హైదరాబాద్ : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని రామవరంలో ఉన్న మాతా శిశు సంరక్షణ కేంద్రం(Ramavaram MCH) (ఎంసీహెచ్)లో ఓ బాలింత(Woman dies) మృతిచెందిన ఘటన గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. ఇదే జిల్లాలోని జూలూరుపాడు మండలం టాక్యాతండాకు చెందిన బానోత్ చంద్ర (27) మొదటి కాన్పు ప్రసవం కోసం బుధవారం ఉదయం ఎంసీహెచ్లో చేరింది.
పరీక్షించిన అనంతరం రాత్రి సుమారు 11 గంటల సమయంలో వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేశారు.
పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది. అనంతరం బాలింతకు రక్తస్రావం ఆగకపోవడంతో వైద్యులు వెంటనే ఆపరేషన్ చేసి గర్భసంచిని తొలగించారు. ఈ క్రమంలో గురువారం తెల్లవారుజామున సుమారు నాలుగు గంటల సమయంలో చంద్ర మృతి చెందింది.
అయితే, వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే ఆమె మరణించిందంటూ ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, ప్రసవ సమయంలోనే ఆమెకు అధిక రక్తస్రావం జరిగిందని, దానికితోడు కార్డియాక్ అరెస్ట్ అయిందని, అందువల్లనే ఆమె మరణించిందని వైద్యులు చెబుతున్నారు.