కామారెడ్డి టౌన్,జూలై 20 : తాళాలు వేసిన ఇండ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాను అరెస్టు చేసి చోరీ సొత్తును రికవరీ చేసినట్లు కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాట్లు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. గత నెల 29న ఎల్లారెడ్డి పోలీస్స్టేషన్ పరిధిలో గల కొక్కొండ, అడవిలింగాల్ గ్రామాలతో పాటు.. ఈ నెల 6వ తేదీన ఎల్లారెడ్డి పట్టణంలోని బీసీ కాలనీలో ఇండ్ల తాళాలను పగులగొట్టి దొంగలు వరుస చోరీలకు పాల్పడినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు మొత్తం ఏడు కేసులు నమోదు చేశామన్నారు. ఈ దొంగతనాల్లో 10.7 తులాల బంగారు, 31 తులాల వెండి వస్తువులు, రూ.లక్షా 76వేల నగదు అపహరించారన్నారు. వరుస చోరీ కేసులను ఛేదించడానికి ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి, ఎల్లారెడ్డి, కామారెడ్డి డిటెక్టివ్ సీసీఎస్ అధికారులతో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ఫుటేజీలు, సాక్ష్యాధారాలను సేకరించినట్లు తెలిపారు.
ఆరుగురు సభ్యులు గల ముఠా దొంగతనాలకు పాల్పడినట్లు తేల్చారు. వీరంతా నాందెడ్ జిల్లా దెగ్లూర్ తాలూకా గోవింద్ తండా, మోతీరాం తండాలకు చెందిన వారిగా గుర్తించామన్నారు. ప్రత్యేక బృందం మహారాష్ట్రకు వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నదని తెలిపారు. వీరిలో గోవింద్ తండాకు చెందిన గోపాల్(ఏ1), మోతీరాం తండాకు చెందిన చౌహాన్ శైలాజి(ఏ2), గోవింద్ తండాకు చెందిన చౌహాన్ బాలిరామ్(ఏ3), పవర్ చందర్(ఏ4), జాదవ్ పుడ్కల్(ఏ5), పవర్ ప్రకాశ్(6ఏ)లను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరి వద్ద నుంచి 10.7 తులాల బంగా రం, 39 తులాల వెండి ఆభరణాలు, రూ.99 వేలతో పాటు పారిపోవడానికి ఉపయోగించిన కారు, ఇంటి తాళాలను పగులగొట్టడానికి ఉపయోగించిన ఇనుప రాడ్లను ప్రత్యేక బృందం స్వా ధీనం చేసుకున్నదన్నారు. ఆరుగురిని కోర్టుకు హాజరుపర్చామని ఎస్పీ తెలిపారు. ఈ కేసులను ఛేదించడంలో చాకచాక్యంగా వ్యవహరించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి, ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ జాన్రెడ్డి, ఎల్లారెడ్డి ఎస్సై శ్వేత, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్, కానిస్టేబుల్ గణపతి, ఎల్లారెడ్డి పీఎస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.
నకిలీ డీఎస్పీ స్వామి వ్యవహారంపై సమగ్ర విచారణ
కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం తుజాల్పూర్ గ్రా మానికి చెందిన నకిలీ డీఎస్పీ స్వామి వ్యవహారంపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఎస్పీ శ్వేతారెడ్డి తెలిపారు. బీబీపేట పోలీస్ స్టేషన్లో స్వామికి ఎవరెవరు సహకరించారనే కోణంలో విచారణ కొనసాగుతున్నదన్నారు. స్వామిపై హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యిందన్నారు.జిల్లాలో స్వామి ఏయే ప్రాంతాల్లో సంచరించాడు..? ఇంకా ఏమైనా మోసాలకు పాల్పడ్డాడా అనే దానిపై వి చారిస్తున్నామని తెలిపారు. స్వామి చేతిలో నష్టపోయిన బాధితులు నిర్భయంగా ఫిర్యాదు చే యాలని ఎస్పీ సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ అనోన్య, ఎల్లారెడ్డి డీఎస్పీ శశాంక్ రెడ్డి, ఎల్లారెడ్డి సీఐ రాజశేఖర్, సీసీఎస్ ఇన్స్పెక్టర్ జాన్ రెడ్డి, ఎస్సై ఉస్మాన్ పాల్గొన్నారు.