వినాయక్నగర్, ఏప్రిల్ 18: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. జిల్లా సరిహద్దుల్లో ప్రత్యేక బృందాల ద్వారా వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో మార్చి 16 నుంచి ఏప్రిల్ 18వ తేదీ వరకు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన నగదు, లిక్కర్, ఇతర వాటి వివరాలను సీపీ కల్మేశ్వర్ సింగేనవార్ వెల్లడించారు. నిజామాబాద్ అర్బన్లో రూ.39.92లక్షలు, 276 లీటర్ల లిక్కర్, రూ.28లక్షలు విలువజేసే 400 గ్రాముల బంగారం పట్టుకున్నారు. నిజామాబాద్ రూరల్ పరిధిలో రూ.లక్షా7వేల540 నగదు, 464 లీటర్ల లిక్కర్ను సీజ్ చేశారు. ఆర్మూర్ పరిధిలో రూ.67వేల నగదు, 293 లీటర్ల లిక్కర్ పట్టుబడింది. బాల్కొండలో రూ.5.90లక్షల నగదు, 1263 లీటర్ల లిక్కర్, రూ.30.19 లక్షల విలువచేసే 1,77,130 బహుమతులను సీజ్ చేశారు. బోధన్ పరిధిలో రూ.54,620 నగదు, 251 లీటర్ల లిక్కర్, రూ.57వేల విలువజేసే గిఫ్టులను పట్టుకున్నారు. బాన్సువాడ పరిధిలో రూ.4.59లక్షల నగదు, 183లీటర్ల లిక్కర్, రూ.లక్షా17వేల విలువజేసే 4.69 గ్రాముల గంజాయిని సీజ్ చేసినట్లు సీపీ తెలిపారు. తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని పేర్కొన్నారు.