కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ సామాన్యులకు మళ్లీ నిరాశనే మిగిల్చింది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బుధవారం లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్.. బడుగు జీవులకు ఊరట కల్పించ లేకపోయింది. రైతులు, కూలీలు, యువత, మహిళలు, ఉద్యోగులు.. ఇలా ఏ ఒక్కరినీ నిర్మలమ్మ ఆకట్టుకోలేక పోయారు. పెరిగిన నిత్యావసరాల ధరలతో అల్లాడి పోతున్న సామాన్యులపై కాస్తయినా కనికరం చూపలేదు. ఇంధన రేట్లు, నిత్యావసరాల ధరల నియంత్రణకు ఎలాంటి చర్యలు ప్రతిపాదించలేదు. దేశానికి అన్నం పెట్టే రైతులకు బడ్జెట్లో ఎలాంటి ప్రోత్సాహకాలు ప్రకటించలేదు. ఎన్నో ఏండ్లుగా ఎదురు చూస్తున్న పసుపుబోర్డు ప్రస్తావనే తీసుకురాలేదు. లక్షలాది మంది ఆధారపడిన ఉపాధి హామీ పథకానికి సరిపడా నిధులు కేటాయించలేదు సరికదా కోతలు పెట్టారు. ఉమ్మడి జిల్లా ప్రజలు దశాబ్దాలుగా ఎదురు చూస్తున్న రైల్వే ప్రాజెక్టులను కనీసం పట్టించుకోక పోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది. వేతన జీవులను ఆకట్టుకునేందుకు ఐటీ స్లాబుల్లో మార్పులు చేస్తున్నట్లు ప్రకటించిన కేంద్ర సర్కారు.. షరతులు విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిజామాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తొమ్మిదేండ్లుగా ప్రజా సంక్షేమాన్ని విస్మరిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం మరోమారు అదే పంథాను ఎంచుకుంది. మోదీ సర్కారు బుధవారం ప్రవేశ పెట్టిన చివరి, పూర్తి స్థాయి బడ్జెట్ కూడా ప్రజలను తీవ్ర నిరాశ పర్చింది. దేశానికి వెన్నెముకగా నిలిచే రైతుకు ఇసుమంతైనా ప్రయోజనం చేకూర్చలేకపోయింది. కిసాన్ సమ్మాన్ కింద ఇచ్చే ప్రోత్సాహక నగదును ఏటా ఎకరానికి రూ.10 వేలు ఇవ్వాలన్న డిమాండ్ను మోదీ సర్కారు పక్కన పెట్టింది. మరోవైపు, ద్రవ్యోల్బణంతో ప్రజలంతా అల్లాడి పోతున్న తరుణంలో ఊరటనివ్వాల్సిన కేంద్రం.. రిక్త హస్తాలు చూపింది. ధరల అదుపునకు ఇంధన రేట్లను తగ్గిస్తారని సామాన్య ప్రజలంతా ఆశగా ఎదురు చూసినప్పటికీ బడ్జెట్ ప్రసంగంలో ఎక్కడా ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. ఎంతసేపు పన్ను మినహాయింపు పరిధిని పెంచినట్లుగా తెగ ప్రచారం చేసుకుంటున్నప్పటికీ, ఏటా రూ.3 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారి కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాల సంగతేందన్నది ప్రస్తావనకే రాలేదు. మరీ ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాలో రైతులు ఎదురు చూస్తున్న పసుపుబోర్డు ఊసే ఎత్తకపోవడం పసుపు రైతులను ఆగ్రహానికి గురి చేస్తున్నది. ఇచ్చిన మాటను తప్పడంతో పాటు పసుపు రైతుల బాధలను బీజేపీ పట్టించుకోక పోవడం దుర్మార్గమని రైతులు మండిపడుతున్నారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర 90 డాలర్లకు చేరినప్పటికీ, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించడానికి అడుగు ముందుకు వేయకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇందూర్కు మొండిచేయి..
దశాబ్దాల నుంచి పసుపుబోర్డు కోసం ఎదురుచూస్తున్న రైతులను కేంద్రం మళ్లీ విస్మరించింది. నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలకు చెందిన రైతుల ఆక్రందన అరణ్య రోదనగానే మారింది. 2019 ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పడంతో ఈ ప్రాంతంలో ధర్మపురి అర్వింద్కు రైతులు పట్టం కట్టారు. విజయం సాధించిన తర్వాత మాట మార్చిన అర్వింద్.. ప్రతిసారి తప్పించుకు తిరుగుతూ రైతులకు చిక్కకుండా పర్యటనలు చేస్తున్నాడు. కనీసం చివరి బడ్జెట్లోనైనా బోర్డు ఏర్పాటుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తాడేమో అని ఎదురు చూసిన అన్నదాతలకు నిరాశే మిగిలింది. ఎన్నికల బడ్జెట్గా భావిస్తున్న ఈ బడ్జెట్లోనూ బోర్డు హామీని నెరవేర్చేందుకు బీజేపీ ప్రయతించకపోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఏటా నిజామాబాద్ జిల్లాకు పసుపు బోర్డు విషయంలో మొండిచేయి చూపించడం పట్ల అన్నదాతలు బీజేపీపై దుమ్మెత్తిపోస్తున్నారు. మోదీ పరిపాలనలో ఎరువులు, విత్తనాల ధరలు అమాంతం ఎగబాకుతున్నాయి. ఈ విషయంలో తయారీ సంస్థలకు భారీగా లాభాలు, రైతులకు పెద్ద ఎత్తున ఆర్థిక భారం తప్పడం లేదు. కర్షకులకు కన్నీళ్లు తెప్పిస్తున్న ఎరువులు, విత్తనాల విషయంపైనా ఆర్థిక మంత్రి కనీసం పట్టనట్లు వ్యవహరించడంపై రుసరుసలు వ్యక్తం అవుతున్నాయి.
ఎన్నికల జిమ్మిక్కులు..
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జిమ్మిక్కులను ప్రదర్శించింది. గత తొమ్మిదేండ్లుగా ఎడాపెడా పన్నులను బాది ఇష్టానుసారంగా వ్యవహరించిన కేంద్ర సర్కారు 2023-24 వార్షిక బడ్జెట్లో మధ్య, దిగువ మధ్య తరగతి వర్గాలను ఆకట్టుకునేందుకు తాయిళాలు ప్రకటించింది. ఇందులో పన్ను విధింపులో సంవత్సర ఆదాయ పరిమితిని పెంచింది. రూ.7 లక్షల్లోపు ఆదాయం ఉన్న వారిపై జీరో పన్నును అమలు చేస్తున్నట్లుగా ప్రకటించింది. రూ.7లక్షలు దాటిన వారిపై ఏకంగా రూ.3లక్షల ఆదాయం నుంచి పన్నును ఆయా స్లాబుల ప్రకారం లెక్కించి వసూలు చేయబోతున్నారు. ఇలా రూ.15 లక్షల వరకు చివరి స్లాబుపై 30 శాతం పన్నును విధించబోతున్నారు.
ధరల నియంత్రణకు చర్యలు శూన్యం
మోదీ పాలనలో ద్రవ్యోల్బణం విపరీతంగా ఎగబాకింది. పెరిగిన ధరలతో ప్రజలంతా సతమతమవుతున్నారు. ఈ సమయంలో నెలవారీగా సగటు మధ్య తరగతి కుటుంబం సంపాదిస్తున్న ఆదాయంలో సగం కుటుంబ పోషణకే ఖర్చవుతోంది. బడ్జెట్లో ధరల తగ్గుదలపై కీలక నిర్ణయాలు ఉంటాయని బడుగు జీవులు ఆశించగా, నిర్మలా సీతారామన్ ఉసూరుమనిపించారు. పెట్రో ధరలతో పాటు నిత్యావసర ధరలకు కళ్లెం వేసేందుకు ప్రయత్నించక పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఎలాగైనా బాదుడే..
2023-24 వార్షిక బడ్జెట్లో పొందుపర్చిన ఆదాయ పన్ను విధింపు వర్గీకరణలో ఆరు స్లాబులున్నాయి. రూ.3 లక్షల లోపు జీరో పన్ను, రూ.3 -6 లక్షలకు 5 శాతం, రూ.6-9 లక్షలకు 10 శాతం, రూ.9-12 లక్షలకు 15శాతం, రూ.12-15 లక్షలకు 20 శాతం, రూ.15 లక్షలకు పైన 30 శాతం మేర పన్ను విధిస్తున్నారు. ఇందులో 7లక్షల్లోపు ఆదాయం కలిగిన వారికి పన్ను విధింపు ఉండదు. ఈ పరిధిని దాటితే పైన పేర్కొన్న స్లాబుల ఆధారంగా పన్ను విధిస్తారు.
మళ్లీ నిరాశే..
ఉత్తర తెలంగాణలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భౌగోళికంగా పక్కపక్కనే ఉన్న ఈ ముగ్గురు ఎంపీల ద్వారా గడిచిన నాలుగేళ్లలో ఒనగూరిన లాభం ఒక్కటీ లేదు. ఫక్తు రాజకీయం తప్ప అభివృద్ధి మాటెత్తని ఎంపీల తీరుతో ప్రజలు విసుగెత్తి పోయారు. కేంద్ర బడ్జెట్లో ఈ ప్రాంత డిమాండ్లకు సంబంధించిన అంశాలు ప్రస్తావనకే రాకపోవడంపై మండిపడుతున్నారు. పసుపుబోర్డుతో పాటుగా పరిశ్రమల స్థాపన విషయంలో ఏమైనా ప్రకటనలు ఉంటాయని భావించారు. ఈసారైనా కేంద్రం తెలంగాణ ప్రాంతానికి న్యాయం చేస్తుందని ఆశించగా నిరాశే మిగిలింది. కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ లోక్సభలో రైతుల ఆదాయం పెంచేందుకు నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పారు. విమాన రాకపోకలకు నిజామాబాద్ జిల్లాకు ఆనుకుని ఉన్న ప్రాంతాలకు మేలు చేకూర్చేలా జక్రాన్పల్లిలో ఎయిర్పోర్టు ప్రతిపాదన ఏండ్లుగా మూలుగుతోంది. మరుగున పడుతోన్న ఈ అంశాన్ని కేంద్రంతో మాట్లాడి ఎయిర్పోర్టు ఏర్పాటుకు కృషి చేయాలని ఎంపీని ఈ ప్రాంత ప్రజలు పదే పదే కోరుతున్నారు. కానీ ఆ దిశగా అర్వింద్ కనీస చొరవ చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వమే చొరవ తీసుకుని కొట్లాడుతుంటే పౌర విమానయాన శాఖ గతంలో గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ తర్వాత గాలికి వదిలేసింది.
రాష్ట్రంపై కేంద్రం వివక్ష
ఖలీల్వాడి, ఫిబ్రవరి 1 : తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ర్టాలకు బడ్జెట్లో ఎటువంటి కేటాయింపులు చేయకుండా కేంద్రం వివక్ష చూపిందని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. సబ్ కా సాత్ అని చెబుతున్న కేంద్ర ఎందుకు నిధులను సమానంగా పంపిణీ చేయడం లేదని ప్రశ్నించారు. 119 నర్సింగ్ కాలేజీలను బడ్జెట్లో ప్రకటించారని, వాటిని కేవలం మంజూరైన మెడికల్ కాలేజీ వద్దనే ఏర్పాటు చేస్తారని, ఈ క్రమంలో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా మంజూరు చేయనప్పుడు ఒక్క నర్సింగ్ కాలేజీ కూడా రాష్ర్టానికి రాదని స్పష్టం చేశారు. గుజరాత్లోని గిఫ్ట్ సిటీకి 2025 వరకు పన్ను మినహాయింపును పొడిగించినప్పుడు మరి తెలంగాణ నిమ్జ్ ఇతర సెజ్ల పరిస్థితి ఏమిటన్నారు. ఇది జాతీయ బడ్జెటా లేదా కొన్ని రాష్ర్టాల బడ్జెట్ మాత్రమేనా ప్రశ్నించారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టులకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. నీతి అయోగ్ సిఫారసు చేసినప్పటికీ ఒక్క రూపాయి ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్లో భవిష్యత్తుపై నిర్ధిష్టమైన ప్రణాళిక ఏమీ లేదని విమర్శించారు. కొత్త పథకాలు ప్రకటించకపోవడం, పాత పథకాలను విస్మరించడం వంటివి చూస్తుంటే ఏడాది తర్వాత ఈ ప్రభుత్వం వెళ్లిపోతున్నట్లు కనిపిస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణకు సంబంధించిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిజామాబాద్, వరంగల్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుకు భూమి అందుబాటులో ఉందని, 9 ఏండ్లుగా కోరుతున్నా కేంద్రం పెడచెవిన పెట్టిందన్నారు. మౌలిక సదుపాయాలకు రూ.10లక్షల కోట్లు కేటాయిస్తున్నామని ప్రకటించిన కేంద్రం వాటిని ఏ సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తారని ప్రశ్నించారు.
-ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
రైతులు, పేదలను దగా చేసే కేంద్ర బడ్జెట్
కమ్మర్పల్లి, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం బుధవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ రైతులను, పేదలను దగా చేసి, అదానీ, అంబానీలను ఆదుకునేలా ఉన్నదని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇది రైతులను, పేదలను పూర్తిగా వంచించే బడ్జెట్ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధిహామీ పథకానికి గత బడ్జెట్ కన్నా రూ.30 వేల కోట్లు తగ్గించి ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. మోదీ ప్రభుత్వం చివరి బడ్జెట్లో కూడా పసుపుబోర్డుకు మొండి చేయి చూపించిందన్నారు. నిజామాబాద్ ఎంపీ ఎన్నికల హామీని నెరవేర్చక పసుపు రైతులను వంచనకు గురి చేశాడని మండిపడ్డారు. కర్ణాటక అప్పర్ భద్రకు జాతీయ హోదానిచ్చి ప్రత్యేక నిధులు కేటాయించారు సరే, తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి సాగునీటి ప్రాజెక్టులను ఎందుకు మరిచారని ప్రశ్నించారు. తెలంగాణ జాతీయ రహదారులకు ఇప్పటివరకు రూ.లక్షా 25 వేల కోట్ల బడ్జెట్ కేటాయించిన కేంద్రం.. ఈ 8 సంవత్సరాల్లో ఖర్చు చేసింది కేవలం రూ.18 వేల కోట్లు మాత్రమేనని వివరించారు. బడ్జెట్లో తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ కేటాయించలేదన్నారు. నవోదయ పాఠశాలల ఊసే లేదన్నారు. రైల్వే లైన్లు లేనేలేవన్నారు. అన్నింటా తెలంగాణపై బీజేపీ, మోదీ ప్రభుత్వం వివక్ష ప్రదర్శించిందని మండిపడ్డారు. ఈ బడ్జెట్ కేటాయింపులతో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరి మరోసారి తేటతెల్లమైందన్నారు. ఇకనైనా తెలంగాణ బీజేపీ నేతలు జబ్బలు చరుచుకోవడం మానేసి కేటాయింపుల్లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారు.
-రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపాటు