కరోనా వైరస్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
అర్హులు వ్యాక్సినే తీసుకోవాలి
నర్సంపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్
కొనసాగుతున్న వ్యాక్సినేషన్
నర్సంపేట, ఏప్రిల్ 25: కరోనా వైరస్ కట్టడికి అప్రమత్తతే ఆయుధమని, ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నర్సంపేట ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాల్ అన్నారు. పట్టణంలోని ఏరియా దవాఖానలో ఆదివారం ఆయన కరోనా వ్యాక్సినేషన్ను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపాల్ మాట్లాడుతూ కరోనా వైరస్ బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఎంతో మేలు జరుగుతుందన్నారు. అందరూ కరోనా టీకా వేసుకుంటే మంచిదని, ప్రస్తుతం 45 ఏళ్ల పైబడిన వారందరికీ ఉచితంగా రాష్ట్ర ప్రభుత్వం టీకాలు వేస్తున్నదని వివరించారు. వ్యాక్సిన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవని భరోసా ఇచ్చారు. జ్వరం, ఒళ్లు నొప్పులు వస్తేనే టీకా బాగా పనిచేసినట్లన్నారు. గ్రామాలు, పట్టణాల్లో ప్రజలందరూ విధిగా మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఖానాపురం: ప్రజలు కరోనా వైరస్పై అప్రమత్తంగా ఉండాలని ఓడీసీఎంఎస్ చైర్మన్ గుగులోత్ రామస్వామినాయక్ అన్నారు. మండలకేంద్రంలో ఆయన మాట్లాడుతూ రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు గుంపులుగా ఉండొద్దన్నారు. అత్యవసర సమయంలో బయటకు వెళ్లేటప్పుడు విధిగా మాస్క్ ధరించాలని కోరారు. అదేవిధంగా భౌతికదూరం పాటించాలన్నారు. లక్షణాలు ఉంటే వెంటనే టెస్టులు చేసుకోవాలని కోరారు. పాజిటివ్ వచ్చిన వారు బయట తిరగకుండా హోం ఐసొలేషన్లో ఉండాలని విజ్ఞప్తి చేశారు.
167 పాజిటివ్ కేసులు..
దుగ్గొండి: మండలంలో కరోనా వైరస్ చాపకింది నీరులా వ్యాప్తి చెందుతున్నది. మండలకేంద్రంతో పాటు కేశవాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గ్రామాల్లో ఏర్పాటు చేసిన ఆరోగ్య ఉప కేంద్రాల్లో రోజూ వైద్య సిబ్బంది ర్యాపిడ్ యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నట్లు దుగ్గొండి, కేశవాపురం పీహెచ్సీల వైద్యాధికారులు రాజు, స్వప్న తెలిపారు. దుగ్గొండి పీహెచ్సీ పరిధిలోని గ్రామాల్లో మొత్తం 97, కేశవాపురం పీహెచ్సీ పరిధిలో 70 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు తెలిపారు. ప్రతి రోజు 80 నుంచి వంద మందికి కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు మండలవ్యాప్తంగా 1500 మందికి వ్యాక్సిన్ వేసినట్లు వెల్లడించారు. పాజిటివ్ కేసులు పెరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచించారు.
105 మందికి కరోనా పరీక్షలు
గీసుగొండ: మండలకేంద్రంలోని మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం 105 మందికి కరోనా పరీక్షలు చేసినట్లు సీహెచ్వో మదుసూధన్రెడ్డి తెలిపారు. 17 మందికి పాజిటివ్ వచ్చినట్లు వెల్లడించారు. 82 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కరోనా టీకాలపై అపోహలు వద్దని సూచించారు.
33 మందికి కరోనా వ్యాక్సిన్
నడికూడ: రాయపర్తి పీహెచ్సీలో ఆదివారం 33 మందికి కరోనా వ్యాక్సిన్ అందించినట్లు వైద్యాధికారి ప్రదీప్కుమార్ తెలిపారు. 34 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, ఇద్దరికి పాజిటివ్ వచ్చిందన్నారు. కరోనా వచ్చిన వారు మందులు వాడుతూ హోం క్వారంటైన్లో ఉండాలని కోరారు.
కరోనా కట్టడికి టీకా వేసుకోవాలి
ఆత్మకూరు: కరోనా కట్టడికి తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలని వైద్యాధికారి రణధీర్ కోరారు. మండలకేంద్రంలోని పీహెచ్సీలో కరోనా టెస్టులు చేశారు. హౌసుబుజుర్గు సర్పంచ్ రబీయాబీ హుస్సేన్ మాట్లాడుతూ కరోనా వ్యాక్సిన్, టెస్టుల కోసం గ్రామస్తులను ఆత్మకూరు పీహెచ్సీకి తరలిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో వైరస్ నివారణ చర్యలు చేపట్టామన్నారు. ప్రజలు కరోనా కట్టడికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
23 మందికి పాజిటివ్
సంగెం: మండలంలో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున కొన్ని గ్రామాల్లో స్వచ్ఛంద లాక్డౌన్ పాటిస్తున్నారు. మండలంలోని గవిచర్ల, మొండ్రాయిలో గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో స్వచ్ఛంద లాక్డౌన్ కొనసాగుతున్నది. దీంతో స్థానికులు ఇండ్లకే పరిమితమవుతున్నారు. ఆదివారం మండలంలో 23 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు.
11 కరోనా పాజిటివ్ కేసులు
పర్వతగిరి: మండలంలో 11 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ ప్రసాద్ ముఖర్జీ తెలిపారు. ఏబీతండా 1, దూపతండా 1, ఇస్లావత్తండా 1, పర్వతగిరి 1, అనంతారం 3, కొంకపాక 1, ఏనుగల్లు 1, సాయిరెడ్డిపెల్లి 1, రావూరులో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. 230 మందికి కరోనా వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు.
స్వీయనియంత్రణే శ్రీరామరక్ష
నల్లబెల్లి: కరోనా వైరస్పై స్వీయ నియంత్రణే శ్రీరామరక్ష అని నల్లబెల్ల్లి పీహెచ్సీ వైద్యాధికారి మహేందర్నాయక్ అన్నారు. మండలకేంద్రంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ కరోనా నియంత్రణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టినా ప్రజల సహకారం అవసరమన్నారు. ప్రజలు ప్రభుత్వ నిబంధనలు పాటిస్తే కరోనాను కట్టిడి చేయొచ్చన్నారు.