కమ్మర్పల్లి, జూలై 20 : వానకాలం వచ్చిందంటే చాలూ ప్రకృతి అందాలు ఆహ్లాదాన్ని పంచుతాయి. ముఖ్యంగా గ్రామీణప్రాంతాల్లో పరుచుకున్న పచ్చదనం పరవశింపజేస్తుంది. కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉమ్మడి జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ప్రాజెక్టులు జలకళను సంతరించుకోగా పర్యాటకులతో సందడిగా మారుతున్నా యి. నిజామాబాద్, జగిత్యాల జిల్లాల సరిహద్దులో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్టు పొంగి ప్రవహిస్తున్నది. కమ్మర్పల్లి మండలం కోనాపూర్ వద్ద రెండు జిల్లాల పరిధిలో సుమారు 2700 ఎకరాల్లో పంటల కోసం సాగునీరు అందించడానికి నిర్మించిన ఈ ప్రాజెక్టు.. చుట్టూ చిక్కని అడవిలో..రెండు గుట్టల నడుమ నుంచి పరవళ్లు తొక్కుతూ 20 మీటర్ల ఎత్తు నుంచి మత్తడి దుంకుతూ పరవశింపజేస్తున్నది. ఈ ప్రాజెక్టు పిక్నిక్ స్పాట్కు అనుకూలంగా ఉండడంతో చుట్టు పక్కల గ్రామాలే కాకుండా నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, నిర్మల్, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల నుంచి సందర్శకులు తరలివస్తున్నారు. ఇక్కడే వంటలు చేసుకొని కుటుంబసభ్యులతో కలిసి సహపంక్తి భోజనాలు చేస్తున్నారు. ప్రాజెక్టుతోపాటు ప్రకృ తి అందాలను ఆస్వాదిస్తూ రోజంతా ఉల్లాసంగా గడుపుతున్నారు. గతేడాది కొవిడ్ నేపథ్యంలో ప్రాజెక్టు సందర్శనకు కోనాపూర్ గ్రామస్తులు అనుమతించలేదు. ప్రస్తుతం ప్రాజెక్టు మత్తడి దుంకుతుండడంతో పర్యాటకులు పోటెత్తుతున్నారు.