఉన్నది. విడుతల వారీగా విస్తరిస్తారు.
–డాక్టర్ విజయలక్ష్మి, డీసీహెచ్ఎస్, కామారెడ్డి
ఒకే రోజు ఫలితాలు..
ఆధునిక పరికరాలతో డయాగ్నోస్టిక్ హబ్ను ఏర్పాటు చేశారు. ఏ రకమైన వైద్య పరీక్షలైనా ఒక్క రోజులోనే ఫలితాలు వస్తాయి. వాటిని పీహెచ్సీలకు పంపిస్తాం. నలుగురు ల్యాబ్ టెక్నీషియన్లు పని చేస్తున్నారు. రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకొంటున్నాం.
– స్వప్న, డయాగ్నోస్టిక్ హబ్ మేనేజర్, కామారెడ్డి