టీచర్ల బదిలీల ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానున్నది. దీంతో ఉపాధ్యాయుల్లో ఉత్సాహం వెల్లివిరుస్తున్నది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ప్రభుత్వం ట్రాన్స్ఫర్ల ప్రక్రియకు పచ్చజెండా ఊపింది. పారదర్శకంగా బదిలీలు నిర్వహించేందుకు విద్యాశాఖ కసరత్తు చేపట్టింది. నేటి నుంచి 5వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. అక్టోబర్ 3లోపు ఉద్యోగోన్నతులు, బదిలీలు పూర్తి చేయనున్నారు. ట్రాన్స్ఫర్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. పూర్తి పారదర్శకంగా బదిలీలు చేపట్టేందుకు ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయడాన్ని స్వాగతిస్తున్నాయి.
కామారెడ్డి/ ఖలీల్వాడి, సెప్టెంబర్ 2: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించిన షెడ్యూల్ను రాష్ట్ర విద్యాశాఖ విడుదల చేసింది. ఈ నెల 3 నుంచి 5వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరిస్తారు. బదిలీల ప్రక్రియ మొత్తం ఆన్లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. గతంలో దరఖాస్తు చేసుకోని వారు కొత్తగా దరఖాస్తు చేసుకోవడం, దరఖాస్తు చేసుకున్న వారికి ఎడిట్ ఆప్షన్ ఇచ్చారు. సీనియారిటీ జాబితా అనంతరం వెబ్ఆప్షన్ల ద్వారా హెచ్ఎంల బదిలీలు చేపట్టనున్నారు. తర్వాత ఖాళీల ప్రకటన, ఉద్యోగోన్నతులు, అనంతరం అన్ని కేటగిరీల ఉపాధ్యాయులకు బదిలీలు చేపడతారు. బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది. సర్కారు జారీ చేసిన బదిలీ మార్గదర్శకాలు సైతం ఉద్యోగులకు మేలు చేకూరేలా ఉండడంతో వారంతా సంతోషం వ్యక్తంచేస్తున్నారు.
బదిలీల ప్రక్రియ ఇలా…
ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమై అక్టోబర్ 3వ తేదీన ముగియనున్నది. ప్రస్తుతం పనిచేస్తున్న స్థానంలో సెప్టెంబర్ 1 నాటికి రెండేండ్లు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు బదిలీ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఒకే పాఠశాలలో ఐదేండ్ల కాలం పూర్తయిన ప్రధానోపాధ్యాయులు, ఒకే పాఠశాలలో ఎనిమిదేండ్లుగా పనిచేస్తున్న ఉపాధ్యాయులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఇందులో భాగంగా వారు పనిచేస్తున్న స్థానాలను బదిలీల జాబితాలో చేర్చనున్నారు.
ఉమ్మడి జిల్లాలో 10,854 ఉపాధ్యాయులు
ఉమ్మడి జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు దీర్ఘకాలికంగా ఉద్యోగోన్నతులు, బదిలీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇందుకు సంబంధించిన న్యాయపరమైన చిక్కులు తొలగడంతో ప్రభుత్వం షెడ్యూల్ను విడుదల చేసింది. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు 4,938 ఉపాధ్యాయ పోస్టులకు 4,078 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 459 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పీజీ హెచ్ఎంలుగా ఉద్యోగోన్నతి పొందేవారు ఉన్నారు. 238 మంది వరకు స్కూల్ అసిస్టెంట్లు విధులు నిర్వర్తిస్తున్నారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య మేరకు బదిలీల వివరాలు స్పష్టం కానున్నాయి. నిజామాబాద్ జిల్లాలో 1156 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. మొత్తం మంజూరైన ఉపాధ్యాయుల సంఖ్య 5916 కాగా ప్రస్తుతం 5197 మంది పనిచేస్తున్నారు. 719 ఖాళీలున్నాయి.
దుర్వినియోగం చేసుకోవద్దు..
ఉపాధ్యాయులకు 8 సంవత్సరాల నుంచి ప్రమోషన్స్, 5 సంవత్సరాల నుంచి బదిలీలు లేవు. ప్రభుత్వం చేపడుతున్న బదిలీలు, ప్రమోషన్లకు ఉపాధ్యాయులు కోర్టుల చుట్టూ తిరగకుండా సామరస్యంగా చేసుకోవాలి. కోర్టు ఇచ్చిన ఈ అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు. ఉపాధ్యాయ సంఘా ల నాయకులకు ఇవ్వాల్సిన 10 పాయింట్లు ఇవ్వకున్నా, ఇప్పుడు చేపట్టే బదిలీలు, ప్రమోషన్స్ మాత్రం పారదర్శకంగా నిర్వహించాలి.
– దామోదర్రెడ్డి, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి
శుభపరిణామం..
చాలా సంవత్సరాల తర్వాత బదిలీల ప్రక్రియ నిర్వహించడం శుభపరిణామమే. గతంలో ఉద్యోగుల బదిలీల్లో అనేక అవకతవకలు జరిగేవి. ఇప్పుడు అలాంటి తప్పులు జరగకుండా, ఎలాంటి ఆటంకాలు లేకుండా బదిలీల ప్రక్రియ సజావుగా కొనసాగాలి. జాగ్రత్తగా బదిలీలు, ఉద్యోగోన్నతులు చేపట్టాలి. సంఘ నాయకులకు బదిలీల్లో అదనపు పాయింట్లు తొలగించడం హర్షించదగ్గ విషయం.
-అనిల్కుమార్, టీపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, కామారెడ్డి
హర్షణీయం..
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నివర్గాలకు న్యాయం చేయడంతోపాటు ఉపాధ్యాయుల ప్రమోషన్లు, బదిలీలు చేపట్టడం సంతోషించదగ్గ విషయం. ఏండ్లుగా ఎదురుచూస్తున్న మాకు బదిలీలు చేపడుతూ ఇబ్బందులు తీరుస్తున్నారు. ఉపాధ్యాయుల బాధలు తీరుస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
– అనిల్, టీఎస్పీటీఏ జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి
సర్కారు నిర్ణయం సంతోషకరం..
రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయుల ఉద్యోగోన్నతులు, బదిలీల ప్రక్రియ చేపట్టనుండడంతో ఉపాధ్యాయులు సంతోషంగా ఉన్నారు. ఉపాధ్యాయులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్కు ప్రత్యేక ధన్యవాదాలు. బదిలీల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలి.
– ప్రవీణ్నాయక్, ఎస్సీ,ఎస్టీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు, కామారెడ్డి
ప్రభుత్వ చిత్తశుద్ధితోనే..
రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టే నిర్ణయం తీసుకోవడాన్ని స్వాగతిస్తూ పారదర్శకంగా జరగాలని కోరుకుంటున్నాం. అలాగే ఉద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ప్రభుత్వ అధికారులు బదిలీల పక్రియని వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలి. ఉపాధ్యాయులకు న్యాయం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నది.
– బీరెల్లి కమలాకర్రావు, పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
విద్యార్థుల భవిష్యత్తుకు సర్కారు నాంది
రాష్ట్ర ప్రభుత్వం బదిలీల ప్రక్రియ చేపట్టడం శుభసూచకం. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు సర్కారు నాంది పలుకుతున్నది. విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలల్లో ఉపాధ్యాయులు చాలా అవసరం. ప్రభుత్వ నిర్ణయంతో చాలా చోట్ల ఉపాధ్యాయుల కొరత సమస్య తీరనున్నది. ఈ అవకాశాన్ని ప్రతి ఉపాధ్యాయుడు వినియోగించుకోవాలి. బదిలీలను పారదర్శకంగా చేపట్టాలి.
– వెంకటేశ్వర్లు గౌడ్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి, నిజామాబాద్