నల్లగొండ ప్రతినిధి, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ) : 2001, ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ నేడు 23వ ఆవిర్భావ దినోత్సవానికి సిద్ధమైంది. ఉమ్మడి జిల్లా పరిధిలోని మూడు జిల్లాల పార్టీ కార్యాలయాల్లో శనివారం పార్టీ పతకాన్ని ఆవిష్కరించనున్నారు. పార్టీ యావత్తు పార్లమెంట్ ఎన్నికల్లో నిమగ్నమైన నేపథ్యంలో బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల వేదికగానే ఆవిర్భావ దినోత్సవాలు నిర్వహించాలని పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఆవిర్భావ వేడుకల్లో పార్టీ జిల్లా అధ్యక్షులు, కార్యవర్గం, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భాగస్వాములు కావాలని ఆయన సూచించారు. ఈ మేరకు నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రిభువనగిరి జిల్లా పార్టీ కార్యాలయాల్లో వేడుకలకు సన్నాహకాలు పూర్తి చేశారు. నల్లగొండలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఉదయం 9గంటలకు ఆవిర్భావ వేడుకలు నిర్వహించనున్నట్లు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డితోపాటు జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా ముఖ్య నేతలంతా పాల్గొంటారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.