శంషాబాద్ రూరల్, (ఏప్రిల్ 30) :కరోనాతో కొడుకు మృతి చెందగా.. మృతదేహాన్ని కూడా దవాఖానవారు ఇవ్వకపోడంతో ఆందోళన చెందిన అతని తల్లి ఒక్కసారిగా గుండెపోటు వచ్చి తనువుచాలించింది. ఈ విషాద ఘటన శంషాబాద్ మండలంలోని నానాజీపూర్ గ్రామంలో చోటుచేసుకున్నది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా నివాసం ఉండే పిట్లెల మాణిక్యానికి(40) భార్య , ఇద్దరు పిల్లలు ఉన్నారు. తల్లి జంగమ్మ(75) మాణిక్యంతోనే ఉంటుంది. కాగా… మానిక్యానికి 10 రోజుల క్రితం జ్వరం రాగా.. కరోనా పరీక్ష చేయించగా పాజిటివ్గా తేలింది. వెంటనే నగరంలోని ఓ ప్రైవేటు దవాఖానలో చేరాడు.. అక్కడ వారిఫీజు భరించలేక కుటుంబ సభ్యులు మాదాపూర్లోని ఓ దవాఖానకు తరలించారు.
అక్కడ రూ.6 లక్షలు చెల్లించాలని.. లేకపోతే ఇంటికి తీసుకుపోండి అంటూ దవాఖానవారు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. దీంతో మొదట రూ.5లక్షలు చెల్లించారు. మూడు రోజుల తరువాత మరో రూ.6లక్షలు చెల్లించాలన్నారు. దీంతో ఇప్పుడు డబ్బులులేవు.. రెండు రోజుల్లో తీసుకువస్తామని కుటుంబ సభ్యులు చెప్పారు. ఇంతలో గురువారం సాయంత్రం మాణిక్యం మృతి చెందాడని దవాఖానవారు సమాచారం అందించారు. రూ.6లక్షలు చెల్లిస్తేనే మృతదేహాన్ని అప్పగిస్తామని దవాఖానవారు చెప్పారు. ఒకవైపు కొడుకు మృతి.. మరోవైపు మృతదేహాన్ని కూడా ఇవ్వకపోవడంతో.. అతని తల్లి జంగమ్మకు ఒక్కసారిగా గుండెపోటు వచ్చి కుప్పకూలి మృతి చెందింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా.. కనీసం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవతీసుకోవాలని అతని కుటుంబ సభ్యులు, బంధువులు కోరుతున్నారు.