తాండూర్, ఏప్రిల్ 26 : మంచిర్యాల జిల్లా తాండూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, వర్గ విభేదాలు ఒకసారిగా భగ్గుమన్నాయి. తాండూర్కు చెందిన సీనియర్ నాయకుడు, ఉమ్మడి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మహేందర్రావు, తన అనుచరులతో శుక్రవారం కాంగ్రెస్లో చేరేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. ఈ విషయమై ఎమ్మెల్యే వినోద్కు ముందే సమాచారమిచ్చాడు. కిష్టంపేట, తాండూర్ ఐబీలో రోడ్ షో పూర్తి చేసుకున్న ఎమ్మెల్యే వినోద్, నాయకులు వేణుగోపాలాచారి, పురాణం సతీశ్, ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ నాయకులతో కలసి తాండూర్కు చేరుకున్నారు.
తన ఇంటివద్ద మహేందర్రావు, ఆయన సతీమణి, మాజీ సర్పంచ్ ఉమారాణి, ఇతర నాయకులు మంగళహారతులతో వినోద్కు స్వాగతం పలికేందుకు రాగా, ఒకసారిగా మరోవర్గం నాయకులు వ్యతిరేక నినాదాలు చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహేందర్రావును, ఆయన అనుచరులను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఆందోళనకు దిగారు. ఇంతలోనే మహేందర్రావు వచ్చి తమను పార్టీలో ఎందుకు చేర్చుకోరంటూ ప్రశ్నించాడు.
దీంతో ఆయనను స్వాగతించే వర్గం, వ్యతిరేకించే వర్గం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరకు ఎవరినీ పా ర్టీలో చేర్చుకోకుండానే నాయకుల వాహనాలు వెనుదిరిగాయి. ఆపై మరోచోట సమావేశం కాగా, అక్కడ కూ డా ఇరు వర్గాల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైం ది. చివరకు ఘర్షణకు దారి తీయగా పోలీసుల జోక్యం అనివార్యమైంది. ఇంత జరుగుతున్నా ఎమ్మెల్యేగానీ, అభ్యర్థిగానీ నోరు మెదపకపోవడం గమనార్హం. కొంతమంది స్వార్థం కోసం తన చేరికను అడ్డుకుంటున్నారని, ఇది పార్టీ అభ్యర్థి గెలుపోటములపై ప్రభావం చూపుతుందని మహేందర్రావు పేరొన్నారు.
తాండూర్లో చోటుచేసుకున్న గొడవకు ముందే తాండూర్ ఐబీ వద్ద రోడ్షోలో స్థానిక నాయకుల మధ్య ఆధిపత్య పోరు కనిపించింది. కిష్టంపేట, తాండూర్ ఐబీ, బోయపల్లి, కొత్తపల్లి, మాదారంకు చెందిన పలువురు పార్టీలో చేరాల్సి ఉండగా, వారిని కలువకుండా, చేరికలు లేకుండానే ఎమ్మెల్యే ప్రచార వాహనం తాండూర్ గ్రామానికి వెళ్తుండడంతో ఆయా గ్రామాల నాయకులు నిరాశ పడ్డారు. ఒకరిద్దరు నాయకుల మాటలు విని ఇక్కడ చేరికలు, రోడ్షో నిర్వహించకుండానే తాండూర్ వెళ్లడంపై తమ ఆవేదనను బహిరంగంగానే వెళ్లిబుచ్చారు. దీంతో చాలా మంది నాయకులు ప్రచారానికి వెళ్లలేదు.