తెలంగాణలో మరో సువర్ణాధ్యాయం.. చరిత్రలో నిలిచిపోయే అద్భుత ఘట్టం నేడు ఆవిష్కృతం కానున్నది. హైదరాబాద్ నడిబొడ్డున రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ భారీ విగ్రహం ప్రారంభోత్సవానికి ముస్తాబైంది. ప్రపంచంలోనే అతి పెద్దదైన 125 అడుగుల విగ్రహాన్ని సీఎం కేసీఆర్ శుక్రవారం ఆవిష్కరించనున్నారు. ముఖ్యమంత్రి నిర్ణయాలతో రాజ్యాంగ నిర్మాతకు రాష్ట్రంలో అపూర్వమైన గౌరవం దక్కుతున్నది. బాబాసాహెబ్ ఆలోచనలకు అనుగుణంగా మరెక్కడా లేని విధంగా తెలంగాణలో పాలన కొనసాగుతున్నది. భారతరత్న అంబేద్కర్ స్ఫూర్తిగా ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలన అందిస్తున్నారు. వెనుకబడిన దళితుల సంక్షేమం కోసం అనేక పథకాలు తీసుకొచ్చారు. యావత్ దేశమే ఆశ్చర్యపోయేలా దళితబంధు పథకాన్ని ప్రారంభించారు. బాబాసాహెబ్ బాటలో నడుస్తున్న కేసీఆర్.. ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచేలా ఆ మహనీయుడి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయించి తన అభిమానాన్ని చాటుకున్నారు. నేడు హైదరాబాద్లో జరుగనున్న విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలి వెళ్లనున్నారు.
నిజామాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): అంబేద్కర్ గొప్పతనానికి గుర్తుగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్లో దేశంలోనే అతి పెద్దగా 125 అడుగులతో ఏర్పాటుచేసిన విగ్రహాన్ని శుక్రవారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ 125వ జయంతి సందర్భంగా కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం ఆకాశాన్ని తాకే విధంగా నిలువెత్తు విగ్రహం ఆవిష్కరణ ఘట్టం అంగరంగ వైభవంగా జరుగనున్నది. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ఏర్పాట్లు చేయగా.. ఉమ్మడి జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివెళ్తున్నారు. ఇప్పటికే తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం, అతి ఎత్తైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో రాజ్యాంగ నిర్మాతపై సీఎం కేసీఆర్కు ఉన్న గౌరవం అర్థం అవుతున్నది. ఇంతటి గొప్ప నిర్ణయాన్ని తీసుకున్న కేసీఆర్ను తెలంగాణ సమాజమే కాదు.. యావత్ భారత జాతి అభినందిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందే అంబేద్కర్ ఆలోచనల ఫలితంగా… ‘బోధించు… సమీకరించు… పోరాడు..’ అనే నినాదంతోనే తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని కేసీఆర్ ప్రజలకు వివరించడం ద్వారా ప్రజా పోరాటం మొదలైంది. ఆ పోరాటాల ఫలితంగా రాష్ట్రం సిద్ధించింది. చిన్న రాష్ర్టాలతోనే అధికార వికేంద్రీకరణ జరిగి అభివృద్ధి సాధ్యమవుతుందని అంబేద్కర్ అభిలాషించినట్లుగానే.. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆయనకు అపూర్వ గౌరవం కేసీఆర్ రూపంలో దక్కడం విశేషం.
దళితబంధుతో ఆర్థిక క్రాంతి..
కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా పక్షపాత ధోరణి ప్రదర్శిస్తున్నది. లౌకికత్వానికి భిన్నంగా, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ బీజేపీ తన ఉనికిని కాపాడుకుంటున్నది. ఎనిమిదిన్నరేండ్ల కాలంలో దేశవ్యాప్తంగా వేలాది మంది దళితులపై దాడులు జరగడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కారణం కాగా.. ఉత్తరప్రదేశ్ అందులో మొదటి స్థానంలో నిలవడం దళితులపై బీజేపీకి ఉన్న శ్రద్ధాసక్తులను తేటతెల్లం చేస్తున్నది. తెలంగాణలో మాత్రం అట్టడుగు స్థానంలో ఉన్న దళిత సమాజాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని తీసుకువచ్చి విప్లవాత్మకమైన మార్పునకు నాంది పలికారు. నిరుపేద దళిత కుటుంబాలకు ఏకంగా రూ.10లక్షలు అందించి వారికి శాశ్వతంగా ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చేదోడు వాదోడుగా నిలిచి గెలిచి చూపించిన ఘనత కూడా కేసీఆర్కు మాత్రమే దక్కుతున్నది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో దళితబంధు పథకం విజయవంతంగా అమలు కావడమే కాకుండా అనేక కుటుంబాల్లో వెలుగులు నింపింది. పైలట్ ప్రాజెక్టు కింద నిజాంసాగర్ మండలంలోని మొత్తం దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని వర్తింపజేశారు. తొమ్మిది నియోజకవర్గాల్లో వంద యూనిట్ల చొప్పున అందించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో మరింత మందికి ఆర్థిక భరోసా దక్కనున్నది.
ఆత్మగౌరవానికి ప్రతీక…
భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనంతరం దేశానికి సరికొత్త మార్గనిర్దేశనం జరిగింది. చట్ట సభల్లోకి ఇప్పటివరకూ అడుగుపెట్టని వారికి, చట్టాలు ఎట్లా చేస్తారో, అవి తమపై ఎలా ప్రభావం చూపిస్తాయో కూడా తెలియని వారికి అధికారాన్ని, చట్టాన్ని తయా రు చేసే శక్తినిచ్చింది భారత రాజ్యాంగం. అయితే దానికి వెన్నెముక గా నిలిచింది మాత్రం అంబేద్కర్ ఒక్కరే. తెలంగాణ ఏర్పడిన అనంతరం చాలా మంది కొత్త వారు, అందులో రాజకీయ అధికారానికి దూరంగా ఉన్న వారు, వాటి గురించి తెలియని చాలా మంది తొలిసారి చట్టసభల్లోకి అడుగు పెట్టారు. భాషా ప్రయుక్త రాష్ర్టాలు కావాలని నాడు కొందరు చేసిన వాదనలను ఏకీభవించని వ్యక్తి అంబేద్క రే. చిన్న రాష్ర్టాలతో దేశం అద్భుతంగా పురోగమిస్తుందని అభయం ఇచ్చిన మహా మేధావి అతడు. అందుకుగాను భారత రాజ్యాంగం లో ఆర్టికల్ 3 ప్రవేశ పెట్టి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బాటలు వేసిం దీ అంబేద్కరే అని చెప్పవచ్చు. రాజధానిలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు సముచితం మాత్రమే కాదు, స్వయం పాలన, ఆత్మగౌరవానికి ప్రతీక కూడా. భారత రాజ్యాంగం ద్వారా చిన్న రాష్ర్టాల ఏర్పాటుకు బాటలు వేసిన మహనీయున్ని నిత్యం గుర్తు చేసుకునేందుకు సీఎం కేసీఆర్ చేసిన ప్రయత్నం ఇది. రాజకీయ, సామాజిక, ఆర్థిక సమాన అవకాశాలు ఎలా ఉండాలో కూడా చెప్పిన ఆధునిక భారతదేశపు ఆత్మ అంబేద్కర్ బాటలోనే కేసీఆర్ నడుస్తున్నారు.
అంబేద్కర్కు అపూర్వ గౌరవం..
రాజ్యాంగ నిర్మాతకు కనీవినీ ఎరుగని రీతిలో తెలంగాణ రాష్ట్రంలో అపూర్వమైన గౌరవం దక్కుతున్నది. కొత్త రాష్ట్రంలో రూపుదిద్దుకున్న సచివాలయానికి బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు.. సచివాలయం సమీపంలోనే 125 అడుగుల నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కేసీఆర్ గొప్పతనానికి నిదర్శనం. ప్రజాస్వామ్య విలువలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చే కేసీఆర్.. అడుగడుగునా రాజ్యాంగ నిర్మాతను కొలుస్తూ అంబేద్కర్ చూపిన బాటలోనే పయనిస్తున్నారు. స్వాతంత్య్రం సిద్ధించిన తొలి నాళల్లో దళిత జాతి మేలు కోసం అంబేద్కర్ కృషి చేసినట్లే 75ఏండ్ల స్వతంత్య్ర భారతదేశంలో కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అట్టగుడు వర్గాలను ఆరాధిస్తున్నది. చారిత్రక హుస్సేన్సాగర్ పక్కనే నిర్మితమైన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో తెలంగాణ ప్రజలంతా హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా దళితులు కేసీఆర్ కృషిని కొనియాడుతున్నారు. మహనీయుడిని విగ్రహ రూపంలో నిర్మించుకొని నిత్యం గుర్తుంచుకోవడం కేవలం కృతజ్ఞత మాత్రమే కాదు.. చారిత్రక బాధ్యత కూడా అని తెలంగాణ సీఎం కేసీఆర్ గుర్తించడం చారిత్రాత్మకం.