Rahul Gandhi : ఇటీవల సీజేపీ ఆందోళనలో పాల్గొన్న విద్యార్థులు, యువతపై కాల్పులు జరపాలని ఆదేశించింది కేంద్ర హోం మంత్రి అమిత్ షా అని లోక్సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలోని విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్ కంట్రోల్ చేస్తుందని విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీ, సీజేపీ ఆందోళనలో విద్యార్థులపై లాఠీఛార్జి వంటి అంశాలపై లోక్సభలో బుధవారం చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్, అమిత్ షాపై ఘాటు విమర్శలు చేశారు.
‘‘విద్యార్థులపై కాల్పులు జరపమని ఆదేశించింది కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విద్యార్థుల శరీరంలోకి ఆయన పెల్లెట్స్ ప్రయోగించారు. భారతదేశ విద్యార్థులపై కాల్పులకు ఆదేశించారు. ఈ దళాలు హోంమంత్రి అమిత్ షా లేదా ప్రధాన మంత్రి ఆధ్వర్యంలోనే పని చేస్తాయి. దేశ విద్యా, పరీక్షల వ్యవస్థను ఆర్ఎస్ఎస్ ఆక్రమించింది. ఆర్ఎస్ఎస్ సభ్యులే విద్యావ్యవస్థలో కీలక స్థానాల్లో ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినంత మాత్రాన పెద్దగా ఏమీ మారిపోదు. దానికి ఉదాహణ కూడా ఆయనే. దేశంలోని మొత్తం విద్యావ్యవస్థను ఆర్ఎస్ఎస్ నడిపిస్తోంది. ప్రతి యూనివర్సిటీని ఆర్ఎస్ఎస్ సంబంధిత వైస్ ఛాన్స్లర్లే నడిపిస్తున్నారు’’ అంటూ రాహుల్ గాంధీ ఆరోపించారు. అయితే, రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, ఇతర ఎన్డీయే ఎంపీలు స్పందించారు.
కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ నిరూపించాలని వారు డిమాండ్ చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తూ, సభా కార్యక్రమాలకు అడ్డం పడుతున్నారని విమర్శించారు. రాహుల్ గాంధీ తన ఆరోపణల్ని నిరూపించాలని లేదంటే క్షమాపణలు చెప్పాలని కిరణ్ రిజిజు సహా పలువురు ఎన్డీయే ఎంపీలు డిమాండ్ చేశారు. సరైన ఆధారాలు లేకుండా ఇలా సభలో ఆరోపణలు చేయడం సరికాదని విమర్శించారు.