ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 26 : ఉస్మానియా యూనివర్సిటీ 107వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న వేడుకలు ఘనంగా ముగిశాయి. చివరిరోజు శుక్రవారం ఠాగూర్ ఆడిటోరియంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించారు. యూజీసీ డీన్ ప్రొఫెసర్ జి.మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నీతి ఆయోగ్ సభ్యుడు, డీఆర్డీవో మాజీ డీజీ, పద్మభూషణ్ డాక్టర్ విజయ్కుమార్ సారస్వత్, గౌరవ అతిథులుగా రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం, అమెరికాలోని ఇమేజియా కార్పొరేషన్ ఫౌండర్, సీఈవో వీణ గుండవెళ్లి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డాక్టర్ వీకే సారస్వత్ మాట్లాడుతూ గత పదేళ్లలో దేశ స్థూల జాతీయోత్పత్తి 30 శాతం పెరిగిందని అన్నారు. సమాజాభివృద్ధికి విజ్ఞాన శాస్ర్తాలు చోదక శక్తిగా ఉంటాయని చెప్పారు. అదే సందర్భంలో సమాజంలో ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారం చూపాల్సిన బాధ్యత కూడా విజ్ఞాన శాస్ర్తాలపైనే ఉంటుందని అభిప్రాయపడ్డారు. దేశ ఆర్థిక, సామాజిక, విజ్ఞానాభివృద్ధి తీరుతెన్నులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. దేశ సమగ్రాభివృద్ధి, సవాళ్లను అధిగమించేందుకు విద్యాసంస్థలతో కలిసి పరిశ్రమలు, లేబరేటరీలు పరిశోధనలను మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధితో పాటు సమాజ అవసరాలు, ఉద్యోగ కల్పన దిశగా ప్రణాళికలు ఉండాలని సూచించారు.
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచే దిశగా నూతన జాతీయ విద్యావిధానం 2020 అందుబాటులోకి వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. బుర్రా వెంకటేశం మాట్లాడుతూ విద్యారంగానికి ఓయూ చేస్తున్న కృషిని కొనియాడిన ఆయన మరింత బాధ్యతతో అన్ని రంగాల్లోనూ ఓయూ మరింత ఎత్తుకు ఎదగాలని ఆకాంక్షించారు. వీణ గుండవల్లి మాట్లాడుతూ ఎవరికి వారే వనరులను సృష్టించుకునే దిశగా ఆలోచించి, ప్రణాళిక వేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి జయరాజ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ, వివిధ కళాశాలల ప్రిన్సిపల్స్, డైరెక్టర్లు, డీన్లు, వివిధ విభాగాల హెడ్లు, అధ్యాపకులు, ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.