వ్యాసమహర్షికి పట్టు వస్ర్తాలు సమర్పించిన ఎమ్మెల్యే విఠల్రెడ్డి
కొవిడ్ నిబంధనల మధ్య వేడుకల నిర్వహణ
బాసర, జూలై 24 : బాసర శ్రీ సరస్వతీ అమ్మవారి ఆలయంలో శనివారం గురుపౌర్ణమి వేడుకలను ఘనం గా నిర్వహించారు. దేవస్థాన వైదిక బృందం ఆధ్వర్యం లో ఉదయం గణపతి పూజ, పుణ్యాహవాచనం, సరస్వతీమంత్ర సహిత చండీహోమం, మహాపూర్ణాహుతి, వ్యాసమందిరంలో ఉపనిషత్ అభిషేకం, ప్రత్యేక పూజ లు నిర్వహించారు. వేదవ్యాసుడికి ఎమ్మెల్యే విఠల్రెడ్డి పట్టు వస్ర్తాలు సమర్పించారు. కొవిడ్ నిబంధనలతో వేడుకలు నిర్వహించారు.
నిర్మల్ గండిరామన్న ఆలయంలో..
నిర్మల్ అర్బన్, జులై 24 : నిర్మల్ పట్టణంలోని గండిరామన్న దత్తసాయి ఆలయంలో గురుపౌర్ణమి సందర్భంగా ఉదయం సాయిబాబాకు మంగళస్నానం, ప్రత్యేక పూజలు, మధ్యాహ్నం హారతి కార్యక్రమం నిర్వహించారు. వేడుకలకు పట్టణంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సతీమణి అల్లోల విజయలక్ష్మి, కాళేశ్వర ఆలయ డైరెక్టర్ కొరిపెల్లి దేవేందర్రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేశారు. 48 గంటల పాటు నిర్వహించిన అఖండ సాయినామం ముగిసింది. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆలయ ట్రస్టీ చైర్మన్ లక్కాడి జగన్మోహన్రెడ్డి, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజలు
ఆదిలాబాద్ రూరల్, జూలై 24: గురుపౌర్ణమి వేడుకలను ఆదిలాబాద్ పట్టణంలో ప్రజలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే సాయిబాబా ఆలయాలకు భారీగా తరలిరావడంతో సందడి నెలకొంది. వేద పండితులు సాయిబాబా ఆలయాల్లో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. పట్టణంలోని శాంతినగర్, తిలక్నగర్లోని ఆలయాల్లో భక్తజన సందోహం కనిపించింది. అనంతరం ఆలయాల్లో మహాప్రసాద వితరణ చేశారు. కొన్ని పాఠశాలల్లో తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను శిష్యులు ఘనంగా సన్మానించారు.