హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): తెలంగాణ నుంచి యాసంగి బియ్యం కొననే కొనం అని కేంద్రం చేతులెత్తేసింది. రైతేమో నష్టపోవద్దాయే! సాటి రైతుగా ముఖ్యమంత్రి కేసీఆర్కు ఆ బాధేంటో తెలుసు. అందుకే, ఈ సీజన్లో వరి వేయకుండ్రి.. ఇతర పంటలు సాగు చేయుండ్రి అని పిలుపునిచ్చారు. ఆ పిలుపును అందుకొన్న రాష్ట్ర రైతాంగం ఇతర పంటలవైపు మళ్లుతున్నది. బుధవారం వరకు 13,180 ఎకరాల్లోనే రైతులు వరిని సాగుచేశారని వ్యవసాయ శాఖ పేర్కొన్నది. గత ఏడాది ఇదే సమయానికి 37,333 ఎకరాల్లో వరి సాగైంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు రైతుల్లో మార్పు ఎంతలా వచ్చిందో. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంటలు కలిపి 8.93 లక్షల ఎకరాల్లో సాగయ్యాయి. గతేడాది ఈ సమయానికి 6.15 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. గతంతో పోల్చితే ఈ సీజన్లో 2.78 లక్షల ఎకరాలు అధికంగా సాగైంది. ఇందులో అత్యధికంగా 2.93 లక్షల ఎకరాల్లో వేరుశెనగ పండిస్తుండగా, శెనగ 2.81 లక్షల ఎకరాలు, మక్కజొన్న 1.15 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈసారి 13 వేల ఎకరాల్లో పండిస్తున్న వరి కూడా రైతుల తిండి గింజలకేనని వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు.