ధాన్యం సేకరణపై చేతులెత్తేస్తున్న కేంద్రం తీరును నిరసిస్తూ బీజేపీ సర్కారుపై టీఆర్ఎస్ పార్టీ సమర శంఖం పూరించింది. మోదీ ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై నిరసనకు పిలుపునిచ్చిన సీఎం కేసీఆర్ ఈ నెల 12న అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఆ మేరకు రైతులకు వెన్నుదన్నుగా టీఆర్ఎస్ జిల్లా శ్రేణులు సమాయత్తం అవుతున్నాయి. ధర్నా విజయవంతంపై ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆయా నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నిబంధనలను గౌరవిస్తూనే.. చేపట్టాల్సిన ఆందోళనపై దిశానిర్ధేశం చేశారు. టీఆర్ఎస్ నిర్ణయంపై రైతాంగంతోపాటు రైతు సంఘాలు నుంచి కూడా హర్షం వ్యక్తమవుతున్నది.
యాదాద్రి భువనగిరి, నవంబర్ 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై రైతాంగంతోపాటు అన్నివర్గాల ప్రజానీకం మండిపడుతున్నది. ఈ క్రమంలో రైతుల పక్షాన నిలిచేందుకు సీఎం కేసీఆర్ కూడా నిర్ణయించుకున్నారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా శుక్రవారం అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ధర్నాలో టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు నాయకులు, కార్యకర్తలు ప్రత్యక్షంగా పాల్గొని నిరసన గళం విప్పాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ధర్నాలో పాల్గొని రైతులకు అండగా నిలువాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు సైతం పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ పిలుపుతో యాదాద్రి భువనగిరి జిల్లాలో టీఆర్ఎస్ శ్రేణులు ధర్నా విజయవంతానికి సన్నద్ధమవుతున్నాయి. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతోపాటు రైతులు ధర్నాలో పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేసేలా కార్యాచరణను రూపొందించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సైతం సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ధర్నాకు భారీగా రైతాంగం తరలివచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు చెందిన రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు సైతం ఆయా మండలాల్లో పార్టీ శ్రేణులను సన్నద్ధం చేస్తున్నారు. ఇటీవల కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, పట్టణ, వార్డు కమిటీలకు బాధ్యతలు అప్పగించారు.
కలెక్టర్ అనుమతితో ధర్నాలు
ధర్నాలకు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ప్రతిబంధకంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లాల కలెక్టర్ల నుంచి అనుమతులు తీసుకుని ధర్నా కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ నేతలకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు ఇప్పటికే అనుమతుల కోసం దరఖాస్తు చేశాయి.
రైతు పక్షపాతి టీఆర్ఎస్ ప్రభుత్వం
మొదటి నుంచి రైతు పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతుల పక్షాన నిలబడడాన్ని పలు పార్టీలు, రైతు, ప్రజా సంఘాలు స్వాగతిస్తున్నాయి. రుణ మాఫీ, రైతు బంధు, రైతుబీమా వంటి పథకాలను అమలు చేసి దేశంలోనే రాష్ట్రం రోల్ మోడల్గా నిలిచింది. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టిన సందర్భంలో సీఎం కేసీఆర్ సూచనలకు అనుగుణంగా టీఆర్ఎస్ ఎంపీలు పార్లమెంట్లో తీవ్రంగా వ్యతిరేకించారు. ఇక యాదాద్రి జిల్లా విషయానికొస్తే.. కరువు కాటకాలతో తల్లడిల్లుతున్న ప్రాంతాలకు ఈ ఏడాది గోదావరి జలాలను అందుబాటులోకి తెచ్చారు. అటు మూసీ, ఇటు గోదావరి జలాలతో జిల్లా సస్యశ్యామలమై సాగు విస్తీర్ణం సైతం నాలుగైదేండ్లుగా గణనీయంగా పెరుగుతూ వస్తున్నది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలతో రైతాంగం మునుపటి కంటే సంతోషంగా ఉండగా.. వరి ధాన్యం అమ్మకాల సందర్భంగా రైతాంగం పడుతున్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని ‘మీకు మేమున్నామంటూ’.. అండగా నిలుస్తుండడంతో సీఎం కేసీఆర్ వైఖరి పట్ల సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
రైతు ధర్నాను జయప్రదం చేయాలి : మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల
మునుగోడు : వరి ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా శుక్రవారం మునుగోడులో చేపట్టనున్న రైతు ధర్నాను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రంలో ధర్నా చేపట్టనున్న స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించి మాట్లాడారు. ధర్నాలో రైతులు, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు. ఆయన వెంట ఎంపీపీ కర్నాటి స్వామి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బండ పురుషోత్తంరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఏరుకొండ శ్రీను, సర్పంచ్ పందుల మారయ్య పాల్గొన్నారు.
కేంద్రం నిర్ణయం సరికాదు : ఎంపీపీ, మున్సిపల్ చైర్మన్
చౌటుప్పల్ : మునుగోడులో నిర్వహించనున్న ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు, ఎంపీపీ తాడూరి వెంకట్రెడ్డి తెలిపారు. స్థానిక వ్యవసాయ యార్డులో నిర్వహించిన టీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో వారు మాట్లాడుతూ ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో కేంద్రం విముఖత చూపడం సరైంది కాదన్నారు. కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్రెడ్డి, సింగిల్విండో చైర్మన్ చింతల దామోదర్రెడ్డి, టీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు గిర్కటి నిరంజన్గౌడ్, ముత్యాల ప్రభాకర్రెడ్డి, ప్రధాన కార్యదర్శులు మాధవరెడ్డి, గుండబోయిన వెంకటేశ్యాదవ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ కొత్త పర్వతాలు యాదవ్ పాల్గొన్నారు.