హైదరాబాద్ : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, ప్రజల జీవనంలో వస్తున్న మార్పులను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో భాగంగా కాకతీయ యూనివర్సిటీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇంటింటికి నీరందించడం ద్వారా, ఇల్లాలి కష్టాలను తీర్చే లక్ష్యంతో తెలంగాణ సర్కారు చేపట్టిన మిషన్భగీరథ పథకం, చిన్ననీటి వనరుల పరిరక్షణను అమలుచేసిన మిషన్ కాకతీయ పథకాలపై డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సులను ప్రవేశపెట్టనున్నది.
2022- 23 విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులను అందుబాటులోకి తీసుకురానున్నది. ఇదే అంశంపై బుధవారం కేయూ అధికారులు ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. తొలుత కేయూ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా ఈ కోర్సులను ప్రవేశపెట్టి, స్పందనను బట్టి రెగ్యులర్ కోర్సులుగా ప్రవేశపెట్టాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే కేయూలో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను డిగ్రీ పాఠ్యాంశంగా చేర్చి అమలుచేస్తున్నారు.
2018 సంవత్సరం నుంచే ఈ రెండు పథకాలను బీఎస్సీ వాటర్ రీసోర్స్ మేనేజ్మెంట్ సబ్జెక్టులో చేర్చారు. ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం(సీబీసీఎస్)లో భాగంగా జనరల్ ఎలెక్టివ్ సబ్జెక్టుగా వాటర్ రీసోర్స్ మేనేజ్మెంట్ను ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారు. వాటర్ రీసోర్స్ మేనేజ్మెంట్ సబ్జెక్ట్ను 100 మార్కులకు గాను నిర్వహిస్తుండగా, ఇది పూర్తిచేసిన వారికి 4 క్రెడిట్లను జారీచేస్తున్నారు. ఈ సబ్జెక్టులోని యూనిట్ -4లో భాగంగా మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను బోధిస్తుండగా, తాజాగా సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించారు.