ఉస్మానియా యూనివర్సిటీ, డిసెంబర్ 16 : యూరప్లోని దేశాలలో ఉన్న విద్యావకాశాలపై ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలో గురువారం సదస్సు నిర్వహించారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్ (ఐఈఈఈ) ఓయూ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన విభాగం ‘యూరోపియన్ యూనివర్సిటీస్ న్యూ అవెన్యూస్ ఫర్ ఇండియన్ స్టూడెంట్స్’అనే అంశంపై ఈ సదస్సును నిర్వహించింది.
కళాశాల ప్రధాన భవనంలోని అసెంబ్లీ హాల్లో నిర్వహించిన ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా టర్నింగ్ పాయింట్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ లిమిటెడ్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ శామ్యూల్ ఇసాక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యూరోపియన్ యూనివర్సిటీలలో ఉన్న విద్యావకాశాలను వివరించారు.
అక్కడ ఏయే యూనివర్సిటీలలో ఎలాంటి అవకాశాలు అందుబాటులో ఉంటాయి, ఏ కోర్సులకు డిమాండ్ ఎక్కువగా ఉంటుందో చెప్పారు. ఆయా యూనివర్సిటీలకు దరఖాస్తు చేసుకునేందుకు ఏయే అర్హతలు ఉండాలో కూడా పేర్కొన్నారు.
యూరప్లోని అన్ని యూనివర్సిటీలలో కూడా తక్కువ ట్యూషన్ ఫీజుతో ప్రపంచస్థాయి విద్య, సదుపాయాలను పొందవచ్చని వివరించారు. భవిష్యత్తులో ఉన్నత విద్యాభ్యాసం చేసేందుకు కూడా అవకాశం ఉంటుందన్నారు.
విద్య పూర్తయిన తరువాత ఉపాధి అవకాశాలు సైతం విస్తృతంగా అందుబాటలో ఉంటాయని చెప్పారు. అక్కడ బ్యాచ్లర్ డిగ్రీ పూర్తి చేస్తే, మాస్టర్స్ డిగ్రీ ఉచితంగా పూర్తి చేసే అవకాశం ఉంటుందన్నారు. మనదేశంతో పోలిస్తే అక్కడ జీవన వ్యయం ఎక్కువగా ఉంటుందని, కానీ అందుకు తగినట్లు పార్ట్టైం ఉద్యోగాలు లభిస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఓయూ డెవలప్మెంట్, యూజీసీ ఎఫైర్స్ డీన్ ప్రొఫెసర్ జి. మల్లేశం, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్టీ) మాజీ డైరెక్టర్ ప్రొఫెసర్ మురళీదర్శన్, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు.