కామారెడ్డి, ఏప్రిల్ 15 : తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఈ నెల 25 నుంచి మే 2 వరకు నిర్వహించనున్న పదో తరగతి, ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ సూచించారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పరీక్షల నిర్వహణ, ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన పదో తరగతి, ఇంటర్ పరీక్షల మాదిరిగానే అధికారులందరూ సమన్వయంతో పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండు సెషన్లలో నిర్వహిస్తారని పేర్కొన్నారు.
జిల్లాలో పదో తరగతి 923 మంది, ఇంటర్ 1,444 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. పదో తరగతి పరీక్షలకు ఐదు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇందులో రెండు కేంద్రాలు బాన్సువాడ, ఒక కేంద్రం ఎల్లారెడ్డి, మరో రెండు కేంద్రాలు కామారెడ్డిలో ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఇంటర్ పరీక్షలకు ఆరు కేంద్రాలను ఏర్పాటు చేయగా.. ఇందులో బాన్సువాడలో ఒకటి, ఎల్లారెడ్డిలో రెండు మిగతా కేంద్రాలను కామారెడ్డిలో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇంటర్ ప్రాక్టికల్స్ మే 3 నుంచి 10 వరకు నిర్వహిస్తారని పేర్కొన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.