కోల్ కతా : పశ్చిమ బెంగాల్ సీఎంగా మమతా బెనర్జీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో బీజేపీ చీఫ్ జేపీ నడ్డా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం చోటుచేసుకున్న హింసాకాండను ప్రస్తావిస్తూ ప్రజలను కాపాడే బాధ్యత కలిగిన వారే హింసకు బాధ్యులని నడ్డా ఆరోపించారు. వారు (టీఎంసీ) ప్రమాణ స్వీకారం చేయవచ్చు..ప్రజాస్వామ్యంలో ఇది వారి హక్కని అయితే బెంగాల్ లో రాజకీయ హింసను రూపుమాపేందుకు తాము కూడా ప్రతినబూనామని స్పష్టం చేశారు.
ప్రజా తీర్పును ఆమోదించి బాధ్యత కలిగిన విపక్షంగా వ్యవహరిస్తామని చెప్పారు. బెంగాల్ లో రాజకీయ హింసను నిర్మూలించడం, కొన్ని వర్గాలను ప్రసన్నం చేసుకునే పద్ధతులకు స్వస్తి పలకడం వంటి తమ కర్తవ్యాలను నెరవేర్చేందుకు పాటుపడతామని పేర్కొన్నారు. ఇక రాజ్ భవన్ లో జరిగిన దీదీ ప్రమాణ స్వీకారానికి టీఎంసీ నేతలు పారథ ఛటర్జీ, సుబ్రత ముఖర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్, అభిషేక్ బెనర్జీ తదితర నేతలు హాజరయ్యారు.