అమరావతి,జూన్ 29: విశాఖ మన్యంలో దారుణం చోటుచేసుకున్నది. ఆస్తికోసం సొంత తమ్ముడే అన్నను అత్యంత దారుణంగా హత్య చేశాడు. కత్తితో అతికిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన విశాఖ ఏజెన్సీ డుంబ్రిగుడ మండలం దేముడు వలసం గ్రామంలో జరిగింది.దేముడు వలసం గ్రామానికి చెందిన వేముల కొమ్ములకు ఇద్దరు కొడుకులు. వాసుదేవ్, జగన్నాథం. వీరికి గ్రామంలో కాఫీ తోటలు, భూములు ఉన్నాయి.
కొమ్ముల ఉన్న ఆస్తి మొత్తాన్ని చిన్న కొడుకు జగన్నాథంకు కట్టబెట్టడంతో పెద్దకొడుకు వాసుదేవ్ ప్రశ్నించాడు. గత కొంతకాలంగా ఈ విషయంపై కుటుంబసభ్యుల మధ్య వివాదం జారుగుతోంది.ఈ క్రమంలో భూ సమస్యను పరిష్కరించుకుందామని కుటుంబసభ్యులు వాసుదేవ్ను ఇంటికి పిలిచారు. అందరూ కలిసి మాట్లాడుకుంటున్న సమయంలో తమ్ముడు జగన్నాథం ఆగ్రహంతో కత్తి తోవాసుదేవ్పై దాడి చేశాడు.
అయితే ఈ ఘటనకు పాల్పడుతున్న అతన్ని కుటుంబ సభ్యులెవరూ నిలువరించకుండా.. జగన్నాథంకు సహకరించారు. అయితే.. పక్కనే ఉన్న వాసుదేవ్ భార్య ఈ ఘటన చూసి అరుపులు, కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు వచ్చారు. ఈలోగా హత్యచేసిన వారంతా పారిపోయారు. మృతుడు వాసుదేవ్ భార్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నామని.. త్వరలోనే పట్టుకుంటామని డుండ్రిగుడ ఎస్సై గోపాలరావు చెప్పారు.