గుణా, బెమెతరా: కాంగ్రెస్ పార్టీ మతాలవారీగా వ్యక్తిగత చట్టాల అమలుకు హామీ ఇస్తే.. బీజేపీ మాత్రం మోదీ గ్యారంటీగా ఉమ్మడి పౌర స్మృతి(యూసీసీ)ని దేశవ్యాప్తంగా అమలు చేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శుక్రవారం ఛత్తీస్గఢ్లోని బెమెతరా, మధ్యప్రదేశ్లోని గుణాలో జరిగిన లోక్సభ ఎన్నికల సభల్లో ఆయన ప్రసంగించారు.
‘కాంగ్రెస్ మ్యానిఫెస్టో జాగ్రత్తగా చదవండి. వాళ్లు షరియా చట్టాన్ని, ట్రిపుల్ తలాక్ను మళ్లీ తీసుకురావాలనుకుంటున్నారు. ఈ దేశాన్ని షరియా చట్టంతో నడపాలా?’ అని ఆయన ప్రశ్నించారు. బీజేపీ ఉన్నంత వరకు వ్యక్తిగత చట్టాలను అమలు చేయనివ్వదన్నారు. ఇప్పటికే తాము ఉత్తరాఖండ్లో యూసీసీని అమలు చేశామని తెలిపారు.