అహ్మదాబాద్ : గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లోని ఓ కొవిడ్ దవాఖానకు నిత్యం వస్తున్న ఓ మహిళ.. చనిపోయిన తన కుమారుడితో ఫోన్లో మాట్లాడుతుంది. తన కుమారుడు కరోనాతో చనిపోయిన విషయం తెలిసినప్పటికీ కన్నపేగును చంపుకోలేక ఏనాటికైనా ఆరోగ్యవంతుడై తిరిగొస్తాడన్న ఆశతో నిత్యం అక్కడికి వస్తూ పోతోంది. ఈ హృదయవిదారక ఘటనను చూసిన వాళ్లంతా చలించిపోతున్నారు. ఆమె ఆరోగ్యం పట్ల కుటుంబసభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నా.. కొడుకు కోసం కన్నపేగు పడుతున్న ఆరాటాన్ని ఆపలేకపోతున్నారు.
అహ్మదాబాద్ నగరానికి చెందిన పూనమ్ సోలంకి అనే 60 ఏండ్ల వయసు పైబడిన ఓ మహిళ నిత్యం అక్కడి కోవిడ్ దవాఖానకు వస్తున్నది. రాగానే చేతిలో ఉన్న మొబైల్ ఫోన్ తీసి కొడుకు మహేంద్రతో మాట్లాడుతుంది. ఆరోగ్యం జాగ్రత్త..! ఆహారం బాగా పెడుతున్నారా? అంటూ ఆరా తీస్తుంది. నీవు ఆరోగ్యంగా ఇంటికి రావాలని దేవుడ్ని నిత్యం కోరుకుంటున్నా అని ఆప్యాయంగా చెప్తున్నది. ఇలా ప్రతి నిత్యం ఐదు నిమిషాల పాటు ఫోన్లో మాట్లాడుతుంది.
నిజానికి ఆమె కుమారుడు మహేంద్ర కరోనా వైరస్ కారణంగా గత ఏడాది సెప్టెంబర్ 24 న కన్నుమూశాడు. ఈ విషయం ఆమెకు తెలుసు. అయినప్పటికీ నిత్యం అలా దవాఖాన వద్దకు వచ్చి కుమారుడితో మాట్లాడుతున్నట్లు నటిస్తుంది. చివరిసారిగా కుమారుడితో మాట్లాడిన వీడియో చాటింగ్ను రికార్డింగ్ను చూసి వెళ్లిపోతుందని ఆమె బంధువులు తెలిపారు. ఆమె ఆరోగ్యం విషయంలో ఇబ్బందికరంగా ఉన్నా.. కన్నకొడుకుతో అలా మాట్లాడుతున్నట్లుగా భావిస్తున్న ఆమెను భంగపరచడం ఎందుకని ఊరుకుంటున్నామని, ఆమె దుఃఖాన్ని ఆపడానికి ఇదే మంచి మార్గమని నమ్ముతున్నట్లు వారు చెప్తున్నారు.
నరోల్లో పాల బూత్ నడిపే మహేంద్ర గత ఏడాది సెప్టెంబర్ నెలలో కరోనా వైరస్కు గురై దవాఖానలో చేరాడు. ఐదారు రోజుల తర్వాత పరిస్థితి విషమించి చనిపోయాడు. తల్లితో చాలా సాన్నిహిత్యం కలిగి ఉండేవాడు. తల్లిని ఎంతగానో ప్రేమించేవాడు. అలాంటి కుమారుడు కరోనా కాటుకు గురవడంతో ఆ తల్లి తట్టుకోలేకపోతున్నది. నిత్యం చివరిసారి వీడియో కాల్ మాట్లాడిన ప్రాంతానికి వచ్చి ఆ రికార్డింగ్ కాల్ను చూసి ఇంటికి వెళ్లిపోతున్నది. ఆమెను అలా చూస్తున్న వాళ్లంతా చలించిపోతున్నారు.
నెల రోజుల క్రితం కొవిడ్-19 తో చనిపోయిన తన తండ్రి ఆరోగ్యం గురించి ఒక యువతి నిత్యం వాకబు చేస్తున్నదని ఒక ప్రైవేట్ దవాఖానకు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ కెవిన్ పటేల్ చెప్పారు. కొద్దిరోజుల పాటు చికిత్స అందించిన తర్వాత ఒక్కపెట్టుగా పది నిమిషాల పాటు ఏడ్చిందని, అప్పటి నుంచి ఆమె తండ్రి చనిపోయినట్లుగా నమ్ముతున్నదని ఆయన తెలిపారు.
ఇలాంటి మరో కేసులో ఓ బ్యాంకు ఉద్యోగి తన భార్య చనిపోయినప్పటికీ ఆమె తన సోదరుడి ఇంటికి పోయినట్లు భావిస్తున్నారని మరో సైకియాట్రిస్ట్ డాక్టర్ నేహల్ షా చెప్పారు. కరోనా వైరస్కు గురై చనిపోయిన వారి మరణాలు అసహజమైన మరణాలు కావడంతో పలువురు మానసికంగా కుంగిపోయి అలా ప్రవర్తిస్తుంటారని పేర్కొన్నారు.
గర్భంతో ఉన్నా.. మండుటెండ, కరోనాను లెక్కచేయకుండా విధుల్లో డీఎస్పీ.. వీడియో వైరల్
వీటితో కరోనాకు చెక్ పెట్టొచ్చు.. శాస్త్రవేత్తల పరిశోధనలో సంచలన విషయాలు
రష్యా నుంచి వైదొలిగిన అమెరికా రాయబారి
వలస కార్మికులను ఆర్థికంగా ఆదుకోండి: రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ విదేశీ పర్యటనలపై కరోనా నీలిమేఘాలు
డొమినోస్ 18 కోట్ల కస్టమర్ల డాటా లీక్
కరోనా ఎఫెక్ట్ : ఆక్సిజన్ కోసం రెండు రాష్ట్రాల తగువులాట..!
పిచ్బ్లెండ్ నుంచి రేడియం వేరుచేసిన మెర్క్యూరీ.. చరిత్రలో ఈరోజు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..