కామారెడ్డి/ఖలీల్వాడి, ఏప్రిల్ 30: పదో తరగతి ఫలితాల్లోనూ బాలికలు సత్తా చాటారు. ఉత్తీర్ణత శాతంలో బాలురు వెనుకబడ్డారు. ఉమ్మడి జిల్లాలో 92 శాతానికి పైగా విద్యార్థులు పాసయ్యారు. మంగళవారం వెల్లడైన టెన్త్ ఫలితాల్లో నిజామాబాద్ జిల్లా రాష్ట్ర స్థాయిలో 14వ స్థానంలో నిలిచింది. కామారెడ్డి జిల్లా 19వ స్థానానికి పడిపోయింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 21,858 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా, 20,486 మంది (93.72 శాతం) పాసయ్యారు. కామారెడ్డిలో మొత్తం 11,926 మంది పరీక్షలు రాయగా, 11,057 మంది (92.90 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 3 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇక, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు దరఖాస్తు చేసుకునేందుకు విద్యార్థులకు 15 రోజుల పాటు అవకాశం కల్పించారు.
ఇందూరు జిల్లాలో బాలుర కన్నా బాలికలే అత్యధికంగా ఉత్తీర్ణులయ్యారు. మొత్తం 10,714 మంది బాలికలు పరీక్షలు రాయగా, 10,156 మంది (94.79 శాతం) పాసయ్యారు. ఇక, 11,144 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, 10,330 మంది (92.70 శాతం) ఉత్తీర్ణులయ్యారని డీఈవో దుర్గాప్రసాద్ తెలిపారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్కు దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు ఫలితాలు వచ్చిన రోజు నుంచి 15 రోజుల్లో ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
పదో తరగతి ఫలితాల్లో కామారెడ్డి స్థానం దిగజారింది. 92.90 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో 19వ స్థానానికి పడిపోయింది. మొత్తం 11,926 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, 11,057 మంది (92.90 శాతం) పాస్ అయ్యారు. గతేడాదితో పోలిస్తే ఉత్తీర్ణత శాతం తగ్గింది. కామారెడ్డి జిల్లాలోనూ బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 6,047 మంది బాలికలు పరీక్షలు రాయగా, 5,706 మంది (94.36 శాతం) పాసయ్యారు. ఇక, 6,238 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, 5,351 మంది (91.02 శాతం) ఉత్తీర్ణులయ్యారని డీఈవో రాజు తెలిపారు. బీసీ సంక్షేమ పాఠశాలలకు చెందిన విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. సోషల్ వెల్ఫేర్ విద్యార్థులు 99.04 శాతం, ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థులు 98.09 శాతం పాసయ్యారని వివరించారు. జిల్లాలో మొత్తం 869 మంది ఫెయిల్ అయ్యారన్నారు.
పదోతరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు షెడ్యూల్ ప్రకటించారు. జూన్ 3 నుంచి 13 వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 22వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని అధికారులు సూచించారు.