పంచ నారసింహ క్షేత్రంగా విరాజిల్లుతున్న యాదాద్రిలో లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు అర్చకులు శ్రీకారం చుట్టారు. శుక్రవారం ప్రత్యేక పూజలతో గర్భాలయంలోని స్వయంభువుల అనుమతి పొందిన అనంతరం బాలాలయంలో పాంచరాత్రాగమ శాస్త్రయుక్తంగా ఉత్సవాలను ప్రారంభించారు. వేద మంత్రోచ్ఛరణ, చతుర్వేద, ప్రబంధ పారాయణాల నడుమ స్వామివారిని బంగారం, వజ్రవైఢూర్యాలు, విశేష పుష్పాలతో మనోహరంగా అలంకరించి స్వస్తీవాచనం, విష్వక్సేన పూజ, రక్షాబంధనం, మంత్రపుష్ప నీరాజనం జరిపించారు. సాయంత్రం మృత్సంగ్రహణం, అంకురారోపణం నిర్వహించారు. విశ్వ శాంతి, లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ మొదలుపెట్టిన ఉత్సవ పర్వంతో యాదాద్రి క్షేత్రం వైకుంఠ వైభవాన్ని సంతరించుకున్నది. తొలి పూజల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్.గీత, ప్రధానార్చకులు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞిక సిబ్బంది, ఉప ప్రధానార్చకులు పాల్గొన్నారు.
యాదాద్రి, మార్చి4 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను శుక్రవారం శాస్ర్తోక్తంగా ప్రారంభించారు. బాలాలయంలోని ఉత్సవ మండపంలో పట్టు వస్ర్తాలు, ముత్యాల తలంబ్రాలతో దివ్య మనోహరంగా అలకంరించిన స్వామివారిని అధిష్టింపజేశారు. స్వామి వారికి నవ కలశాభిషేకం అనంతరం స్వస్తీ వాచనం జరిపారు. విష్వక్సేనారాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, రుత్వికరణం, మంత్ర పుష్పనీరాజన కార్యక్రమాలను పాంచరాత్రగమ శాస్ర్తానుసారంగా ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, యజ్ఞాచార్య బృందం, ఆలయ అర్చక బృందం, పారాయణీకులు అత్యంత వైభవంగా నిర్వహించారు. అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మృత్యంగ్రహణం, అంకురారోపణ వేడుకలను ఆగమ శాస్ర్తానుసారంగా జరిపించారు. ఈ వేడుకల్లో ఆలయ అనువంశిక ధర్మకర్త బి. నరసింహమూర్తి, కార్యనిర్వహణాధికారి ఎన్. గీత, ఆలయ ప్రధానార్చకులు నల్లన్ థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు, యాజ్ఞిక సిబ్బంది, ఉప ప్రధానార్చకులు వెంకటాచార్యులు, రంగాచార్యులు, సురేంద్రాచార్యులు, శ్రీధరాచార్యులు, సహాయ కార్య నిర్వహణాధికారులు గజవెల్లి రమేశ్బాబు, గట్టు శ్రవణ్కుమార్, ఆలయ పేష్కార్, పర్యవేక్షకులు, ఉద్యోగ సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిత్యారాధనల అనంతరం సాయంత్రం 6.30 గంటలకు మృత్యంగ్రహణం, అంకురారోపణ వేడుకలను నిర్వహించారు. అంకురారోపణకు ఆలయ అర్చక బృందం మంగళ వాయిద్యాలతో వెళ్లి భూమాతను పూజించి పుట్ట మన్ను స్వీకరించారు. మట్టిని కొత్త పాలికలో వేసి వాటిలో నవధాన్యాలు ఉంచి మంత్ర జపములతో ప్రోక్షణ చేసి తొమ్మిది పాలికలలో ఆవాహన గావించారు.
ఆది వరాహ మూర్తిగా అవతరించి భూ దేవిని ఉద్ధరించిన స్వామివారిని అర్చించడమే మృత్సంగ్రహణం. మృత్తికపై భగవానుడిని చిత్రించి పవిత్రమైన మృత్తికను సేకరించి పాలికలలో నింపి నవధాన్యాలతో మంత్రిస్తారని ప్రధానార్చకులు లక్ష్మీనరసింహాచార్యులు వివరించారు. పాలికలతో నింపి పవిత్ర జలాలలో ఉత్సవాంతం వరకు రోజూ ఆరాధనలు చేస్తారని తెలిపారు. చంద్రుడు ఎలా దినదినాభివృద్ధి చెందుతాడో అలాగే ఈ పాలికలలోని నవ ధాన్యాలు అభివృద్ధి చెందుతూ ఆహార ధాన్యాల కొరత లేకుండా లోకమంతా సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మిని పూజించడం ఈ వేడుకలోని ప్రత్యేకత అని వెల్లడించారు.
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం 11 గంటలకు ధ్వజారోహణం నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటలకు భేరీ పూజ, దేవతాహ్వానం, హవనం కార్యక్రమాలు జరుగుతాయి. బ్రహ్మోత్సవాల్లో రక్షాబంధన వేడుక ఎంతో విశిష్టమైనది. సర్వ కల్యాణ జనకం, సర్వశత్రు వినాశనం, ఆయురారోగ్య ప్రదాయకం, సంతానప్రదం మొదలగు ఎన్నో ఫలితాలు ఈ వేడుకలో ఉన్నాయని ప్రధానార్చకులు తెలిపారు. బ్రహ్మోత్సవాలు భక్త కోటికి కల్పవృక్షాలై అనుగ్రహ సంపదను వివిధ ప్రక్రియల ద్వారా అందించనుందన్నారు. కంకణధారణ ధరించిన వ్యక్తికి భూతప్రేత పిశాచాది రోగ బాధలు తొలగి సర్వావయాలు శుచి కలిగి మనస్సు నిర్మలమై పరమాత్ముని చేర్చగలిగినదిగా ఈ కంకణ ధారణ సూచిస్తుందని, స్వామి, అమ్మవారికి సమర్పించిన అనంతరం భగవానుడి పరిపూర్ణ అనుగ్రహం కలగాలని కల్యాణకరమైన రక్షాబంధనం భక్తులు ధరిస్తారని తెలిపారు. ఒక పవిత్రమైన భావన ఏర్పడి భగవంతుడిని త్రికరణ శుద్ధిగా సేవించేందుకు, యోగ్యత పొందేందుకు ఈ వేడుక నిర్వహిస్తారని, పరిపూర్ణ భగవత్ గ్రహప్రాప్తికి సంకేతమే ఈ రక్షా బంధనం అని అర్చకులు వెల్లడించారు.
బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలి పూజల నిర్వహణ సమయంలో భూదాన్ పోచంపల్లికి చెందిన పద్మశాలీ మహాజన సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం స్వామి, అమ్మవార్లకు పట్టువస్ర్తాలను ఆలయ ఈఓ గీత, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహ మూర్తికి అందజేశారు. సంఘం వారు ప్రతియేటా నియమ నిష్టలతో స్వామి, అమ్మవార్లకు స్వయంగా మగ్గంపై పట్టుతో తయారు చేసిన వస్ర్తాలను అందజేస్తారు. ఈ సారి అందజేసిన పట్టువస్ర్తాలు గతంలో లేని విధంగా 27 రోజుల పాటు శ్రమించి అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. మాఘ శుద్ధ పంచమి ఫిబ్రవరి 6 నుంచి పాల్గుణ శుద్ధ పాడ్యమి ఈ నెల 3 నాటికి వస్ర్తాలను పూర్తి చేశారు. స్వామి వారికి దోతి, కండువాకు జరి అంచుతో కూడిన పట్టు పంచె, అమ్మవారికి మెరూన్ రంగు అంచు, స్పష్టమైన నీలపు రంగు చీరపై చక్రాన్ని తీర్చిద్దిద్దారు. మరో చీర ఆకు పచ్చని అంచు రాజస్థాన్ డిజైయిన్తో తయారు చేయగా, రస్ట్ రంగుతో తీర్చిదిద్దారు. పూర్తి ఆధ్యాత్మిక భావం ఉట్టిపడేలా ఉన్న చీరలు భక్తులను ఆకట్టుకోనున్నాయి.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయ పునర్నిర్మాణ పనుల్లో భాగంగా స్వామివారి బ్రహ్మోత్సవాలు బాలాలయంలోనే కొనసాగుతున్నాయి. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉత్సవాల ప్రారంభానికి ముందు స్వామివారి గర్భాలయంలో స్వామివారిని ఉత్సవాలు నిర్వహణకు అనుమతిని స్వీకరించారు. స్వామి వారికి రక్షా బంధనాలు, వేద మంత్రోచ్ఛరణలు, డోలు వాయిద్యాలు, సన్నాయి మేళాల నడుమ ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈఓ ఎన్. గీత, ప్రధానార్చకులు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు, మోహనాచార్యులు స్వామివారి గర్భాలయంలోకి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించి అనుమతిని పొందారు.
స్వామి వారి బ్రహ్మోత్సవంలో లోకములన్నీ శుభ పరంపరలు పొందాలని అష్ట దిక్పాలకులు ఇంద్రాది దేవతలు, సమస్త దివ్య సంపద కలిగిన దివ్య పురుషులను వేడుక ద్వారా ఆహ్వానించి ఆరాధన చేశారు. మంత్రాధీనమైన దేవతలకు ఆయా మంత్రోచ్ఛరణల ద్వారా దివ్యశక్తి ఏర్పడుతుందని, దాంతో సమస్తలోకాలు శాంతిమయం కాగలవని, ఈ స్వస్తీవాచన వేడుక సూచిస్తున్నదని ఆలయ ప్రధానార్చకులు నల్లన్థిఘళ్ లక్ష్మీనరసింహాచార్యులు తెలిపారు.
యాదాద్రి, మార్చి4 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ప్రారంభమైన 28వ అఖండ జ్యోతి పాదయాత్ర శుక్రవారం రాత్రి యాదాద్రికి చేరుకుంది. హైదరాబాద్లోని బర్కత్పుర యాదగిరిభవన్లో ఈ నెల 1 ప్రారంభమైన యాత్ర ఉప్పల్, ఘట్కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయగిరి మీదుగా గుట్టకు చేరింది. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి, ఆలయ ఈఓ ఎన్. గీత, ఆలయ అర్చకులు, అధికారులు, భక్తులు, స్థానికులు ఘన స్వాగతం పలికారు. అఖండ జ్యోతియాత్ర రథం ముందు ఆలయ అర్చకులు వేదపారాయణ పఠనం జరిపారు. అనంతరం భక్తులకు ప్రసాదాల వితరణ చేశారు. ఆ తర్వాత అఖండ జ్యోతి యాత్ర కొండపైకి వెళ్లింది. ఉత్సవ విగ్రహాన్ని రాయగిరి చెరువులో నిమజ్జనం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ ఎరుకల సుధాహేమేందర్గౌడ్, ఆలయ ఏఈఓ గజవెల్లి రమేశ్బాబు, టీఆర్ఎస్ నాయకులు పెలిమెల్లి శ్రీధర్గౌడ్, ముఖ్యర్ల సతీశ్యాదవ్ ఆలయ అర్చకులు పాల్గొన్నారు. అంతకుముందు భువనగిరి పట్టణానికి చేరుకున్న అఖండ జ్యోతియాత్రకు కలెక్టర్ పమేలా సత్పతి పూజలు చేశారు.
యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవాల్లో మొదటగా చేసేది విష్వక్సేన ఆరాధన. ఆగమశాస్త్ర ప్రకారం భగవంతుడిని ఆరాధించే ప్రక్రియలో ఇదొకటి. విష్వక్సేనారాధన ద్వారా సమస్త విఘ్నములు తొలగి సకల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, అనంతమైన దివ్య తేజస్సులను పొందాలని అలయ అర్చకులు, యాజ్ఞికులు, పారాయణీకులు ప్రత్యేక పూజలు చేశారు. ఉత్సవ నిర్విఘ్న పరి సమాప్తితోపాటు విశ్వ శాంతి లోక కల్యాణం మొదలగు ఎన్నో శుభ పరంపరలు ఈ వేడుక ద్వారా పొందాలని కోరినట్లు ఆలయ అర్చకులు వివరించారు.
అంకురం అనగా బీజం అని, చీమ నుంచి బ్రహ్మ వరకు ఉండే హృదయాలను సూచిస్తుంది. పాలిక శరీరం అని, మృత్తిక పాంచ భౌతికమైందని, అందులో బీజం జీవాత్మ తత్తం అని, అది వికసించి పరమాత్మ అనుగ్రహం పొందడమే ఆ పాలికలలో ధాన్యం పండుట అని శాస్త్రం చెబుతుందని అర్చక స్వాములు వివరించారు. పండిన ధాన్యాన్ని దర్శిస్తే కలిగే అనందమే పరమాత్మ స్వరూపం అని, ఈ వేడుకలు ఆహ్లాదాన్ని, భగవంతుడి అనుగ్రహాన్ని అందిస్తాయని తెలిపారు.
యాదాద్రి, మార్చి4 : యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకునేందుకు శుక్రవారం భక్తులు క్యూ కట్టారు. కొండకింద పాతగోశాల వద్ద సత్యనారాయణ స్వామి వ్రతాల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. స్వావి వారి ఖజానాకు రూ. 9,83,140 ఆదాయం సమకూరిందని ఈఓ ఎన్. గీత తెలిపారు.
స్వామి దివ్య విమానగోపురం స్వర్ణతాపడానికి ఆలయ ఉప ప్రధానార్చకుడు సురేంద్రా చార్యులు కుటుంబసమేతంగా శుక్రవారం రూ. 31,116 విరాళం సమర్పించారు. ఇందుకు సంబంధించిన డీడీని శుక్రవారం యాదాద్రి ఈఓ కార్యాలయంలో ఈఓ ఎన్.గీతకు అందజేశారు.
యాదాద్రి : యాదాద్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కొండకింద గల తులసీ కాటేజీలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. హైదరాబాద్లోని ఏఎస్రావు నగర్కు చెందిన ధన్వంతరి ఆయుర్వేద వైద్యశాల ఆధ్వర్యంలో 200 మంది భక్తులకు ఉచిత వైద్యం అందించారు.
ప్రధాన బుక్కింగ్ ద్వారా 57,400
రూ. 100 దర్శనం టిక్కెట్ 30,700
వేద ఆశీర్వచనం 1,200
నిత్యకైంకర్యాలు 300
సుప్రభాతం 1,000
ప్రచారశాఖ 480
క్యారీబ్యాగుల విక్రయం 7,700
వ్రత పూజలు 76,800
కళ్యాణకట్ట టిక్కెట్లు 18,400
ప్రసాద విక్రయం 4,17,690
వాహనపూజలు 7,400
టోల్గేట్ 880
అన్నదాన విరాళం 13,550
సువర్ణ పుష్పార్చన 85,400
యాదరుషి నిలయం 58,340
పాతగుట్ట నుంచి 35,220
గోపూజ 600
లీసెస్, లీగల్ 1,25,080