వేల్పూర్/మెండోరా, నవంబర్ 10: సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో వందశాతం అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన వేల్పూర్, మెండోరా మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. ఉదయం వేల్పూర్ మండలంలోని అక్లూర్, జాన్కంపేట్, సాహెబ్పేట్, సాయంత్రం మెండోరా మండలం సోన్పేట్, దూద్గాం, బుస్సాపూర్ గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించగా ఆయా గ్రామాల్లో మహిళలు, కులవృత్తుల వారు, యువకులు మంగళహారతులు, బోనాలు, వలగొడుగులు, డప్పుల దరువులతో దారి పొడవునా స్వాగతం పలికారు. అక్లూర్లో బంజారి పటేల్ పద్మ అనే మహిళ ఎన్నికల ఖర్చు కోసం మంత్రి వేములకు రూ.5 వేల విరాళం అందజేసింది.
ప్రచారంలో భాగంగా ఆయా గ్రామాల్లో వేముల మాట్లాడుతూ..తన నెత్తిమీద అమ్మవారుందేమోనని, కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో ప్రజల కోసం తలపెట్టిన పనులన్నీ దాదాపుగా వంద శాతం చేయించగలిగానని తెలిపారు. చిన్నచిన్న గ్రామాలకు సైతం డబుల్ రోడ్డు సౌకర్యం కల్పించామని, దీంతో రైతుల భూముల విలువ కూడా డబుల్ అవుతుందని ఇది తనకెంతో ఆనందంగా ఉందన్నారు. జాన్కంపేట్, సాహెబ్పేట్ డబుల్ రోడ్డు ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. అక్లూర్, జాన్కంపేట్, సాహెబ్పేట్ గ్రామాలకు అడిగినవి, అడగనవి కూడా చేసి పెట్టినట్లు గుర్తు చేశారు.
చెక్డ్యాం నిర్మాణంతో భూములకు బోరుబావులకు శాశ్వతంగా ప్రాణం పోశానన్నారు. జాన్కంపేట్లో మరో చెక్డ్యాంను సైతం మంజూరు చేయించగా.. నిర్మాణ పనులు కొనసాగుతున్నాయన్నారు. నిజాంసాగర్ నీటిని అందించడానికి జాన్కంపేట్లో పైపులైన్ నిర్మాణం కోసం భగీరథ ప్రయత్నమే చేశానన్నారు. ఫలితంగా పైపులైన్ ద్వారా చెరువులోకి కావల్సినన్ని నీళ్లు అందుతున్నాయన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పుట్టిన గడ్డ జాన్కంపేట్ గ్రామమని వేముల తెలిపారు. జాన్కంపేట్ బిడ్డ జీవన్రెడ్డి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా సైతం ఉన్నారన్నారు. రెండు పర్యాయాలు ఆర్మూర్ ఎమ్మెల్యేగా గెలిచి మూడోసారి సైతం భారీ మెజార్టీతో గెలవబోతున్నారని అన్నారు.
కర్ణాటకలో నమ్మి ఓటేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఉన్న పింఛన్లను పీకేస్తున్నదని విమర్శించారు. పది గంటల కరెంట్ హామీనిచ్చి ఐదు గంటలు కూడా ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నదని మండిపడ్డారు.కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రంలో అమలు చేయని పథకాలను ఓట్ల కోసం తెలంగాణలో చేస్తామని చెబుతున్నారని, ఇది ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచించాలని కోరారు. ఆ పార్టీ మాయమాటలను నమ్మవద్దని సూచించారు. రాష్ట్రంలో మొత్తం రూ.19,600 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉండగా అందులో కేసీఆర్ ప్రభుత్వం ఇదివరకే రూ.13 వేల కోట్లను మాఫీ చేసిందన్నారు. మిగిలిన 6 వేల కోట్ల రుణమాఫీ తప్పకుండా వంద శాతం పూర్తవుతుందన్నారు.
రుణమాఫీ అందడం ఆలస్యమైనా రైతులకు కూడా త్వరలోనే అందుతుందని, ఇందుకు తాను జిమ్మేదారేనని భరోసానిచ్చారు. ఈ గ్రామాలు తన తండ్రి దివంగత వేముల సురేందర్రెడ్డికి ఆత్మీయ గ్రామాలని మంత్రి గుర్తు చేశారు. ఇక్కడి ప్రజల్లో ఆయన జ్ఞాపకాలు నిలిచిపోయాయన్నారు. జాన్కంపేట్ గ్రామంలోని సర్వసమాజ్, గంగపుత్ర సంఘ సభ్యులు మంత్రి వెంటే ఉంటామని ఏకగ్రీవ తీర్మానం కాపీలను అందజేశారు. గడిచిన పదేండ్లలో నియోజకవర్గాన్ని ఆశించినంత అభివృద్ధి చేశానన్నారు. తనను మళ్లీ ఆశీర్వదించాలని మరింత అభివృద్ధి చేస్తానని అన్నారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్, బీజేపీ నాయకులు మళ్లీ మీ ముందుకు వస్తున్నారని, వారిని నమ్మవద్దని సూచించారు.
ఆయా గ్రామాల్లో నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో డీసీసీబీ వైస్చైర్మన్ రమేశ్రెడ్డి, బీఆర్ఎస్ మండల కన్వీనర్ నాగాధర్, ఎంపీపీ బీమా జమున, జడ్పీటీసీ అల్లకొండ భారతి, ఆయా గ్రామాల సర్పంచులు రమేశ్, సుధాకర్గౌడ్, మాజీ ఎంపీపీ నీరడి భాగ్య, మాజీ జడ్పీటీసీ రాజేందర్రెడ్డి, ఆర్టీఏ సభ్యుడు రేగుల్ల రాములు, బీఆర్ఎస్ నాయకులు గంగారెడ్డి, మిట్టాపల్లి మహిపాల్, రాకేశ్, రైతువిభాగం రాష్ట్ర నాయకులు కోటపాటి నర్సింహనాయుడు, డీసీసీబీ డైరెక్టర్ నాగంపేట్ శేఖర్రెడ్డి, ఎంపీపీ సుకన్యా కమలాకర్, వేల్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ అరుణా నవీన్గౌడ్, సర్పంచ్లు గోలి ప్రకాశ్, పసుల సుజాత శ్రీనివాస్, గోపిడి సుజాత గంగారెడ్డి, ఎంపీటీసీ లక్ష్మీ దేవేందర్, నాయకులు పాల్గొన్నారు.
వేల్పూర్, నవంబర్ 10: బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల శుక్రవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఉదయం 8. 30 నుంచి గంటల మధ్యాహ్నం వరకు రుద్రంగి మండలం మానాల, జీపీ తండాలు, సాయంత్రం 4 గంటలకు భీమ్గల్ మండలం పల్లికొండ, 5.30 గంటలకు బాచన్పల్లి, 7 గంటలకు పిప్రిలో ప్రచారం నిర్వహిస్తారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు.