గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.5లక్షల ప్రమాద బీమా కల్పించడంపై గౌడ కులస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హరితహారంలో ఈత మొక్కలు నాటడం, వైన్సులలో రిజర్వేషన్లు కల్పించడం, నీరా కేఫ్లు ప్రారంభించడం ద్వారా ముఖ్యమంత్రి కేసీఆర్ తమకు ఎంతో లబ్ధి చేకూర్చారని చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు.
ఖలీల్వాడి/ఆర్మూర్, మే 3: సీఎం కేసీఆర్ కల్లుగీత కార్మికులకు రూ. 5 లక్షల బీమా కల్పిస్తూ తీసుకున్న నిర్ణయంపై గౌడ కులస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో గౌడ సంఘం కులస్తులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్ చిత్రపటాలకు బుధవారం క్షీరాభిషేకం చేశారు. జిల్లా గౌడ సంఘం కోశాధికారి చెరుకు లక్ష్మణ్గౌడ్ మాట్లాడుతూ.. రైతుబీమా తరహాలో గౌడ కార్మికులకు బీమా కల్పించడం సంతోషకరమన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఈత మొక్కలను నాటేందుకు అనుమతి ఇవ్వడం, వైన్ షాపుల్లో రిజర్వేషన్ కల్పించిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. హైదరాబాద్లో నీరా కేఫ్లు ప్రారంభించి గీత కార్మికుల ఆత్మగౌరవాన్ని పెంచారని అన్నారు. ఇందుకు కృషిచేసిన ఎమ్మెల్సీ వీజీ గౌడ్కు రుణపడి ఉంటామన్నారు. కార్యక్రమంలో సత్యనారాయణ గౌడ్, సాగర్గౌడ్, బండి సాయాగౌడ్, శేఖర్గౌడ్, రమేశ్గౌడ్ పాల్గొన్నారు. ఆలూర్ మండలం దేగాంలో గౌడ సంఘం గ్రామ నాయకులు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి చిత్రపటాలకు క్షీరాభిషేకం నిర్వహంచారు.