Supreme Court | సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తుల సెలవులపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయమూర్తులకు శని, ఆదివారాలు సెలవులు కూడా దొరకవని… దీర్ఘకాలంగా సెలవులు పెట్టి న్యాయస్థానాలు, న్యాయమూర్తులను విమర్శించే వారికి ఈ విషయం అర్థం కాదని వ్యాఖ్యానించింది. పశ్చిమ బెంగాల్కు సంబంధించిన కేసులో వాదనలకు సుప్రీంకోర్టు గురువారం నిర్ణయించడంతో సెలవుల అంశం తెరపైకి వచ్చింది. మే 20 నుంచి సుప్రీం కోర్టు వేసవి సెలవులకు వెళ్లేలోపు వాదనలు పూర్తి చేయాలని ఇరు పక్షాలను కోర్టు కోరింది.
పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సందీప్ మెహతాతో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. సీబీఐ రాష్ట్రం నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా దర్యాప్తు చేసిందని ఆరోపించారు. విచారణ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనం ఎదుట మాట్లాడుతూ.. ‘అత్యున్నత న్యాయస్థానం, హైకోర్టు లాంగ్ లీవ్లు తీసుకుంటాయని విమర్శించే వారికి న్యాయమూర్తులు ఎలా పని చేస్తారో తెలియదన్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు రోజూ 50 నుంచి 60 కేసులను పరిష్కరిస్తారని, వారికి సెలవు పెట్టేందుకు అర్హులని తెలిపారు.
ఆయన వ్యాఖ్యలపై జస్టిస్ గవాయ్ స్పందిస్తూ శని, ‘ఆదివారాల్లో మాకు సెలవులు లేవన్న విషయం విమర్శించే వారికి అర్థం కావడం లేదని.. శని, ఆదివారాలు తమకు కాన్ఫరెన్స్లు, ఇతర అసైన్మెంట్స్ ఉంటాయన్నారు. సెలవుల్లో సైతం న్యాయమూర్తులు తాము విచారించే కేసులపై సుదీర్ఘ తీర్పులు రాయాల్సి ఉంటుందని ధర్మాసనం పేర్కొంది. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తరఫున ఈ కేసులో హాజరవుతున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్.. ‘ఇది దేశంలోనే అత్యంత కష్టతరమైన పని’ అని అభిప్రాయపడ్డారు.