యాదాద్రి భువనగిరి, మార్చి 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): యాదాద్రి క్షేత్రంలోని ఏ ప్రాంతమైనా యాత్రికుల్లో భక్తిభావంతోపాటు ఆహ్లాదాన్ని పెంపొందించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం నెరవేరుతున్నది. సీఎం దిశానిర్దేశంతో పంచనారసింహుల ఆలయ నలుమూలలను ఆధ్యాత్మిక, పర్యాటక హంగులతో తీర్దిదిద్దుతున్నారు. ఆలయం చుట్టూ నిర్మించిన వలయ రహదారి, రహదారి కూడళ్లలో పెంచుతున్న వివిధ రకాల పూలమొక్కల అందాలు చూడతరమా అనేలా కనువిందు చేస్తున్నాయి. కృష్ణ శిలల సౌందర్యం, పచ్చందాల సోయగాలతో నారసింహుని క్షేత్రం భక్తుల మదిని దోచుకొంటున్నది. వేప, మర్రి, పగోడా, గుల్మొహర్, కశ్మీర్ రోజ్, సంపంగి, కొబ్బరి, అశోక, జువ్వి, బిగ్నోనియా, బోగన్విల్ల, రాయల్ ప్లామ్స్, ఫ్రైడ్ ఆఫ్ ఇండియా తదితర 98 రకాలకు చెందిన ఫల, పుష్ప, ఔషధ, సుగంధ మొక్కలు, నీడనిచ్చే మహావృక్షాలను థాయ్ల్యాండ్, బెంగళూరు, రాజమహేంద్రవరం, కోల్కతా, పుణే తదితర ప్రాంతాల నుంచి తెప్పించారు. వివిధ రకాలకు చెందిన 1.50 లక్షల పూల మొక్కలు, చెట్లతో క్షేత్రం ఆసాంతం పచ్చదనంతో వెల్లివిరుస్తున్నది. చెట్లను కొట్టివేయకుండా ట్రాన్స్ లొకేషన్ పద్ధతిలో పునర్జన్మనిస్తుండడంతోపాటు వర్టికల్ గార్డెన్తో కొండ, గుట్టలనూ సైతం పూల మొక్కలతో సుందరీకరిస్తున్నారు. ప్రధానాలయం చుట్టూ చేపడుతున్న ఈ పచ్చందాలకే వైటీడీఏ సుమారు రూ.3.50 కోట్ల వరకు వెచ్చిస్తున్నది.
హైదరాబాద్, మార్చి 17(నమస్తే తెలంగాణ): నామమాత్రపు ధరకు ఇంటిస్థలాలు కేటాయించాలన్న యాదాద్రి ఆలయ సిబ్బంది విజ్ఞప్తిని పరిశీలించి.. తగు సిఫారసులు చేసేందుకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ ఉత్తర్వులు జారీచేశారు. ఆలయ ఈవో ఎన్ గీత కన్వీనర్గా ఉండే ఈ కమిటీలో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, ప్రభుత్వ విప్ జీ సునీత, యాదాద్రి కలెక్టర్ పమేలాసత్పతి సభ్యులుగా ఉన్నారు. కమిటీకి అవసరమైన లాజిస్టిక్ సహకారం అందించాలని దేవాదాయశాఖను ప్రభుత్వం ఆదేశించింది.