mobile phones | కామారెడ్డి: స్పెషల్ డ్రైవ్ ద్వారా పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ల రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నట్లు ఎస్పీ ఎం రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన బాధితులకు అందజేశారు. పోగొట్టుకున్న, చోరీకి గురైన 130 మొబైల్ ఫోన్లను (సుమారు రూ.20 లక్షల విలువగల) స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించినట్లు అని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఇది వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. మొబైల్ పోయిన లేదా చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్ కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని, సిమ్ కార్డ్ బ్లాక్ చేసి అదే నంబరు గల కొత్త సిమ్ తీసుకోవాలని సూచించారు. పోయిన మొబైల్ ఫోన్ల IMEI వివరాలు CEIR వెబ్సైట్ లో బ్లాక్ చేయడం వల్ల పోగొట్టుకున్న మొబైల్ సులభంగా దొరికే అవకాశం ఉందని పేర్కొన్నారు.
జిల్లా పోలీసు కార్యాలయంలో పోయిన సెల్ ఫోన్ల రికవరీ కోసం ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఒక RSI, 10 మంది కానిస్టేబుల్స్ తో ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్లు గత 3 రోజులలో ఈ టీం అధికారులు 130 ఫోన్ లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 130 మొబైల్ ఫోన్ల రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన టీం సబ్యులు అందరిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఇప్పటి వరకు రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు తెలియజేస్తామని, ఆధారాలతో జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి ఆర్ఎస్ఐ బాలరాజ్ (8712686114)ను సంప్రదించి పోన్లు తీసుకెళ్లాలని సూచించారు.